Blind man who passed’o8 CSE: అతను ఒక అంధుడు.. అయినా కూడా అతను చదువుల్లో రాణించాడు. విధి రాతను సైతం అతను ఎదురించి దేశంలో అత్యంత క్లిష్టమైన పరీక్షను రాశాడు. సాధారణ వ్యక్తులే ఈ పరీక్ష రాయాలంటేనే కాస్త భయపడిపోతుంటారు. అలాంటిది తనకు అంధత్వమున్నా కూడా ఏ మాత్రం భయపడకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా పరీక్ష రాసి విజయం సాధించాడు. అయితే, ఇది ఒక ఎత్తు అయితే, అపాయింట్ లెటర్ పొందే విషయంలో కూడా అతను మరో పరీక్షను రాసి విజయం సాధించినంత పనయ్యింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16 ఏళ్లు పట్టింది అతనికి ఆ అపాయింట్ లెటర్ అందుకోవడానికి.
ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పంకజ్ కుమార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి అంధుడు. ఇతనికి వంద శాతం అంధత్వం ఉంది. అయినప్పటికీనూ అతను సివిల్స్ పరీక్ష ప్రిపేరయ్యాడు. ఎంతో కష్టపడి 2008లో జరిగిన సివిల్ సర్వీస్ పరీక్షను క్రాక్ చేశాడు. ఇతనితోపాటు మరో పదిమంది వికలాంగులు కూడా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. కానీ, వీళ్లందరికీ ఇప్పటివరకు అపాయింట్ మెంట్ లెటర్ ఇవ్వలేదు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ శ్రీవాస్తవ 2009 నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. చివరకు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాడు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పర్సన్ విత్ డిసిబిలిటీ యాక్, 1995 నిబంధనలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సన్ విత్ డిసిబిలిటీ(పీడబ్ల్యూడీ) కేటగిరీలో బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నా కూడా శ్రీవాస్తవకు అపాయింట్ లెటర్ ఇవ్వలేదు.. ఆ లెటర్ పొందేందుకు అతను అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందంటూ ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది.
Also Read: నీట్ ఫలితాల్లో పెద్ద తేడా ఏం లేదు: ఎన్టీఏ
‘ఇంటియన్ రెవెన్యూ సర్వీస్-ఐఆర్ఎస్ లో విజువల్లీ ఇంపేయిర్ట్(పూర్తిగా అంధత్వం) కేటగిరీలో పలు బ్యాక్ లాగ్ ఖాళీలు ఉన్నాయి. 2014 నుంచి అంధత్వం కేటగిరి అభ్యర్థులను ఐఆర్ఎస్ లో సెలక్ట్ చేస్తున్నారు. ఐఆర్ఎస్ విభాగంలో పీడబ్య్లూడీ కేటగిరీ కింద మొత్తం 7 ఖాళీలు ఉన్నాయి. పీడబ్ల్యూడీ యాక్ట్, 1995 ప్రకారం శ్రీవాస్తవతోపాటు పదిమంది మెరిట్ అభ్యర్థులను పరిగణలోనికి తీసుకోవాలి. ఇలా చేసి ఉంటే శ్రీవాస్తవ తనకు న్యాయం జరిగేందుకు ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండేదికాదు’ అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చివరకు మెరిట్ లిస్టులో ఉన్న శ్రీవాస్తవతోపాటు మరో 10 మందికి అపాయింట్ మెంట్ లెటర్లు జారీ చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.