Fake Kidnapping: మహారాష్ట్ర పుణేలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ టీనేజర్.. డబ్బు కోసం సొంత వారినే మోసం చేసేందుకు కుట్ర పన్నాడు. తాను కిడ్నాప్ కు గురైనట్లు నాటకమాడాడు. రూ.5 లక్షలు ఇస్తే విడిచి పెడతారని కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో సందేశం పంపాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు నిజం తెలుసుకొని టీనేజర్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని బందా జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఓం ప్రకాష్ గౌరీశంకర్ అనే యువకుడు కొంతకాలం క్రితం ఉపాధి కోసం పూణే వచ్చాడు. అయితే అక్కడ ఎలాంటి ఉద్యోగం దొరకకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఖర్చుల కోసం అప్పటికే ఇంట్లో వాళ్లని పలుమార్లు డబ్బులు అడిగి తీసుకున్నాడు. అయినా సరిపోకపోవడంతో ఒకేసారి రూ. 5 లక్షలు రాబట్టాలని స్కెచ్ వేశాడు.
ఈ క్రమంలోనే ఓం ప్రకాష్ కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు. ఇంట్లో వాళ్లను నమ్మించడానికి ఒక గదిలో కూర్చుని ఏడుస్తూ ఒక వీడియో రికార్డ్ చేసి కుటుంబ సభ్యులకు పంపాడు. కొందరు దుండగులు తనను కిడ్నాప్ చేశారని.. రూ. 5 లక్షలు ఇస్తేనే ప్రాణాలతో వదులుతామని బెదిరిస్తున్నట్లు చెప్పి డ్రామా నడిపాడు.
కొడుకు ఏడుస్తున్న వీడియో చూసి భయపడిపోయిన తల్లిదండ్రులు వెంటనే యూపీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రతను అర్థం చేసుకున్న యూపీ పోలీసులు ఆలస్యం చేయకుండా పూణే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గస్తీలో ఉన్న సీనియర్ అధికారులతో సహా పూణే పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.
యూపీ పోలీసులు ఇచ్చిన మొబైల్ నంబర్ ఆధారంగా పూణే పోలీసులు కాల్ డేటా, లోకేషన్ను ట్రాక్ చేశారు. ఫోన్ సిగ్నల్ ఖడ్కి ప్రాంతంలో చూపిస్తుండటంతో అక్కడ ఉన్న ‘క్రౌన్ ప్లాజా’ లాడ్జిపై దాడి చేశారు. లోపలికి వెళ్లి చూడగా అక్కడ కిడ్నాపర్లు ఎవరూ లేకపోగా ఓం ప్రకాష్ ఒక్కడే ప్రశాంతంగా కూర్చుని కనిపించాడు.
Also Read: ఇమ్రాన్ ఖాన్కు బిగ్ రిలీఫ్.. జైలు నుంచి ఆస్పత్రికి.. పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఓం ప్రకాష్ అసలు నిజాన్ని బయటపెట్టాడు. తన సొంత అన్న నుంచి రూ. 5 లక్షలు తీసుకునేందుకు ఈ కిడ్నాప్ నాటకమాడానని ఒప్పుకున్నాడు. నాటకం నిజమని నమ్మించేందుకే ఏడుస్తున్న వీడియో రికార్డ్ చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు.
Also Read: విజయ్ – త్రిష సెల్యూట్ రచ్చ.. డీఎంకే పత్రిక సంచలన కథనం.. ఇద్దరిపై ఘాటు విమర్శలు!