Terrorist Pahalgam Modi| జమ్ము కశ్మీర్ లోని పహల్గామ్ లో మంగళవారం ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడిలో దాదాపు 28 మంది చనిపోగా. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. అయితే ఈ దాడిలో కర్ణాటకకు చెందిన పౌరుడు ఒకరు మరణించారు. కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతానికి చెందిన మంజునాథ్ తన భార్య, పల్లవి, కొడుకుతో పహల్గామ్ లో విహార యాత్రకు వెళ్లినప్పుడు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
పహల్గామ్ లో ఓ కన్నడ కుటుంబం ఒక హౌస్ బోట్ లో ఉంటూ షికారా (కశ్మీర్ టౌన్ పడవ)లో ఓ రైడ్ చేసి ఒడ్డు చేరుకోగానే ఈ ఉగ్రదాడి జరిగింది. చనిపోయిన మంజునాథ్ భార్య ఈ భయానక ఘటన గురించి మీడియాతో మాట్లాడుతూ.. “మేము ముగ్గురం.. నేను, నా భర్త, నా కొడుకు కశ్మీర్ కు విహార యాత్ర కోసం వెళ్లాం. మధ్యాహ్నం 1.30 సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు. మేము పహల్గామ్ స్పాట్ లో ఉన్నాం. నా కళ్లముందే నా భర్త చనిపోయారు. ఒక భయానక పీడ కలలా అనిపిస్తోంది. దాన్ని మర్చిపోలేకపోతున్నాను. ”
అక్కడ ఉన్నవారిలో ఉగ్రవాదులు ప్రత్యేకించి హిందువులను మాత్రమే టార్గెట్ చేసి హత్య చేశారని పల్లవి చెప్పారు. “నలుగురు ఉగ్రవాదులు ఒక్కసారిగా వచ్చి మాపై దాడి చేశారు. నేను వారికి చెప్పాను. ఎలాగూ నా భర్తను చంపేశారు. నన్ను కూడా చంపేయమని. అప్పుడు అక్కడ ఉన్నవారిలో ఒకడు నాతో ఇలా అన్నాడు. ‘నేను నిన్ను చంపను, పో వెళ్లి మోడీకి చెప్పుకో’ అని బెదిరించాడు” అని ఆమె తెలిపింది.
ఆ తరువాత పల్లవి ప్రభుత్వ అధికారులను తన భర్త మృతదేహం కర్ణాటకకు త్వరగా తీసుకు వచ్చేందుకు సాయం చేయాలని కోరింది. మృతదేహాన్ని కశ్మీర నుంచి కర్ణాటకకు తీసుకురావాలంటే ఆలస్యం అవుతుంది.. అందుకే విమానంలో తిరిగి పంపించే ఏర్పాట్లు చేస్తే త్వరగా తీసుకురావొచ్చని ఆమె సూచించింది.
Also Read: జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో.. ముగ్గురు తెలుగు వాళ్లు మృతి
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. ట్విట్టర్ ఎక్స్ లో ఆయన స్పందిస్తూ.. ఈ ఉగ్రదాడిని ఖండించారు.
“ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో కన్నడిగులు కూడా ఉండడం చాలా షాకింగ్ గా ఉంది. ఈ వార్త తెలిసి నేను ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశాను. పరిస్థితులపై చీఫ్ సెక్రటరీ, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ చేశాను.” అని సిఎం సిద్ధరామయ్య రాశారు.
ఈ విషాదకర పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వం తమ పౌరులకు తోడుగా నిలబడుతుందని.. జరుగుతున్న పరిణామాలపై ఆరా తీసి బాధితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన తెలిపారు.
జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో.. ముగ్గురు తెలుగు వాళ్లు మృతి
జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడిలో ముగ్గురు తెలుగు వ్యక్తులు మృతి చెందారు. ట్రెక్కింగ్ కోసం వెళ్లిన బృందాన్ని లక్ష్యంగా ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో వచ్చి సమాచారం తెలుసుకుని విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఆ తరువాత అడవుల్లోకి పారిపోయారు. ఈ దాడిలో మొత్తం 28 మంది మృతిచెందగా, ఆ సంఖ్య పెరిగే అవకాశముంది. మృతుల్లో హైదరాబాద్కు చెందిన ఐబీ అధికారి మనీష్ రంజన్, కావలికి చెందిన మధుసూదన్, విశాఖకు చెందిన చంద్రమౌళి ఉన్నారు.
చంద్రమౌళి రెండు సంవత్సరాల క్రితం వైజాగ్లో ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. టూర్కు వెళ్లేముందు మొక్కలకు నీళ్లు పోయమని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన మరణం బాధాకరమని కుటుంబ సభ్యులు, సన్నిహితులు పేర్కొన్నారు.