PM Modi Indian Army| ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే దేశ సంకల్పమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత సైన్యం సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉందని, ఇటీవలి ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు సైన్యం తమ రీతిలో నిర్ణయాలు తీసుకోవాలని.. లక్ష్యాలు, సమయం, అన్ని విధాలుగా నిర్ణయించేందుకు సైన్యానికి స్వేచ్ఛానుమతులు ఇచ్చారు. త్రివిధ దళాల అధిపతులతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పహల్గాం దాడి తర్వాత అంతర్గత భద్రత, సరిహద్దు పరిస్థితులపై ప్రధాని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అజిత్ డొభాల్, సీడీఎస్ అనిల్ చౌహాన్, ఆర్మీ, నేవీ, వైమానిక దళాల అధిపతులు పాల్గొన్నారు.
పాకిస్తాన్ను ఉద్దేశిస్తూ.. ఉగ్రవాదులను, వారి సహాయకులను ఊహించని రీతిలో అణచివేస్తామని మోదీ హెచ్చరించారు. ప్రతీకార దాడుల ఊహాగానాలకు ఆయన మాటలు బలం చేకూరుస్తున్నాయి. భద్రతారంగ కేబినెట్ కమిటీ (CCS) బుధవారం సమావేశం కానుంది. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కూడా జరగనుంది. భారత సైన్యం 2016లో ఉరి, 2019లో పుల్వామా దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే.
పాక్ సైనికుల మూకుమ్మడి రాజీనామాలు
కశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. భారత్ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందోనన్న భయంతో పాకిస్తాన్ భీతిల్లిపోతోంది. భారత్ తమపై వైమానిక దాడులకు దిగవచ్చని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దాడుల చేస్తే అడ్డుకునేందుకు పాక్ సైన్యం తమ రాడార్ వ్యవస్థలను సియాల్కోట్ ప్రాంతానికి తరలిస్తున్నట్లు సమాచారం. అంతేకాక, అత్యవసర పరిస్థితుల్లో తమ దేశ గగనతలాన్ని కూడా మూసివేసింది.
ఇదిలా ఉంటే.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలు, హెచ్చరికల కారణంగా పాకిస్తాన్లో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్మీ కూడా భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి తర్వాత కేవలం రెండు రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ ఆర్మీ నుంచి 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులను వదిలిపెట్టి వెళ్లిపోయినట్లు ‘ది డేలీ గార్డియన్’ ఒక కథనంలో వెల్లడించింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ పాక్ 11వ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ రాసిన లేఖను కూడా బయటపెట్టింది.
మీడీయా కథనం ప్రకారం.. జనరల్ బుఖారీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో తమ దేశ సైనికుల ఆత్మస్థైర్యం వేగంగా క్షీణిస్తున్నట్లు హెచ్చరించారు. ఈ రాజీనామాల ధోరణి ఇలాగే కొనసాగితే, భారత్తో యుద్ధం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు, పాకిస్తాన్ సైన్యం బలహీనత బయటపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది సైనికులు ఇప్పటికే తమ క్రియాశీల విధులను విడిచిపెట్టగా, మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇది పాకిస్తాన్ సైనిక ర్యాంకుల్లో తీవ్ర సంక్షోభాన్ని సూచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిణామం పాక్ సైన్యంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో, సామూహిక రాజీనామాలపై పాకిస్తాన్ సీనియర్ అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత బలమైన భారత సైన్యం ప్రతీకార చర్యలకు దిగుతుందనే భయమే ఈ రాజీనామాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. భారత్ ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భీతితో సైనికుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా సైనికులు రాజీనామాలు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం.. యుద్ధానికి రెడీ అట.. అంత సీనుందా?
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్
మరోవైపు, సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న సమయంలో పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ సయీద్ అసిమ్ మునీర్ కనిపించకపోవడం పాకిస్తాన్లో కలకలం రేపుతోంది. ఆయన తన కుటుంబంతో సహా దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలు వచ్చాయి. ‘మొదట కుటుంబాన్ని విదేశాలకు తరలించారు, ఆ తర్వాత తానూ పాకిస్తాన్ను వీడారు’ అని ఆ వార్తల సారాంశం. కొన్ని రోజులుగా, ముఖ్యంగా పహల్గాం దాడి జరిగినప్పటి నుంచి మునీర్ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడిపై ఆగ్రహంతో ఉన్న భారత్ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ఈ పరిస్థితికి తానే బాధ్యుడిని అవుతానని మునీర్ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్లు కనిపిస్తోందని ఆ కథనాలు వెల్లడించాయి.