Teen Student Hangs Self in Rajasthan’s Kota, 8th Suicide This Year: రాజస్థాన్లోని కోటాలో విద్యార్ధుల ఆత్మహత్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఒక విద్యార్ధిని పరీక్షల ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన సౌమ్య (19) రాజస్థాన్లోని కోటాలో నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) కోసం సిద్ధమవుతున్న సమయంలో బుధవారం తన హాస్టల్లోని ఒక గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
వారు కోటాకు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. సౌమ్య మృతితో ఈ ఏడాది ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధులు సంఖ్య ఎనిమిదికి చేరింది. కాగా.. రెండు రోజుల్లో ‘కోచింగ్ హబ్’లో ఇది రెండో ఘటన. ఈ ఏడాది మార్చి 25నే నీట్కు సిద్ధమవుతున్న విద్యార్థి ఉరుజ్ ఖాన్ (20) కోటాలోని తన అద్దె గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించాడు. ఇతను ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్కు చెందినవాడు.
Also Read: కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట.. పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ తిరస్కరణ..
గతేడాది నీట్కు సిద్ధమవుతున్న సమయంలో కోటాలో 29 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో విద్యార్దుల వరుస ఆత్మహత్యలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలపై స్పందించిన కేంద్రం కోచింగ్ సెంటర్లకు పలు ఆదేశాలు జారీచేసినా ఫలితం కనిపించడం లేదు. అయితే ఇన్ స్టిట్యూట్ లు ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోవడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
కోటా లోని జేఈఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్ధులు మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరీక్షల ఒత్తిడే కాకుండా కుటుంబ సభ్యుల ఒత్తిడి కూడా కారణమంటున్నారు కొందరు నిపుణులు. కాబట్టి స్టూడెంట్స్ మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవకుండా చేయాలని కోచింగ్ సెంటర్లకు, తల్లదండ్రులకు సూచిస్తున్నారు.