Pahalgam Terror Attack: ఇండియా భూతల స్వర్గంగా పేరు పొందింది జమ్మూకాశ్మీర్. ఈ ప్రాంతాన్ని అందరూ మిని స్విట్జర్లాండ్గా వర్ణిస్తున్నారు. సమ్మర్ సీజన్ అక్కడ పండగ మాదిరిగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు భారీగా వస్తుంటారు. పర్యాటకుల లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన దాడి వల్ల ఒక్కసారిగా అక్కడి టూరిజం ఇండస్ట్రీ కుప్పకూలే పరిస్థితికి చేరింది. టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి ట్రావెల్ ఆపరేటర్లు ఆందోళనలకు గురవుతున్నారు.
మిని స్విట్జర్లాండ్కు కష్టాలు
కోవిడ్ మహమ్మారి నుండి జమ్మూకాశ్మీర్ తేరుకుంటోంది. మోదీ సర్కార్ సైతం జమ్మూకాశ్మీర్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. 370 ఆర్టికల్ రద్దు చేసి దేశంలో జమ్మూకాశ్మీర్ని విలీనం చేసింది. దీనికారణంగా గడిచిన ఐదేళ్లు కాశ్మీరు ప్రజల సామాజిక, ఆర్థిక జీవనం మెరుగుపడింది. స్విట్జర్లాండ్ మాదిరి చేయాలని భావించింది. రోడ్డు, రైల్వే, బ్రిడ్జిలకు శ్రీకారం చుట్టింది. ఏడాదికి రెండు లేదా మూడుసార్లు ప్రధాని మోదీ జమ్మూకాశ్మీర్కు వెళ్తున్నారు. దీంతో పర్యాటకుల్లో నమ్మకం కలిగింది. స్విజ్జర్లాండ్ వెళ్లకపోయినా, కనీసం కాశ్మీర్ వెళ్లి ప్రకృతి అందాలు చూడవచ్చన్న నమ్మకం కలిగింది. దేశీయ పర్యాటకులే కాకుండా విదేశీయుల తాకిడి క్రమంగా పెరుగుతూ వస్తోంది.
నలుమూలల నుంచి కాశ్మీర్కి పర్యాటకులు రావడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి. వ్యాపారాలు క్రమంగా విస్తరించాయి. లా అండ్ ఆర్డర్ క్రమంగా మెరుగుపడుతోంది. స్థానిక ప్రజలు మా జీవితాలకు ఢోకా లేదన్న నమ్మకానికి వచ్చేశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఉగ్రదాడి జరిగిన మరసటి రోజు బుధవారం జమ్మూకాశ్మీర్లో స్వచ్ఛంధంగా అందరూ బంద్లో పాల్గొనడమే ఇందుకు ఉదాహరణ. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత అక్కడ నివసిస్తున్న అన్నివర్గాల ప్రజలు ఒకేతాటి మీదకు వచ్చారు.
టూరిజాన్ని నమ్ముకున్న ప్రజలు
జమ్మూకాశ్మీర్లో టూరిస్టుల సీజన్ నాలుగు లేదా ఐదు నెలలు మాత్రమే ఉంటుంది. టూరిజం సెక్టార్ని నమ్ముకుని బతికేవాళ్లు ఎక్కువమంది ఉన్నారు. ట్రావెల్స్, హోటళ్లు, క్యాబ్లు ఇలా ఏది చూసినా వాటిపై ఆధారపడి జీవించినవాళ్లే అధికం. మిగతా ఆరేడు నెలలు మంచు వాతావరణం ఉండడంతో సమ్మర్ సీజన్ కోసం కళ్లు కాయలు కాసేలా చూస్తుంటారు అక్కడి ప్రజలు. గడిచిన కొన్నాళ్లగా విమాన, హోటల్ రేట్లలో బాగా పెరుగుదల కనిపించింది.
ALSO READ: పహల్గామ్ ఉగ్రదాడి.. అందుబాటులో రైళ్లు
ఢిల్లీ నుంచి శ్రీనగర్ మధ్య ట్రిప్ కోసం విమాన ఛార్జీలు స్థిరంగా ఉండేది. సీజన్ బట్టి ఒక్కోసారి ఇరువైపులా రూ. 24,000 వరకు వెళ్లిన సందర్భాలు లేకపోలేదు. ముందుగా తీసుకున్నవారికి తక్కువ ధరకు టికెట్లు లభించేవి. దీనికితోడు అక్కడ విలాస వంతమైన వసతికి మాంచి డిమాండ్ పెరిగింది. ఇంకా వసతి ఏర్పాట్లను పెంచాలని నిర్ణయించారు కొన్ని హోటళ్లు. గుల్మార్గ్లోని ఖైబర్ ప్రాంతంలో ఒకరాత్రి బస చేస్తే బాగానే వసూలు చేస్తున్నారు. శ్రీనగర్లో స్టార్ హోటళ్లు ఒక నైట్కి రూ. 20 వేల నుంచి 40 వేల వరకు వసూలు చేస్తున్నాయని ఆతిథ్య సంస్థ వర్గాల మాట.
నాలుగైదు నెలలు పండగే
పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి తర్వాత అక్కడి పర్యాటకంపై చీకటి అలముకుంది. ఘటనకు ముందు కాశ్మీర్కి వెళ్లాలని భావించి భారీగా పర్యాటకులు టికెట్లు తీసుకున్నారు. ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే టూర్ ఆపరేటర్లకు ఇదొక భారీ కుదుపు. పర్యాటకుల్లో భయం మొదలైంది.
ఉగ్రవాదులు ఎప్పుడు, ఎలా విరుచుకుపడతామోనని బెంబేలెత్తుతున్నారు. పర్యాటక రంగంపై ఎక్కువగా ఆధారపడిన ఈ ప్రాంతం, ఉగ్రదాడి తర్వాత కష్టాలు కొని తెచ్చుకుంది. మళ్లీ ప్రభుత్వాలు కీలకమైన నిర్ణయాలు తీసుకుని, భరోసా కల్సిస్తే మళ్లీ టూరిస్టులు రావచ్చు. ఇందుకు చాలా సమయం పట్టే అవకాశముందని అంటున్నారు. ఈ వ్యవహారాన్ని కేంద్రప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.