Jio Hotstar : హాట్ స్టార్ తో జియో విలీనం తర్వాత జియో హాట్ స్టార్ (Jio Hotstar) ఓటీటీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ వెబ్సైట్ తో పాటు ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఐపాడ్ ఓఎస్, స్మార్ట్ టీవీలతో సహా ఇతర ప్లాట్ ఫామ్ లలో కూడా తమ యాప్ ను రీ బ్రాండ్ చేసింది. కేవలం యాప్ లోగోనే కాదు కంటెంట్ ను కూడా రీడిజైన్ చేసి తమ సబ్ స్క్రైబర్లకు జియో హాట్ స్టార్ షాక్ ఇచ్చింది. ఈ ఓటీటీలో రాబోతున్న కంటెంట్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పటిదాకా ఓటీటీలకు ఎలాంటి సెన్సార్ లేదు. కానీ తాజాగా జియో హాట్ స్టార్ సెన్సార్ రూల్ ఫాలో అవుతుండడం వివాదానికి తెర తీసింది.
ఇకపై ఆ సీన్లు కట్
ఓటీటీలు అందిస్తున్న కంటెంట్ పై సెన్సార్ రావాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటిదాకా స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ లు, సినిమాలు సెన్సార్ లేకుండానే స్ట్రీమింగ్ అయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి బహుశా ఉండకపోవచ్చు. తాజాగా జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ తమ కంటెంట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో అంతర్జాతీయ, సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు భారతీయ కంటెంట్ ను కూడా సెన్సార్ చేయబోతున్నట్టు టాక్ నడుస్తోంది. భారత ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా జియో హాట్ స్టార్ ఈ సెన్సార్ రూల్ ని తీసుకురాబోతున్నట్టు సమాచారం.
మండిపడుతున్న నెటిజన్లు
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జియోలో అందుబాటులో ఉన్న హెచ్బిఓ, పీకాక్, హులు కంటెంట్ కు సెన్సార్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి గతంలో హెచ్బిఓ కంటెంట్ జియోలో ఎలాంటి సెన్సార్ లేకుండా ఉచితంగా స్ట్రీమింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం హెచ్బిఓ వెబ్ సిరీస్ లు పూర్తిగా మిస్ అవ్వడంతో సబ్స్క్రైబర్లు మండిపడుతున్నారు. అలాగే తాజాగా హెచ్బిఓలో రిలీజ్ అయిన ‘ది వైట్ లోటస్ సీజన్ 3’ వెబ్ సిరీస్ ను జియోలో సెన్సార్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఊహించని పరిణామంపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత కనబరుస్తున్నారు నెటిజెన్లు. సెన్సార్ షిప్ పేరుతో ప్రేక్షకుల స్వేచ్ఛకు పరిమితులు విధిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాగే అన్ని ఓటీటీలు సెన్సార్షిప్ రూల్స్ ని పాటిస్తే సెన్సార్ లేని ఒరిజినల్ వెబ్ సిరీస్ లు, సినిమాలను చూడాలనుకున్న ప్రేక్షకులకు నిరాశ తప్పదు అని టాక్ నడుస్తోంది.
ఓటీటీపై ఎఫెక్ట్ తప్పదా?
జియో 2026 వరకు HBO కంటెంట్ స్ట్రీమింగ్ హక్కులను కలిగి ఉంది. అయినప్పటికీ ఇంటిగ్రేషన్, సెన్సార్షిప్ వంటి కారణాల వల్ల చాలామంది సబ్ స్క్రైబర్లు ఇప్పటికే ఈ ఓటీటీకి దూరం అయ్యాయి. పోక్సో చట్టం, ఐటీ చట్టంతో సహా ఇతర చట్టాలను ప్రస్తావిస్తూ, అసభ్యకర కంటెంట్ ను ప్రసారం చేయకూడదని హెచ్చరిస్తూ ప్రభుత్వం ఇటీవల అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లకు ఒక సలహా జారీ చేసింది. దీంతో జియో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కంటెంట్ను ముందస్తుగా సెన్సార్ చేస్తోందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.