Cyclone Rains: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతలకు తుపాను ముసురు కొండంత ఊరటనిచ్చింది. ఎల్ నినో ప్రభావంతో గత కొద్దిరోజులుగా వర్షాలు ముఖం చాటేయడం, ఎండల తీవ్రత పెరగడంతో సాగు చేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. ఈ దశలో ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న ముసురు జల్లులు మండలంలోని పంట పొలాలకు పునర్జీవనం పోశాయి.
ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అరకొర వర్షాలతో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేశారు. అయితే సరైన సమయానికి వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల్లో నీటి ప్రవాహం తగ్గడంతో పంటలు నిలువునా ఎండిపోయే పరిస్థితి దాపురించింది. పెట్టుబడులు సైతం దక్కవేమోనని రైతులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. సరిగ్గా ఇలాంటి విపత్కర సమయంలో తుపాను ప్రభావంతో ప్రారంభమైన ముసురు వాన పంటలకు అమృతంలా మారింది. ఏకధాటిగా కురిసే భారీ వర్షాల కన్నా, ఇలా నేలను తడుపుతూ నిదానంగా కురిసే ముసురు వల్ల తేమ ఎక్కువ కాలం నిలిచి పంటల ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని రైతులు చెబుతున్నారు.
నిరంతర జల్లులతో నేలంతా తడిసి ముద్దవడంతో చేలల్లో తేమ శాతం పెరిగింది. దీంతో బోరుబావులపై ఆధారపడాల్సిన అవసరం తాత్కాలికంగా తగ్గింది. పత్తి చేలలో పూత, కాత రాలకుండా ఈ తేమ రక్షణగా నిలుస్తుందని, ఎండిపోతున్న వరి పైర్లు తిరిగి పచ్చదనాన్ని సంతరించుకుంటాయని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Aslo read: కవిత సంచలన నిర్ణయం.. తెలంగాణ ఉద్యమం తరహాలో మళ్లీ నిరసనలు..!
పంటల పెట్టుబడి చేతికందే కీలక తరుణంలో ఈ వర్షం పడటం రైతులకు పెద్ద ఊరటనిచ్చింది. వానలు ఇలాగే మరో రెండు మూడు రోజులు కొనసాగితే చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో పాటు భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి యాసంగి సాగుకు కూడా మార్గం సుగమమవుతుందని మండల రైతాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
వర్షాలు లేక ఎండలు ముదరడంతో వేసిన పత్తి, వరి చేలు ఎండిపోతాయేమోనని తీవ్ర ఆందోళన చెందాం. బోరు బావుల్లో కూడా నీళ్లు తగ్గిపోవడంతో పెట్టిన పెట్టుబడులు పోతాయని భయపడ్డాం. సరిగ్గా ఇలాంటి సమయంలో వచ్చిన ముసురు వాన పైర్లకు ప్రాణం పోసింది. నిదానంగా కురిసిన జల్లులతో నేలలో తేమ బాగా నిలిచింది. ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగితే పంటల ఎదుగుదల మరింత బాగుంటుంది, ఈ సారి గట్టెక్కుతామనే ధైర్యం వచ్చింది.
Also Read: కొత్త హెడ్లైట్ రూల్స్ వస్తున్నాయ్, ఇలా చేస్తే భారీ జరిమానాలు.. జాగ్రత్త!