Microphone on Pawar: రాజకీయ నేతలు ప్రజల ముందుకు రావడానికి భయపడే రోజులు మొదలయ్యాయి . ఇది ఏ ఒక్క పార్టీకీ పరిమితం కాలేదు. నేతలు ప్రజల్లోకి వచ్చిన ప్రతీసారి ఇబ్బందులు తప్పడంలేదు. తాజాగా ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్పవార్ వంతైంది. సమావేశం ఆయన మాట్లాడుతుండగా మైక్రోఫోన్ ఒకటి ఆయనపైకి దూసుకురావడం కలకలం రేపింది. ఈ ఘటన పూణెలో జరిగింది.
మహారాష్ట్రలోని బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఓ సమావేశం జరిగింది. దీనికి శరద్పవార్తోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి పవార్ కూతురు సుప్రియసూలే బరిలో ఉన్నారు. ఆమెకి ప్రత్యర్థిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎస్సీపీ అధినేత అజిత్పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేస్తున్నారు. అయితే సభ జరుగుతుండగా ఓ విలేకరి మెక్రోఫోన్ను శరద్పవార్ పైకి విసిరారు.
అది పవార్ను తాకక ముందే ఆయన వెంట ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. శరద్పవార్ స్పీచ్ మరింత స్పష్టంగా రికార్డు చేయడం కోసం మైక్రోఫోన్ను ముందుకు విసిరానని ఆ విలేకరి చెప్పాడు. దానికి బదులుగా ముందున్న వ్యక్తులకు ఆ పరికరాన్ని అందజేసి వేదిక సమీపంలో ఉంచాలని అధికారులు అభిప్రాయపడ్డారు.
Also Read: పరీక్షలో ఫేలయ్యి.. ఫుల్లు ఫేమసయ్యాడు
ఇటీవల కాలంలో నేతలపై రాళ్లు, చెప్పులు, మైక్రోఫోన్లు విసిరిన ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర సందర్భంగా ఓ వ్యక్తి ఆయనపైకి రాయి విసిరాడు. జగన్ కన్ను పైభాగంలో తగిలింది. తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలోనూ ఇలాంటి ఘటన జరిగింది. కాకపోతే భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.
అంతకుముందు బీహార్ సీఎం నితీష్కుమార్ సభలోనూ ఓ వ్యక్తి చెప్పు విసిరారు. అదికాస్త స్టేజికి ముందు పడింది. అంతేకాదు గతంలో కేంద్ర మాజీమంత్రి చిదంబరం మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఓ రిపోర్టర్ చెప్పు విసిరిన సంగతి తెల్సిందే. ఆ తరహా ఘటనలను కంట్రోల్ చేయకుంటే రాబోయే రోజుల్లో నేతలకు మరిన్ని ఇబ్బందులు తప్పవన్నది రాజకీయ విశ్లేషకుల చెబుతున్నమాట.