అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారం పోయి తత్వం బోధపడిన తరువాత ఇప్పుడిలా! కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా క్రెడిట్ అంతా తనకే రావాలని, దేశం మొత్తం తనను కీర్తించాలని కేసీఆర్ కోరుకున్నాడు. అందుకే కాంగ్రెస్ సర్కార్ హయాంలో రూపొందిచబడ్డ ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కాదని, డిజైన్ మార్చాడు కేసీఆర్. మేడిగడ్డకు మారింది సీన్. అంచనాలు భారీగా పెరిగాయి. ఇది కేసీఆర్ స్వయంగా చెప్పుకున్నదే. అక్కడ నీటి లభ్యత లేదు.. కరువొచ్చినప్పుడు అక్కడ ఈ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసేంత నీరు నిలువ ఉండే వీలు లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. అందుకే మేడిగడ్డకు డిజైన్ మార్చామని, దీనిపై ఎవరైనా మాట్లాడొచ్చని అసెంబ్లీలో చర్చ పెట్టాడు. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఉన్నపళంగా ఇలా దానిపై చర్చంటే ఎలా..? మేం ప్రిపేర్ కాలేదు.. అన్నమాటను.. కేసీఆర్ దీన్ని చాలా బహిరంగ సభల్లో మరెందుకు వచ్చారు. పీకెనీకి వచ్చారా? అని వ్యంగ్యంగా విమర్శించిన విషయం అందరికీ తెలిసిందే.
ఇంకొన్ని వేదికల మీద.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తనో సగం ఇంజినీర్ను అయ్యాయని కూడా చెప్పారు. అంతా తను అనుకున్నట్టే చేశాడు. కానీ ఇవాళ ఆ పార్టీ సీనియర్ లీడర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ తుమ్మిడిహట్టి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేందుకు అనేక సార్లు పర్మిషన్ కోసం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ను కలిశాడని, అయితే తాను ఒప్పుకోలేదని అన్నాడు. అందుకే మేడిగడ్డకు మార్చామని అంటున్నారు. ఇక్కడ ఎత్తు విషయంలోనే రెండు రాష్ట్రాలకు కిరికిరి నడుస్తోంది. 148 మీటర్ల ఎత్తు అని వాళ్లు.. ఇది సరిపోదు.. 152 మీటర్లు ఎత్తు కావాలని తెలంగాణ.. దీనిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్రెడ్డి కూడా ఈ ఎత్తు విషయంలోనే ఓసారి చర్చించేందుకు ఫడ్నవీస్ అప్పాయింట్మెంట్ కోరుతూ లేఖ రాశానని, ఇంత వరకు రిప్లై లేదని.. దీనికి కారణం కిషన్రెడ్డేనని విమర్శిస్తున్నారు.
వాస్తవానికి, తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేయాలనుకుంటే.. కేసీఆర్కు అప్పట్లోనే సాధ్యపడేది. ఎత్తు విషయంలో కూడా తగినంత పెంచుకునే వెలుసుబాటు దొరికే రాజకీయ వాతావరణం.. అప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య ఉంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కేంద్రం సపోర్టు అవసరమని చెబుతూ వచ్చాడు కేసీఆర్. అందుకే కేంద్రంతో గ్యాప్ పెంచుకునే పనులు చేయడం లేదని, కలుపుకుని పోవడం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబడతామని కూడా అన్నారు. ఇందులో భాగంగానే ఆయన.. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు లాంటి కేంద్రం తీసుకున్న వివాదస్పద నిర్ణయాలకు కూడా సంఘీభావం తెలిపారు. ఏకంగా అసెంబ్లీలోనే తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నాడు.
ఇక్కడంతా ఓకే అని సిగ్నల్ ఇచ్చాడు మోడీకి. ఇలా కేంద్రం, రాష్ట్రానికి మధ్య సహృధ్బావ రాజకీయ వాతావరణం ఉన్న సందర్భంలోనే తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు అంశం వడివడిగా ముందుకు వచ్చింది. దీనిపై కేసీఆర్ సీరియస్గా నజర్ పెట్టాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఇది కీలకమైన సాగునీటి వనరు. భారీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం. దీన్ని నిర్మిస్తే తన పేరు చిరకాలం గుర్తుంటుందనే భావనలో కేసీఆర్ ఉన్నాడు. కానీ అప్పటికే రెడీగా ఉన్న ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు పై ఆయనకు అణువంత కూడా ఇంట్రస్టు లేదు. సదాభిప్రాయమూ లేదు. అందులో మొత్తం తన మార్కే ఉండాలనుకున్నాడు. అందుకే ఒక్క తుమ్మిడిహట్టి బ్యారేజే కాదు.. మొత్తం డిజైన్ నే మార్చేశాడు. తనే కొత్తగా ఆ భారీ బ్యారేజీ నిర్మాణానికి రూపకర్తను అని తెలంగాణ ప్రజలకు, దేశానికి చెప్పదలుచుకున్నాడు. అదే చేసి చూపాడు.
ఈ క్రమంలో భారీగా అంచనా వ్యయం పెరిగింది. అయినా డోన్ట్ కేర్ అన్నాడు.మేడిగడ్డ వద్ద ఆ ఫిల్లర్లు కుంగకపోతే.. ఇప్పుడు ఈ వివాదమే వచ్చేది కాదు. కానీ ఆ నిర్మాణంలో ఆగమాగం తీసుకున్న నిర్ణయాలు, కేసీఆర్ దూకుడు.. ప్రాజెక్టు భవితవ్యాన్ని, ఆ పార్టీ పరిస్థితినే మార్చేశాయి. ఇదిలా జరుగుతుందని ఊహించలేదు.. కేసీఆర్! ఇప్పుడు కొత్త పలుకులు పలుకుతున్నారు బీఆరెస్ నేతలు. తుమ్మిడిహట్టి వద్ద మేం కూడా బాగా ప్రయత్నం చేశాం కానీ, వీలు పడలేదని చెప్పుకొస్తున్నారు. ఫడ్నవీస్తో కయ్యం పెట్టుకునేలా మాట్లాడితే అనుమతులు ఎలా ఇస్తారు? అని ప్రశ్నిస్తున్న వినోద్కుమార్.. మరి అప్పుడు కేసీఆర్,మోడీ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయిగా.. మీకెందుకు అది సాధ్యం కాలేదు.. ? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలడా?