ఉన్నది నలుగురు.. అదీ తలోదారి. ఇదీ తెలంగాణ బీజేపీ నాయకుల తీరు. అంతా పెద్ద నేతలే. కానీ ఎవరికి వారే. ఒక్కరి మాట ఒకరు వినరు. ఒకరి వెనుక మరొకరు గోతులు తీసుకోకపోతే చాలు..! అన్నట్టుగా ఉండే నిన్నటి వరకు. కానీ ఇప్పుడు గోతులు తీసే కాడికీ వచ్చింది పరిస్థితి. బండి సంజయ్ ఎప్పుడు టార్గెట్ అవుతాడా? అని ఎదురుచూసే బీఆరెస్కు , దాని సోషల్ మీడియాకు మంచి ఫీడింగు ఇచ్చింది ఎవరో తెలుసా? ఆ పార్టీ నేతేనట? నిజామాబాద్కు చెందిన ఆ కీలక నేత.. ఈ ఉదంతంపై రెచ్చగొట్టి రచ్చ చేశాడట. అంతా తెరవెనుకే. బండి సంజయ్కు, ఆ నేతకు పడదు. ఆ మాటకొస్తే.. ఈటల రాజేందర్, కిషన్రెడ్డి, రఘునందన్రావు.. వీరెవరితో కూడా ఆయనకు పడదు.
తనదారి తనది కాబట్టి.. తమను మించి ఎదుగుతున్నాడనో.. కేంద్రం దృష్టిలో మంచి మార్కులు పడుతున్నాయనో.. మొత్తానికైతే బండిపై ఓర్వలేనితనం బాగానే పోగేసుకున్నారు. అందులో ఈ నిజామాబాద్ కీలక నేత ఒకడు. ఈ నేతకు ఆ జిల్లా నేతలతోనే పొసగదు. తను చెప్పిందే వేదం అక్కడ. వినకపోతే ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టేసి.. వారిని మానసికంగా ఇబ్బందే పెట్టే రకం అంటారు.. అక్కడి కాషాయ కార్యకర్తలు. ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలతో కూడా ఎడముఖం, పెడముఖంగా ఉండే ఈ కీలకనేత సామాజికవర్గం కూడా అదే. ఈయనకూ రాష్ట్ర అధ్యక్షుడు కావాలనే కోరిక చాలా రోజుల నుంచే ఉంది. దీనికి తోడు మంత్రివర్గంలో ఏమన్నా చాన్సు ఉంటుందోమోనని ఆశలు పెట్టుకున్నాడు. ఇటు బండి ఆటంకంగా మారాడు. కొడుకు రూపంలో వచ్చిన ఈ అవకాశాన్ని కరెక్టుగా మోడీ సభకు ముందు రోజే రిలీజ్ అయ్యేలా.. ఆ అమ్మాయి కుటుంబంతో మాట్లాడి ఇదంతా జరిగేలా అంతా తానై వ్యవహరించాడనే ప్రచారం ఆ పార్టీలోనే సాగుతోంది.
ఈ ఒక్కడు చేసినదాన్ని ఆ పార్టీలో మిగిలిన వారు తమకు తోచినంతగా సోషల్ మీడియాలో తిప్పారు. ఇందులో ముందున్నది ఈటల సోషల్ మీడియా వర్గమనే ప్రచారం ఉంది. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణకు మరొకటి ఇచ్చే చాన్సు లేదు. బండి సంజయ్ను మంత్రి వర్గం నుంచి తప్పించి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇద్దామనుకున్నారు. ఈ క్రమంలో ఈ పదవిపై ఈటల రాజేందర్, డీకే అరుణతో పాటు ఈ నిజామాబాద్ కీలక నేత కూడా ఆశ పెట్టుకున్నాడు. సేమ్ సామాజికవర్గం కావడంతో.. బండి స్థాయి తగ్గితే.. ఆ స్థానం తనకే కదా అనే కోణంలో ఇదంతా చేసి ఉంటాడా? అని డిస్కషన్ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర పార్టీలో జరుగుతున్నది.
ఒకవేళ తనకు కేంద్రమంత్రి పదవి రాకున్నా.. స్టేట్ అధ్యక్షుడిగానైనా చేస్తే సరి ..! అని తనకు తాను తన సొంత పార్టీగా చెలామణి అవుతున్న ఆ నేత ఉద్దేశంగా ఉందట. శత్రువును దెబ్బతీసే క్రమంలో పార్టీ లైన్ దాటి ప్రవర్తించడం, తనకు కావాల్సినదాని కోసం ఏదైనా చేయడం, తనదే అంతా నడవాలని కోరుకోవడం.. కేంద్రం వద్ద తనకూ పరపతి ఉందని చాటుకునే క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించడం.. ఇవన్నీ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఈ అంశాలు అధిష్టానికి కూడా చేరినట్టు తెలుస్తోంది. దీన్ని సైలెంట్గా గమనిస్తున్న ఢిల్లీ పెద్దలు.. నష్ట నివారణ కోసం సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది.