Sleeping Pills Electrocution| జులై 13న, ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ఉన్న మాతా రూప్రాణి మాగ్గో ఆసుపత్రి నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన స్త్రీ గొంతులో భయం, ఆందోళన ఉంది. “నా భర్తకు… విద్యుత్ షాక్ తగిలింది. దయచేసి త్వరగా రండి!” అని ఆమె ఏడుస్తూ చెప్పింది. కరెంట్ షాక్ తగిలిన యువకుడి పేరు కరణ్ దేవ్, వయసు 36 సంవత్సరాలు. ఆరోగ్యవంతుడు, చురుకైనవాడు. కానీ, ఇప్పుడు అతను మరణించాడు.
ఆస్పత్రికి తీసుకొచ్చిన తరువాత డాక్టర్లు అతడు చనిపోయాడని ధృవీకరించారు. కానీ అతని మరణంలో సందేహాస్పదంగా ఏమీ కనిపించలేదు. కానీ ఈ కేసులో ఏదో తప్పుగా ఉందని ద్వారక పోలీసులకు అనిపించింది. ఒక యువకుడు, ఇంట్లో విద్యుత్ షాక్తో చనిపోవడం? ఇది చాలా సులభంగా, చాలా సరళంగా అనిపించింది. మొదట్లో ఈ మరణాన్ని ప్రమాదవశాత్తు జరిగినదిగా నమోదు చేశారు.
కానీ ఒక సీనియర్ పోలీసు అధికారి.. చనిపోయిన కరణ్ వయసు, అతను చనిపోయిన గదిని బాగా గమనించి మరణం సంభవించిన తీరుపై అనుమానంతో పోస్టు మార్టం (శవపరీక్ష) చేయాలని పట్టుబట్టాడు. అక్కడే కథ అడ్డం తిరిగింది. ఆశ్చర్యకరంగా, శవపరీక్ష చేయకూడదని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు—కరణ్ తండ్రి, కరణ్ తమ్ముడు (పిన్ని కొడుకు) రాహుల్ దేవ్. ఈ వ్యతిరేకత పోలీసుల సందేహాలను మరింత పెంచింది.
రహస్యం వెలుగులోకి
కరణ్ సొంత సోదరుడు కునాల్ దేవ్ నిశ్శబ్దంగా అన్నీ గమనిస్తూ ఉన్నాడు. అతడు కూడా తన అన్న కరణ్ మరణం ప్రమాదవశాత్తు జరగలేదని అనుమానించాడు. అతడి అనుమానానికి కారణం..? కరణ్ భార్య సుష్మితా, పిన్ని కొడుకు రాహుల్ మధ్య అక్రమ సంబంధం. ఎలాగైనా వారి గురించి ఆరా తీయాలని సుష్మితా సోషల్ మీడియా ఖాతాను కునాల్ హ్యాక్ చేశాడు. అక్కడ అనూహ్యంగా అసలు విషయం బయట పడింది. తన అన్న మరణం ఎలా జరిగిందో తన వదిన చాటింగ్ లో బయటపడింది.
కరణ్ భార్య సుష్మిత, అతని పిన్ని కొడుకు రాహుల్ మధ్య ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ల ద్వారా ఒక చీకటి కుట్ర బయటపడింది. ఆ మెసేజ్ లో సుష్మితా ఇలా రాసింది: “మందు తీసుకున్న తర్వాత ఎంత సమయంలో చనిపోతాడో చూడు. మూడు గంటలైంది, అతను ఆహారం తిని. వాంతి లేదు, బాత్రూం వెళ్లలేదు, ఏమీ జరగలేదు. ఇంకా చనిపోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదైనా ఐడియా ఇవ్వు.” దానికి రాహుల్ కూల్గా సమాధానమిచ్చాడు: “నీకు ఏమీ తోచకపోతే, అతనికి కరెంట్ షాక్ ఇవ్వు.”
పోలీసు విచారణలో వెలుగు చూసిన విషయాలు
విచారణలో తేలిన విషయం ఏమిటంటే.. తన భర్త కరణ్ను హత్య చేయడానికి సుష్మిత 15 నిద్రమాత్రలు ఆహారంలో కలిపి అతడికి పెట్టింది. అయినా కరణ్ పూర్తి మత్తులోకి వెళ్లలేదు. బతికే ఉన్నాడు. ఇది చూసిన సుష్మితా భయపడి పోయి తన ప్రియుడు రాహుల్కు మెసేజ్ పంపింది. రాహుల్ కరెంట్ షాక్ ఇవ్వమని చెప్పగానే.. ఆమె కరణ్ను విద్యుత్ తీగ దగ్గరకు తీసుకెళ్లి షాక్ ఇచ్చింది. అదే కరణ్ మరణానికి కారణమైంది.
హత్య ఎందుకు చేసింది
కరణ్కు అనుమానం వచ్చింది. కర్వాచౌత్ పండగ (భర్తల ఆరోగ్యం, దీర్ఘాయుషు కోసం భార్యలు చేసే ఉపవాసం) రోజున, సుష్మితాతో జరిగిన వాగ్వాదంలో ఆమెను కరణ్ చెంపదెబ్బ కొట్టాడు. ఈ అవమానం కారణంగా సుష్మితా తన భర్తకు దూరమై రాహుల్ ను ప్రేమించడం మొదలుపెట్టింది. అంతేకాదు కరణ్ ఆస్తి కాజేయాలని వారిద్దరూ ప్లాన్ కూడా చేశారు. అందుకోసం ముందుగా కరణ్ ను చంపేయాలని నిర్ణయించారు.
Also Read: కర్ణాటక సిఎం చనిపోయారా? మెటా కంపెనీ బ్లండర్పై మండిపడ్డ సిద్దరామయ్య
వారిద్దరి మధ్య ప్రేమ సందేశాలు, హత్య కుట్ర చాటింగ్లను కరణ్ తమ్ముడు కునాల్ బయటపెట్టాడు.ఇప్పుడు పోలీసులు ఆ చాటింగ్, కాల్ రికార్డులను లోతుగా పరిశీలిస్తున్నారు. ఇది కేవలం అక్రమ సంబంధం వల్ల జరిగిన హత్య? లేక ఆస్తి కోసం చేసిన పెద్ద కుట్ర అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. కరణ్ హత్య కేసులో అతని భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.