Indus Waters: పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం వేళ.. పీఎం షెహబాజ్ షరీఫ్ ఇండియాపై తన అక్కసును వెళ్లగక్కారు. సింధూ జలాల్లో తమకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టూ రెడ్లైన్ అని ప్రకటించారు. తమ నీటి హక్కులను కాలరాస్తే.. గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. సింధూ జలాల విడుదలపై.. భారత్ ఎలాంటి చర్యలకు పాల్పడినా, గట్టిగా బదులిస్తామని కవ్వింపు వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందని.. దానిని వారి బలహీనతగా చూడొద్దని కూడా అన్నారు. 2025 మే నాటి కంటే.. గట్టిగా బదులిస్తామని పిచ్చి ప్రేలాపనలు చేశారు. ఆనాటి ఘర్షణల్లో తామే గెలిచామని అడ్డగోలుగా అసత్యాలు వల్లెవేశారు. అందువల్లే సింధూ జలాలని.. భారత్ ఏకపక్షంగా నిలిపివేసిందని నిరాధార ఆరోపణలు చేశారు.
భారత్ వైఖరికి విరుద్దంగా పాకిస్థాన్..
పాకిస్థాన్.. భారత్ వైఖరికి పూర్తి విరుద్ధంగా వాదిస్తోంది. 2025 ఏప్రిల్లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్.. సింధూ జలాలపై కఠిన నిర్ణయం తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆపితేనే.. సింధూ జలాల అంశంపై మాట్లాడతామని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఏ అంతర్జాతీయ ఒప్పందమైనా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటే.. దాన్ని రద్దు చేసే హక్కు సార్వభౌమ దేశంగా భారత్కు ఉందని కేంద్రం తేల్చేసింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో.. పాకిస్థాన్లో వ్యవసాయంతో పాటు తాగునీటిపై తీవ్ర ప్రభావం పడుతోంది. సింధూ జలాలను విడుదల చేయాలని పదే పదే పాక్ డిమాండ్ చేస్తోంది. అయితే, నీరు రక్తం కలిసి ప్రవహించలేవని, సీమాంతర ఉగ్రదాడులను ఆపితేనే.. ఈ అంశంపై ఆలోచిస్తామని ఇండియా ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. పాక్ నేతలు ఎన్ని అడ్డగోలు వ్యాఖ్యలు చేసినా.. భారత్ బదులిచ్చేది ఒకటే.. ముందు ఉగ్రవాదం ఆపాలి. ఆ తర్వాతే.. సింధూ జలాలపై చర్చ జరగాలి.
Also Read: ముందు ఇండియాకు రా.. ఆ తర్వాతే విచారణ! విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు వార్నింగ్!