ఫ్యూచర్ సిటీ వేదికగా సీఎం రేవంత్రెడ్డి… బీఆరెస్ పాలనపై మండిపడ్డారు. ఒక్క గంట గట్టిగా వాన దంచి కొడుతేనే నగరం మొత్తం మునిగి పోయింది.. మూడు గంటలు ప్రజలకు నరకయాతన పడ్డారని గుర్తు చేశారు. ఇదేనా పదేళ్ల పాలనలో మీరు చేసిందని విమర్శించారు. అంతేకాదు.. తాము హైడ్రాతో కబ్జాలకు గురైన చెరువులు, కుంటలను కాపాడుతున్నామని, కబ్జాలు చేయడం మూలంగానే నగరం ఒక్కవానకే ఇలాంటి పరిస్థితికి వచ్చిందని అన్నారు. అలా అన్నారో లేదో.. వెంటనే కేటీఆర్ తేరుకున్నాడు. అదే రోజు రాత్రే ఓ ప్రెస్నోట్ విడుదల చేశాడు. అటూ ఇటూ పోయి ఇది నా మీదకే వచ్చేటట్టున్నదని గ్రహించినట్టున్నాడు. ఒక్క వానకే చేతులెత్తేసిన సీఎం రేవంత్రెడ్డి.. అని ఓ ప్రకటన విడుదలైంది.
ఒక్కవానకే ఇంత ఘోరమా? అని ఒకవేలు ఇటు చూపించిన కేటీఆర్..మిగిలిన వేళ్లన్నీ ఆ పదేళ్ల పాలన వైపే చూపిస్తున్నాయి కదా! అనే సోయి లేక కాదు. అంతే.. ఎదురుదాడికి దిగాలి. లేదా తప్పు ఒప్పుకోవాలి. తప్పు ఎవడు ఒప్పుకుంటాడు? అందుకే కేటీఆర్ ఎదురుదాడికి దిగాడు. అన్నీ తప్పుడు ఆరోపణలే. వాస్తవానికి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి రెండున్నరేండ్లు. ఈ కాలంలో చూమంతర్ అని సిటీ రోడ్లను, నాలాలను, కబ్జాలకు తొలగించి.. వాననీరు రయ్యిన వెళ్లిపోయి రోడ్లన్నీ క్లీన్గా .. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చేయాలంటే సాధ్యం కాదు. రెండు టర్ములు పాలించిన వారికి అది సాధ్యం కాలేదు కానీ… ఏమయ్యా సీఎం రేవంత్.. ఒక్క వానకే సిటీ చూడు ఎట్లైందో..! ఏం చేస్తున్నావ్ నువ్వు.. నువ్వో ఫెయిల్యూర్ సీఎం…! అని ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే .. అన్నట్టుగా కేటీఆర్ ఎదురుదాడికి దిగడం ఇక్కడ విడ్డూరం.
ఉన్న సిటీని పట్టించుకోవడం లేదుగానీ, ఫ్యూచర్ సిటీ అని పోతున్నడు.. దానికి ఫ్యూచరే లేదు అన్నాడు. ఇలాంటి విమర్శల్లో కొంత బలం ఉంది. ఉన్న సిటీని పట్టించుకోవడమంటే.. ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యతైతే ఇప్పుడున్న పాలకుడి మీదనే ఉంటది. ఇప్పటి వరకు మాన్సూన్ మీటింగు పెట్టలేదు.. అన్నాడు. ఇదీ కరెక్టే. ప్రభుత్వానికి దానిపై చిత్తశుద్ది లేనట్టుంది. పట్టింపు కూడా లేనట్టుంది. మరి విమర్శల పాలు కాదా?
ఉన్న సిటీ ఇంత అధ్వాన్నమని తేలితే.. మరి మీ ఫ్యూచర్ సిటీకి పెట్టుబడులు ఎలా వస్తాయి..? ఇది కదా లాజిక్కు. మీరు మీరు తరువాత తీరుబడిగా తిట్టుకుందురు గానీ.. ముందు ముందు కురిసే భారీ వర్షాలకు నగరం నరకం కాకుండా ఆపే ప్రయత్నం చేయండి… అంటున్నారు నగర వాసులు. కొంతకాలం ఆ ఫ్యూచర్ సిటీని వదిలి.. ఉన్న సిటీని పట్టించుకోండని కూడా అంటున్నారు. కానీ వానలు గట్టిగా పడితే సర్కార్ కన్నా ముందు.. కేటీఆర్లోనే భయం పుడుతున్నది.జనమైనా.. ప్రభుత్వమైనా మొదట తననే టార్గెట్ చేస్తుందని కావొచ్చు. ఎందుకంటే అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన కేసీఆర్, కేటీఆర్ .. ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి బాధ్యులు కారా? ఇదీ నగర జీవుల ప్రశ్న. ముందుంది జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఈ వానలు ఎవరి కొంపముంచుతాయో! మరి..