Ahmedabad flight crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఆ ఇద్దరు మణిపూర్ యువతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రతిభావంతులైన యువతులు. ఒకరు 21 ఏళ్ల నంగ్థోయ్ శర్మ కొంగ్బ్రైలత్పమ్ కాగా, 28 ఏళ్ల లామ్నుంథెమ్ సింగ్సన్. వీరిద్దరు ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. ఘటన గురించి తెలియగానే వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మణిపూర్ రాజధాని ఇంఫాల్లోని డీఎం కాలేజ్ ఆఫ్ కామర్స్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఎంపికైంది 21 ఏళ్ల నంగ్థోయ్ శర్మ. ముగ్గురు ఆడపిల్లల్లో రెండోది నంగ్థోయ్. టీనేజ్లో ఎయిరిండియాలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి కొండంత ఆసరాగా నిలిచింది. స్నేహితులు ఎయిర్ హోస్టెస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, శర్మను పిలిచారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె సెలెక్ట్ అయ్యింది.
19 ఏళ్లకే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉండేది. ఆమె పెద్దయ్యాక మణిపూర్లో స్థిరమైన ఉద్యోగం వెతుక్కోవాలని భావించింది. అంతలోనే మృత్యువు ఒడిలోకి చేరిపోయింది. గురువారం ఉదయం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో పేరెంట్స్కి ఫోన్ చేసింది శర్మ.
ఈరోజు తాను లండన్ వెళ్తున్నానని, కొన్నిరోజులు ఫోన్ చేయలేనని తల్లిదండ్రులకు తెలిపింది. జూన్ 15న తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పింది. కూతురు తమకు చేసిన కాల్, చెప్పిన మాటలు అవేనని కన్నీరుమున్నీరు అయ్యారు తండ్రి నందీష్ కుమార్ శర్మ. మార్చిలో ఇంటికి వచ్చిందని, అదే ఆఖరి చూపు అయ్యిందన్నారు.
ALSO READ: అహ్మదాబాద్లో ప్రధాని మోదీ, ఘటన ప్రాంతం సందర్శన, బాధితులకు పరామర్శ
మరో మృతురాలు లామ్నుంథెమ్ సింగ్సన్. రెండేళ్ల కిందట 2023లో జరిగిన జాతి ఘర్షణల కారణంగా ఇంఫాల్లోని ఓల్డ్ లంబులేన్లో సర్వస్వాన్ని కోల్పోయింది యువతి కుటుంబం. ప్రస్తుతం కాంగ్పోక్పి జిల్లాలో నిరాశ్రయులైన వ్యక్తులుగా ఓ చిన్న అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు.
సింగ్సన్ తండ్రి కొన్నేళ్ల కిందట మరణించాడు. ఆమె తల్లి ముగ్గురు పిల్లలను ఒంటరిగా పెంచుకుంటూ వచ్చింది. లామ్నుంథెమ్కు ఏకైక కూతురు ఉంది. సింగ్సన్ చివరిసారిగా తన తల్లికి ఫోన్ చేసి తాను డ్యూటీ మీద అహ్మదాబాద్ వెళ్తున్నట్టు చెప్పినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
మణిపూర్లో రెండేళ్ల నుంచి మెయిటీ- కుకి వర్గాల మధ్య ఘర్షణతో అతలాకుతలమైంది. ఈ వివాదంలో 250 మందికి పైగా మరణించారు. 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. శర్మ-లామ్నుంథెం కుటుంబాలు రెండూ ఈ అశాంతి వల్ల ప్రభావితమయ్యాయి. రెండేళ్ల కిందట ఎయిర్ ఇండియాలో క్యాబిన్ సిబ్బందిగా చేరింది లామ్నుంథెం. ఇలా ఒకే రాష్ట్రం నుంచి ఎయిరిండియాలో ఉద్యోగం సాధించిన మహిళలు రెండేళ్లకే ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వారి వారి కుటుంబాలకు పెద్దగా వీరిద్దరు ఉండేవారు.