Crime Thriller Web Series : క్రైమ్ థ్రిల్లర్ కథల్లో బ్యాంక్ దోపిడీలు, హత్యలు, పోలీసుల ఛేజ్లు చాలానే చూశాం. కానీ ఒక వ్యక్తి ఐదు వేర్వేరు రూపాల్లో దేశమంతా తిరుగుతూ కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటే? నిజంగా అతడే ఆ మోసాల వెనుక ఉన్నాడా? లేక అతన్ని ఎవరన్నా ఇరికించారా? అనే ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన హిందీ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘Rafuchakkar’. ప్రముఖ నటుడు మనీష్ పాల్ ఈ సిరీస్లో ఐదు భిన్నమైన గెటప్లలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. మరి ఇంతకీ ఈ సిరీస్ కథ ఏంటి ? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
పవన్ బవేజా అనే వ్యాపారవేత్తపై దేశవ్యాప్తంగా భారీ ఆర్థిక మోసాల కేసులు నమోదవుతాయి. బిస్కెట్ ప్యాకెట్ల వ్యాపారం పేరుతో పెట్టుబడులు పెట్టించిన అతను వందల కోట్ల రూపాయలు కాజేశాడని పోలీసులు ఆరోపిస్తారు. కేసు కోర్టుకు చేరడంతో పవన్ను విచారించడం ప్రారంభిస్తారు. మొదట్లో అతను సాధారణ వ్యాపారవేత్తగానే కనిపిస్తాడు. కానీ విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ఒక్కో ఆధారం బయటపడుతుంది. దేశంలోని వేర్వేరు నగరాల్లో వేర్వేరు పేర్లతో తిరిగిన వ్యక్తి కూడా ఇతడేనని పోలీసులు అనుమానిస్తారు. ప్రతి నగరంలో అతనికి కొత్త పేరు… కొత్త వృత్తి… కొత్త వ్యక్తిత్వం ఉంటుంది.
ఒకచోట నమ్మకమైన వ్యాపారవేత్తగా కనిపిస్తాడు. మరోచోట పెద్ద కాంట్రాక్టులు చూసే ధనవంతుడిగా అందరినీ నమ్మిస్తాడు. ఇంకో నగరంలో ఫిట్నెస్ ట్రైనర్లా తిరుగుతాడు. అవసరమైతే ప్రభుత్వ అధికారులను కూడా నమ్మించే వ్యక్తిగా మారిపోతాడు. చివరికి వృద్ధుడి వేషంలో కూడా కోట్ల రూపాయల మోసాలు చేసినట్లు ఆధారాలు బయటపడతాయి. పోలీసుల వద్ద ఉన్న ప్రతి సాక్ష్యం పవన్ వైపే చూపిస్తుంది. కానీ కోర్టులో అతను చెప్పే మాటలు మాత్రం అందరినీ అయోమయంలో పడేస్తాయి. తాను నిర్దోషినని, ఈ ఐదు గెటప్ల కథను తన శత్రువులే సృష్టించారని వాదిస్తాడు. దీంతో అసలు నిజం ఏంటనే ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారుతుంది.
విచారణ కొనసాగుతున్న కొద్దీ కొత్త సాక్షులు వస్తుంటారు. ప్రతి ఒక్కరూ పవన్ను వేర్వేరు రూపాల్లో చూసినట్లు చెబుతారు. కానీ ఆ రూపాల్లో కనిపించిన వ్యక్తి నిజంగా పవనేనా? లేక అతనిలా కనిపించే మరో వ్యక్తినా? అనే సందేహం ప్రేక్షకుడిని కూడా వెంటాడుతుంది. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో కొత్త మలుపు బయటపడుతుంది. పోలీసులు పవన్ను దోషిగా నిరూపించడానికి ప్రయత్నిస్తుంటే, పవన్ మాత్రం తన తెలివితో ప్రతి ఆధారాన్ని ప్రశ్నిస్తూ ముందుకు సాగుతాడు. నిజం ఏది? అబద్ధం ఏది? అనే గందరగోళం చివరి వరకు కొనసాగుతుంది.
చివరికి ఆ ఐదు గెటప్ల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? నిజంగా వందల కోట్ల రూపాయల మోసం జరిగిందా? పవన్ మోసగాడా? లేక తనకంటే పెద్ద మోసగాళ్లను బురిడీ కొట్టించిన తెలివైన వ్యక్తా? అనేది తెలియాలంటే ఈ సిరీస్ ను డోంట్ మిస్’.
రఫు చక్కర్ వెబ్ సిరీస్లో మనీష్ పాల్ ప్రధాన పాత్రలో నటించగా, ప్రియా బాపట్, అక్ష సింగ్, సతీష్ కౌశిక్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సిరీస్ JioCinema ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. చివరి వరకు అసలు నిజం ఏంటో అర్థం కాకుండా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్… ప్రతి ఎపిసోడ్ కొత్త అనుమానాన్ని రేకెత్తిస్తూ, చివరి మలుపు వరకు గ్రిప్పింగ్ గా సాగుతుంది.
Read Also: వారాణసి వీధుల్లో ఒకే ఒక్కరోజులో జరిగే కథ… మనసును హత్తుకునే ఫీల్ గుడ్ డ్రామా