PM Modi: దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని ప్రకటించారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగం పై ధన్యవాదాల తీర్మానం గురించి ప్రధాని మాట్లాడుతూ.. నాలుగోసారి దేశ ప్రజలు తనను ఆశీర్వదించారని, దీనితో దేశాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత తమపై ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో పేదలకు రూ. 1.20 లక్షల కోట్లు ఆదా అయిందన్నారు. పదేళ్లలో ఎలాంటి స్కాములు జరగలేదని, అవినీతి రహిత పాలన తాము అందించామని పీఎం అన్నారు. యువత ఆకాంక్షలను నెరవేరుస్తూ తమ పాలన సాగుతుందన్నారు.
అలాగే దేశ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రధానమంత్రి తెలిపారు. బడ్జెట్ పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని, అలాంటి విమర్శలను కూడ తాము పొగడ్తలుగా భావిస్తామని ప్రధాని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా తమ పాలన సాగుతుందని, అందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. గత పదేళ్ల పాలనలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని, అదే తాము సాధించిన ఘన విజయంగా చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదన్నారు.
ఎన్డీఏ పాలనలో పేదలు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చామని, ఐదేళ్లలో 12 కోట్ల మందికి తాగునీటి వసతి కల్పించామన్నారు. 4 కోట్ల మంది పేదలకు గృహ వసతి కల్పించామని, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు చేరువ చేశామని పీఎం ప్రకటించారు. ఇక విపక్ష నేతల గురించి మాట్లాడిన మోడీ సెటైర్లు వేశారు. కొందరు నేతలు పేదలతో ఫొటో సెషన్ చేస్తున్నారని, పార్లమెంట్లో పేదలపై జరిగే చర్చలో మాత్రం పాల్గొనరన్నారు. తాము బూటకపు హామీలు ఇవ్వలేదని, పేదల కోసం 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించామన్నారు.
Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాకు వెళ్లే తెలుగు భక్తులకు గుడ్ న్యూస్, ఆ రెండు రైళ్లకు బోగీల పెంపు!
స్వచ్చభారత్ కార్యక్రమం ద్వార గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఎన్నో చర్యలు చేపట్టమన్నారు. అంతేకాదు డిజిటల్ లావాదేవీలతో పారదర్శకత తీసుకొచ్చామని, స్వచ్ఛ్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. అలాగే చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నట్లు, ఏదిఏమైనా ప్రపంచ పటంలో దేశ ఖ్యాతిని నలుమూలలా చాటిచెప్పడమే తమ ముందున్న లక్ష్యంగా పీఎం ప్రకటించారు.