Maha kumbh Stampede incident: యూపీలోని ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మౌని అమవాస్య సందర్భంగా విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
ఘటన నేపథ్యంలో సీఎం యోగికి గంట వ్యవధిలో మూడుసార్లు ఫోన్ చేశారు ప్రధాని నరేంద్రమోదీ. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటు హోంమంత్రి అమిత్ షా కూడా ఆరా తీశారు. పరిస్థితి గమనించి సీఎం యోగి ఆదిత్యనాథ్ మంత్రులు, అధికారులతో సమీక్ష చేపట్టి, వివరాలు తెలుసుకున్నారు. అధికారులను ఆదేశాలను పాటించాలని భక్తులకు సూచన చేశారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రియాక్ట్ అయ్యారు. తొక్కిసలాట ఘటన హృదయ విదారకంగా చెప్పుకొచ్చారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మేనేజ్మెంట్ కంటే సెల్ఫ్ ప్రమోషన్పై దృష్టి పెట్టడమే ఘటనకు కారణమన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఇలాంటి వ్యవస్థ ఉండడం ఖండించవలసిన విషయమన్నారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు ఖర్గే. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. భక్తుల వసతి, ఆహారం, ప్రథమ చికిత్స వాటిని విస్తృతం చేయాలన్నారు. వీఐపీల రాకపోకలను అరికట్టాలని సూచన చేశారు. మన సాధువులు కోరుకునేది కూడా ఇదేన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు అధ్యక్షుడు ఖర్గే.
ALSO READ: మహా కుంభమేళాలో తొక్కిసలాట, 15 మంది మృతి.. అసలేం జరిగింది?
మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. వీఐపీ కల్చర్, నిర్వహణ లోపం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. వీఐపీ కల్చర్ను అరికట్టి, సామాన్య భక్తుల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం మెరుగైన ఏర్పాట్లు చేయాలన్నారు. మహా కుంభమేళాకు చాలా సమయం ఉందని, చాలా మంది మహా స్నానాలు జరగాలన్నారు.
ఈ ఘటనపై మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. భక్తులు మరణించిన వార్త చాలా బాధాకరమన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఉత్తమ ఆసుపత్రులకు తరలించి తక్షణ వైద్య సహాయం చేయాలన్నారు. మృతులను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించాలన్నారు.
అలాగే వారి నివాసాలకు పంపించేందుకు తగి ఏర్పాట్లు చేయాలన్నారు. విడిపోయిన వారిని మళ్లీ కలిపేందుకు త్వరితగతిన కృషి చేయాలని సూచన చేశారు. ఈ క్లిష్ట సమయంలో భక్తులు సంయమనం పాటించి తీర్థయాత్రను శాంతి యుతంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమన్నారు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. భక్తులందరూ ఓపికగా ఉండాలని, విజ్ఞప్తి చేశారు. అలాగే అధికారుల సూచనలు తప్పనిసరిగా ఫాలో కావాలన్నారు.