Pune Crime: మద్యం మత్తులో చికెన్, మటన్ వండాలని పట్టుబట్టిన కొడుకుపై తల్లిదండ్రులు దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్ర పుణేలోని వార్జే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సోమవారం (ఆగస్టు 24) రాత్రి జరిగిన దారుణానికి సంబంధించి పోలీసులు 65 ఏళ్ల వృద్ధుడితో పాటు అతని 60 ఏళ్ల భార్యను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు (30) కూలీ పనులకు వెళ్తూ రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులతో నిత్యం గొడవపడేవాడు. ఆగస్టు 24న రాత్రి 8:30 గంటల ప్రాంతంలో బాగా మద్యం తాగి ఇంటికి వచ్చిన అతడు.. రాత్రి భోజనంలోకి నాన్-వెజ్ కావాలని డిమాండ్ చేశాడు. అయితే ప్రస్తుతం శ్రావణమాసం నడుస్తుండటంతో నాన్-వెజ్ తినకూడదని, వండడం కుదరదని తల్లిదండ్రులు తెగేసి చెప్పారు.
ఈ విషయంలో కొడుకుకు, తల్లిదండ్రులకు మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి గురైన తల్లిదండ్రులు అతడిపై దాడి చేశారు. దీంతో కొడుకు ముఖం, తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. ఆగస్టు 25న వేకువజామున 4 గంటల ప్రాంతంలో కొడుకును లేపేందుకు ప్రయత్నించగా అతడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. లోపలి భాగాల్లో తీవ్ర గాయాలు కావడం వల్లే అతడు మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.
హత్య అనంతరం నిందితులు ఈ ఘటనను ప్రమాదంగా నమ్మించేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉంటున్న తమ పెద్ద కొడుకు దగ్గరకు వెళ్లి.. చిన్న కొడుకు రాత్రి 2 గంటలకే తీవ్ర గాయాలతో ఇంటికి వచ్చాడని, ఎక్కడో ప్రమాదానికి గురై ఉంటాడని చెప్పారు. అయితే పెద్ద కొడుకు (34) తన తమ్ముడు రాత్రి 8:30 గంటలకే ఇంటికి రావడం చూశాడు.
Also Read: మనిషి లేని భూమికి.. కొత్త బాస్ ఎవరో తెలుసా? సైన్స్ చెప్పే షాకింగ్ నిజాలు!
తల్లిదండ్రుల మాటలపై అనుమానం వచ్చి పెద్ద కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వృద్ధ దంపతులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నాన్ వెజ్ కోసం మెుదలైన గొడవ.. చివరకు కన్న కొడుకును చంపుకునే స్థాయికి వెళ్లడం అందరనీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Also Read: సెప్టెంబర్ నుంచి ఇవి మారబోతున్నాయ్.. ఆగస్టు 31 లోపు పూర్తి చేయకపోతే.. సామాన్యుల జేబుకు చిల్లే!