Kaalapatthar on OTT : ‘కాలాపత్తర్’ (Kaalapatthar) అనే కన్నడ యాక్షన్ డ్రామా ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగు పెట్టింది. థియేటర్లలో రిలీజ్ అయిన 8-9 నెలల తరువాత ఈ మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టడం విశేషం. ఇన్ని రోజులూ ఓటీటీ డీల్ కుదరకపోవడంతో ఈ సినిమా అసలు ఓటీటీలో అందుబాటులోకి వస్తుందా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఎట్టకేలకు సైలెంట్ గా డిజిటల్ గా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాల్లోకి వెళ్తే…
సైలెంట్ గా ఓటీటీలోకి…
విక్కీ వరుణ్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ యాక్షన్ డ్రామా చిత్రం ‘కాలాపత్తర్’. ‘కెండ సంపిగే’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన విక్కీ వరుణ్, ఆ తర్వాత ‘కాలేజ్ కుమార్’ అనే సినిమా చేశారు. ముచ్చటగా మూడవ సినిమా ‘కాలాపత్తర్’తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. భువన్ మూవీస్ బ్యానర్ పై భువన్ సురేష్, నాగరాజు బిల్లినాకోట్ నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెంబర్ 13నే థియేటర్లలో విడుదలైంది. కానీ ఇప్పటి వరకూ ఓటీటీ విడుదలకు నోచుకోలేదు ఈ మూవీ. కొన్ని రోజుల క్రితం స్ట్రీమింగ్ పార్టనర్ గా సన్ ఎన్ఎక్స్టీ (Sun nxt) ఈ సినిమా రైట్స్ ను సొంతం చేసుకుంది. మే 2న ఓటీటీ ప్రియుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా కేవలం కన్నడ భాషలోనే ఓటీటీలో అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
ఉత్తర కర్ణాటకలోని మూడలపాళ్య అనే గ్రామంలో జరుగుతుంది కథ. ఇక్కడ నీటి కొరత, ప్రాథమిక సౌకర్యాల లేమి వంటి సమస్యలు ఉంటాయి. శంకర్ (విక్కీ వరుణ్) ఒక బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సైనికుడు. ఆర్మీలో కుక్గా పని చేస్తాడు. అతను లెజెండరీ కన్నడ నటుడు డాక్టర్ రాజ్కుమార్కు అభిమాని. ఫ్రంట్లైన్ యోధుడిగా దేశానికి సేవ చేయాలని కలలు కంటాడు. అయితే గ్రామస్తులు అతన్ని యుద్ధభూమిలో పోరాడే సైనికుడిగా ఊహిస్తారు. దీంతో తనను తానే ఒక అసమర్థుడిగా ఫీల్ అవుతాడు శంకర్.
ఒక రోజు ఆర్మీ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేస్తారు. శంకర్ కుక్ అయినప్పటికీ ధైర్యంగా ఉగ్రవాదులతో పోరాడి, వారిని ఎదుర్కొంటాడు. దీంతో అతను ఒక్కసారిగా హీరో అవుతాడు. దేశవ్యాప్తంగా ఈ విషయం వైరల్ కావడంతో శంకర్ గౌరవార్థం గ్రామంలో ఒక విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయిస్తారు. బ్రాంజ్ విగ్రహానికి డబ్బు సరిపోకపోవడంతో స్థానిక నల్లరాయి (కాలాపత్తర్)తో విగ్రహాన్ని నిర్మిస్తారు.
Read Also : సైకో కిల్లర్ నుంచి యాక్షన్ దాకా… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రేజీ కొరియన్ సినిమాలను చూశారా?
శంకర్ తన గ్రామానికి తిరిగి వచ్చాక అతని విగ్రహం గ్రామ సమస్యలను మరింత పెంచుతుంది. నీటి కొరత, రోడ్లు, బస్సు సర్వీస్ వంటి ప్రాథమిక సౌకర్యాల కొరతను పట్టించుకోకుండా, రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు విగ్రహాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటారు. ఒక దశలో దేవాలయ పూజారి కూడా విగ్రహానికి మార్పులు సూచిస్తాడు. దీంతో గ్రామస్థుల మధ్య ఉద్రిక్తతత మొదలవుతుంది. మరి హీరో తన విగ్రహం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చివరికి ఆ విగ్రహాన్ని ఏం చేశారు? అన్నది స్టోరీ.