Swati Maliwal Warning to AAP Leaders: ఎంపీ స్వాతి మాలివాల్ వ్యవహారం రోజుకో కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారం సొంత పార్టీలోనే చిచ్చు రేపుతోంది. ఆమెపై ఆప్ మంత్రులు ఎదురుదాడి మొదలుపెట్టేశారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. ఆప్ పార్టీకి స్వాతిమలీవాల్ రాజీనామా చేసే అవకాశాలున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో వార్తలు జోరందుకున్నాయి.
తాాజగా ఢిల్లీ ఆప్ మంత్రులు చేస్తున్న కామెంట్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ స్వాతిమాలీవాల్. ఒకప్పుడు ఆప్ నేతలు తనను లేడీ సింగంగా వర్ణించారని, ఇప్పుడు బీజేపీ ఏజెంట్గా కనిపిస్తున్నాడా అని ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలను సోషల్మీడియాలో పోస్టు చేయడంపై మండిపడ్డారు. దాడి కేసు విచారణ జరుగుతున్న సమయంలో తన వ్యక్తిగత వివరాలు, వాహనాల నెంబర్లు లీక్ చేయడాన్ని తప్పుబట్టారామె.
ఢిల్లీలోని ఆప్ మంత్రులు అధికార మత్తులో ఉన్నారని, నిజం ఎప్పటికైనా తెలుస్తుందన్నారు ఎంపీ స్వాతి. తనపై అబద్దాలు మాట్లాడుతున్న నేతలను కోర్టుకు ఈడ్చుతానని హెచ్చరించారు. నిజాలు మాట్లాడినందు కు తనపై సోషల్మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీలోని ప్రతి ఒక్కరినీ పిలిచి తన వ్యక్తిగత వీడియోలు పంపమని చెబుతూ వాటిని లీక్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నేతల ఆరోపణల వల్ల తన కుటుంబానికి హాని జరిగే అవకాశముందని మనసులోని మాట బయటపెట్టారు.
Also Read: ఇరాన్ అధ్యక్షుడి మృతికి భారత్ సంతాపం.. రాష్ట్రపతి భవన్ లో జాతీయ జెండా అవనతం
ఎంపీ స్వాతిమాలీవాల్పై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్కుమార్ను శనివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును ఐదుగురు సభ్యుల టీమ్ విచారణ చేస్తోంది. ప్రస్తుతం ఆయన ఐదురోజుల జుడ్యీషియల్ కస్టడీలో ఉన్నారు. బిభవ్కుమార్ తన ఫోన్ ఫార్మాట్ చేయడానికి ముందు అందులోని డేటాను ముంబైలోకి ఓ వ్యక్తి ట్రాన్స్ఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఒకవైపు ఎంపీ స్వాతి-ఆప్ నాయకుల మధ్య మాటల వార్ కొనసాగుతోంది. ఇంకోవైపు బీజేపీ నేతలపై సీఎం కేజ్రీవాల్ మాటల దాడిని పెంచారు. ఎన్నికల వేళ ఆప్ను కంట్రోల్ చేయడానికి స్వాతి ఇష్యూను కమలనాథులు తెరపైకి తెచ్చారని అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ కేసు వ్యవహారంపై ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.