Maharashtra-Karnataka Buses Halt| కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రస్తుతం నిలిచిపోయాయి. శుక్రవారం మహారాష్ట్ర సరిహద్దులకు సమీపంలో ఉన్న కర్ణాటకలోని బెలగావి జిల్లాలో కొందరు యువకులు కర్ణాటక ఆర్టీసీ బస్సు కండక్టర్ పై దాడి చేశారు. కండక్టర్ మరాఠీలో మాట్లాడలేదని చెబుతూ వారు చితకబాదారు. దీనికి ప్రతీకారంగా మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు కర్ణాటకలోని చిత్రదుర్గలో ప్రయాణిస్తున్న సమయంలో కొందరు కన్నడ యువకుడు బస్సుని మార్గ మధ్యలో ఆపి డ్రైవర్ ముఖానికి నల్ల రంగు పెయింట్ పూశారు.
ఇరువైపులా బస్సు సిబ్బందిపై దాడులు జరగడంతో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రయాణికులు, బస్సు సిబ్బంది భద్రతా దృష్ట్యా ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని మహారాష్ట్ర, కర్ణాటక అధికారులు జాతీయ మీడియాకు తెలిపారు.
బెలగావిలో అసలు ఏం జరిగిందంటే?
బెలగావి జిల్లాలోని మరిహాల్ అనే ప్రాంతంలో శుక్రవారం కర్ణాటక ఆర్టీసికి చెందిన బస్సు మహారాష్ట్ర వైపు వెళుతూ ఉండగా.. అందులో ఒక మరాఠీ యవతి ఆమె ప్రియుడితో ప్రయాణిస్తోంది.అయితే ఆ బాలిక మరాఠీలో బస్సు కండక్టర్ ని టికెట్ అడిగింది. కానీ ఆ కండక్టర్ ఆమె మాటలు అర్థం కాకపోవడంతో కన్నడలో సమాధానం ఇచ్చాడు. దీంతో ఆమె ప్రియుడు మరాఠీలో మాట్లాడాలని కండక్టర్ పై ఆగ్రహం చూపించాడు. ఈ కారణంగా కండక్టర్ కూడా అతనితో కోపంగా వ్యవహరించాడు. వాగ్వాదం పెరిగి ఆ బాలిక, ఆమె ప్రేమికుడు కండక్టర్ పై దాడి చేశారు. ఆ తరువాత వారిద్దరినీ బస్సు నుంచి కిందకు దింపేశారు. కానీ బస్సు కొంత దూరం వెళ్లాక కొంత మంది మరాఠీ యువకులు బస్సుని అడ్డగించి కండక్టర్ ను చితకబాదారు. మరాఠీలో మాట్లాడకపోతే దేహశుద్ధి ఇలాగే చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: తమిళనాట మళ్లీ భాషా రాజకీయం.. కేంద్రంపై ముఖ్యమంత్రి ఫైర్
ఆ తరువాత పోలీస్ స్టేషన్ వెళ్లి కండక్టర్ ఫిర్యాదు చేయగా.. ఆ బాలిక కండక్టర్ పై పోక్సో కేసు పెట్టింది. మైనర్ అయిన తనతో బస్సు కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు లో పేర్కొంది. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. కన్నడ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు పోక్సో కేసు కొట్టివేయాలని పోలీసులకు డిమాండ్ చేశారు. అయితే కండక్టర్ పై దాడి చేసిన వారిలో కొంతమందిని గుర్తించామని అందులో నలుగురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
ఆ తరువాత శనివారం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియుర్ తాలాకాలో మహారాష్ట్ర నుంచి కర్ణాటక వస్తున్న బస్సుని ఆపి కొంతమంది కన్నడ యువకులు బస్సు డ్రైవర్ పై దాడి చేశారు. డ్రైవర్ భాస్కర్ జాధవ్ ముఖంపై నల్ల రంగు పూరి వెళ్లిపోయారు.ఈ ఘటనపై కూడా స్థానకి పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. కొంతమంది యువకులను అరెస్టు చేశారు.
వరుసగా ఘటనలు జరగడంతో మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులు తాత్కాలికంగా కర్ణాటకకు రాకపోకలు చేయకుండా నిలివేశారు. కొంతమంది కన్నడ అతివాదులు తమ బస్సు సిబ్బందిపై దాడి చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే ఈ హింసాత్మక ఘటను ఇంతటితో ఆగిపోలేదు. ఆదివారం మహారాష్ట్రలో కర్ణాటక ఆర్టీసీకి చెందిన ఒక అల్ట్రా లగ్జరీ బస్సును కొంతమంది మహారాష్ట్ర నవనిర్మాణ సేన యవకులు ధ్వంసం చేశారు. జై మహారాష్ట్ర, జై మరాఠీ అంటూ బస్సుపై పెయింటు వేశారు.