TamiliIsai Arrest Stalin | తమిళనాడులో త్రిభాషా వివాదం మరింత తీవ్రమైంది. త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో.. బీజేపీ నేతలను తమిళనాడు పోలీసులు అడ్డుకున్నారు. మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరాజన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు తమిళ రాష్ట్రంలో రాజకీయాలు సీరియస్ అయ్యాయి. తమిళసై అరెస్టుతో బిజేపీ తీవ్ర నిరసనలు చేపట్టే అవకాశముంది.
ఒకవైపు స్టాలిన్ ప్రభుత్వం తమిళ భాష ముద్దు.. హిందీ వద్దు అనే రీతిన కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభిస్తే.. మరోవైపు రాష్ట్రంలో త్రిభాషా విధానానికి మద్దతుగా ఇంటింటికి సంతకాలు సేకరించేందుకు బీజేపీ నిర్ణయించింది. అలాగే.. అధికార డీఎంకే అఖిల పక్ష సమావేశాన్ని బహిష్కరించే నిర్ణయం కూడా తీసుకుంది. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం మూడు భాషల విధానానికి తమిళ బిజేపీ నాయకులు మద్దతు తెలిపారు.
బుధవారం నుంచి త్రిభాషా విధానానికి మద్దతుగా తమిళనాడులో ఇంటింటికి సంతకాలు సేకరించడం.. ప్రచారం, అవగాహన కార్యక్రమాలు బీజేపీ చేపట్టింది. ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, శాంతిభద్రతల వైఫల్యాల గురించి చర్చించిన తమిళనాడు బిజేపీ కోర్ కమిటీ, రాబోయే రోజుల్లో తమిళ ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు నిర్వహించే నిర్ణయం తీసుకుంది.
మూడు నేర చట్టాలకు హిందీ పేర్లు పెట్టడమే దురభిమానం.. స్టాలిన్ చురకలు
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని (National Educational Policy) వ్యతిరేకిస్తూ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోషల్ మీడియాలో ద్వారా స్పందించారు. తాము కోరుకునేది భాషా సమానత్వం మాత్రమేనని, అంతకు మించి విమర్శలు తగవని తెలిపారు. డీఎంకే ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు స్టాలిన్ ఒక కొటేషన్ ద్వారా ప్రత్యుత్తరం ఇచ్చారు. “మేం కోరుకునేది భాషా సమానత్వం. తమిళనాడులో తమిళ భాషకు ప్రాధాన్యం కల్పించమని అడుగుతున్నాం. అంతకు మించి దురభిమానం, పక్షపాతం అనే ముద్రలు మాపై వేస్తున్నారు. మీరు ప్రత్యేక హక్కులకు అలవాటుపడటంతో.. మేం కోరుకునే సమానత్వం కూడా అణచివేతగా కనిపిస్తుంది,” అని స్టాలిన్ పేర్కొన్నారు.
Also Read: తమిళనాడులో రాజకీయాలు పీక్స్.. హింధీ భాష, డీలిమిటేషన్లపై ఏకమవుతున్న పార్టీలు
స్టాలిన్ మరింతగా.. “దురభిమానం ఎలా ఉంటుందంటే, తమిళులు అర్థం చేసుకోలేని భాషలో మూడు నేర చట్టాలకు పేర్లు పెట్టడం లాంటిది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రాష్ట్రానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఎన్ఈపీని నిరాకరించినందుకు విద్యకు కావలసిన నిధులను ఆపడం దురభిమానానికి నిదర్శనం,” అని ఆయన విమర్శించారు.
స్టాలిన్.. “గాడ్సే భావజాలాన్ని కీర్తించే వ్యక్తులు, చైనా దురాక్రమణ, కార్గిల్ యుద్ధం, బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిపిన యుద్ధాల్లో అత్యధిక నిధులు అందించిన డీఎంకే ప్రభుత్వ దేశభక్తిని ప్రశ్నిస్తున్నారు,” అని కేంద్రంలోని బీజేపీకి పరోక్షంగా చురకలంటించారు.
జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. హిందీయేతర ప్రాంతాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని డీఎంకే ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ వివాదంలో.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం నిలిపివేసిందని డీఎంకే ప్రభుత్వం ఆరోపించింది. కానీ ఈ ఆరోపణలను కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం తోసిపుచ్చింది.