OTT Movie : రియల్ స్టోరీల ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లను, సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ స్టోరీలు కూడా ప్రేక్షకులను ఆలోచింప జేసే విధంగా ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ 1997లో ఢిల్లీలోని ఉపహార్ సినిమా థియేటర్లో జరిగిన ఒక భయంకరమైన అగ్నిప్రమాదం, దాని తర్వాత న్యాయం కోసం బాధిత కుటుంబాలు చేసిన పోరాటాన్ని వివరిస్తుంది. ఈ సిరీస్ న్యాయవ్యవస్థలోని లోపాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్
2023 లో వచ్చిన ఈ హిందీ డ్రామా వెబ్ సిరీస్ పేరు ‘ట్రయల్ బై ఫైర్’ (Trial by Fire). దీనికి ప్రశాంత్ నాయర్, రితేష్ షా దర్శకత్వం వహించారు. ఇది నీలం, శేఖర్ కృష్ణమూర్తి రాసిన “ట్రయల్ బై ఫైర్: ది ట్రాజిక్ టేల్ ఆఫ్ ది ఉపహార్ ఫైర్ ట్రాజెడీ” అనే పుస్తకం ఆధారంగా రూపొందింది. ఈ సిరీస్లో అభయ్ డియోల్, రాజ్ష్రీ దేశ్పాండే, రాజేష్ టైలాంగ్, అనుపమ్ ఖేర్, రత్నా పాఠక్ షా, శిల్పా శుక్లా నటించారు. ఏడు ఎపిసోడ్లతో తెరకెక్కిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో 2023, జనవరి 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 2023 ఫిల్మ్ఫేర్ OTT అవార్డ్స్లో బెస్ట్ డ్రామా సిరీస్ (క్రిటిక్స్), రాజ్ష్రీ దేశ్పాండేకు బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్), అభయ్ డియోల్కు బెస్ట్ యాక్టర్ అవార్డులను అందుకున్నారు.
స్టోరీలోకి వెళితే
ఈ సిరీస్ 1997 జూన్ 13న ఢిల్లీలోని ఉపహార్ సినిమా థియేటర్లో జరిగిన ఒక విషాద అగ్నిప్రమాదంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ “బోర్డర్” సినిమా ప్రదర్శన సమయంలో ఒక ట్రాన్స్ఫార్మర్ పేలడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించి, 59 మంది మరణించి, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదం నీలం కృష్ణమూర్తి (రాజ్ష్రీ దేశ్పాండే), శేఖర్ కృష్ణమూర్తి (అభయ్ డియోల్) జీవితాలను నాశనం చేస్తుంది. వీళ్ళు తమ ఇద్దరు వయసుకు వచ్చిన ఉన్నతి (17), ఉజ్వల్ (13) పిల్లలను ఈ అగ్నిప్రమాదంలో కోల్పోతారు. ఇక ఈ దంపతులు దుఃఖంలో మునిగిపోతారు. కానీ వీళ్లకు జరిగిన నష్టం మాటల్లో వర్ణించలేనిది. న్యాయం కోసం వీళ్ళు నిరంతర పోరాటం చేస్తారు.
ఈ అగ్నిప్రమాదానికి థియేటర్ నిర్వాహకులు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్ చేసిన నిర్లక్ష్యమే కారణం. థియేటర్లో భద్రతా నిబంధనలు పాటించకపోవడం (లాక్ చేయబడిన ఎగ్జిట్ డోర్లు, అనధికారిక సీటింగ్, ట్రాన్స్ఫార్మర్ నిర్వహణలో లోపాలు) ఈ విషాదానికి దారితీసింది. నీలం, శేఖర్ ఇతర బాధిత కుటుంబాలతో కలిసి, అసోసియేషన్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ ఉపహార్ ట్రాజెడీ (AVUT)ని స్థాపించి, అన్సల్ బ్రదర్స్ పై న్యాయ పోరాటం చేస్తారు. ఈ సిరీస్ ఈ దంపతులు చేసిన 15 సంవత్సరాల న్యాయ పోరాటాన్ని చూపిస్తుంది.
ఇందులో బాధితులకి అవినీతితో కూడిన పోలీసు వ్యవస్థ, ఆలస్యమయ్యే కోర్టు విచారణలు, శక్తివంతమైన అన్సల్ కుటుంబ రాజకీయ ప్రభావం వంటి అనేక అడ్డంకులు ఎదురవుతాయి. నీలం, ఒక సాధారణ గృహిణి నుండి, ఒక అలుపెరగని యోధురాలిగా మారుతుంది. శేఖర్ తన బాధను న్యాయం కోసం పోరాటంలో చూపిస్తాడు. ఇంతకీ వీళ్లకు న్యాయస్థానంలో న్యాయం జరిగిందా ? న్యాయం కోసం ఎందుకు అన్ని సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ని మిస్ కాకుండా చుడండి.
Read Also : రాత్రికి రాత్రే ఇంటి చుట్టూ వెలిసే బద్దలు కొట్టలేని గోడలు… గుండెల్లో గుబులు పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్