Bhind Road Accident: ఉపాధి కోసం ఊరు కాని ఊరు వచ్చి, కష్టపడి పని ముగించుకుని తిరిగి సొంత ఇంటికి బయల్దేరిన ఆ పేద కూలీలను విధి వెక్కిరించింది. రెప్పపాటులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎనిమిది మంది ప్రాణాలను తీయగా, మరికొందరిని ఆసుపత్రి పాలు చేసింది. మధ్యప్రదేశ్లోని బింద్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఈ కన్నీటి ఉదంతం చోటుచేసుకుంది.
ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ ప్రాంతానికి చెందిన కూలీలు కొద్దిరోజుల క్రితం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు వచ్చారు. అక్కడ వరినాట్లు వేసే పనిని విజయవంతంగా పూర్తి చేసుకుని.. తమ సొంత ఊరికి వెళ్లేందుకు ఒక పికప్ వాహనంలో బయలుదేరారు. వాహనం బింద్ జిల్లా పరిధిలోకి రాగానే, తెల్లవారుజామున హఠాత్తుగా రోడ్డుపైకి ఒక పశువు అడ్డుగా వచ్చింది.
రక్తసిక్తమైన రహదారి
అడ్డు వచ్చిన పశువును తప్పించేందుకు పికప్ వాహనం డ్రైవర్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి ఎదురుగా వేగంగా వస్తున్న డంపర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు పికప్ వాహనం నుజ్జునుజ్జయ్యింది. దీంతో అందులో ఉన్న కూలీలంతా లోపలే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో ముగ్గురు కన్నుమూశారు.
32 మందికి తీవ్ర గాయాలు
ఈ ఘటనలో మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణమంతా సరదాగా సాగిన వారి ఇంట్లో, ఈ ప్రమాదం కోలుకోలేని విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:పంట పొలాలకే కాదు.. మీ జేబుకూ చిల్లు! ఎల్నినో తెస్తున్న ఆర్థిక సంక్షోభం