తెలంగాణ జన సమితి నాలుగో ప్లీనరీ మే 12న జరగనుంది. నెక్లెస్రోడ్, జలవిహార్లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గద్దర్ ప్రాంగణమని ఈ వేదికకు పేరు పెట్టారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లోని స్లోగన్స్ చర్చకు తెర తీశాయి. ఉద్యమకారుల ఆకాంక్షలను సాధిద్దాం.. ప్రజాస్వామిక తెలంగాణను నిర్మిద్దాం.. అనే నినాదాలు హైలెట్గా నిలిచాయి. ఈ ప్లీనరీ వేదికగా కోదండరామ్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? కాంగ్రెస్ పాలనపై తన సూచన ఇవ్వాలనుకుంటున్నారా? తమ పార్టీ నుంచి ఏవైనా కొత్త డిమాండ్లు పెట్టాలనుకుంటున్నారా? అనే ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి.
ప్లీనరీ సన్నాహాక సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక చర్చ జరిగినట్టుగా ప్రచారం జరుగుతున్నది. సర్కార్కు మిత్రపక్షంగా ఉన్న టీజేఎస్ విషయంలో పార్టీ అధిష్టానం ఏం పట్టించుకోవడం లేదనే అసంతృప్తికి తోడు.. తాము అనుకున్న విధానాలు, పాలసీలు.. పాలనలో ప్రతిబించించడం లేదనే విమర్శలూ చేస్తున్నారు. మరో మిత్రపక్షమైన సీపీఐ సైతం సర్కార్ విధానాలను కొన్నింటిని వ్యతిరేకించడం.. కొన్ని ప్రజా డిమాండ్ల సాధనకు నేరుగా ముందుకు వచ్చి.. బహిరంగంగా ప్రకటనలు చేయడం..లాంటి ఉదంతాలను గుర్తు చేస్తున్నారు. కోదండరామ్పై ఉద్యమకారుల్లో, ప్రజాస్వామిక వాదుల్లో మంచి అభిప్రాయాలున్నాయి.
ఆయన ద్వారా, టీజేఎస్ పార్టీ ద్వారా ఆకాంక్షలను సాధించవచ్చనే నమ్మకమూ ఇంకా సడలలేదు. ఈ క్రమంలో కోదండరామ్ మధ్యవర్తిత్వం ద్వారా .. సర్కార్కు తమ డిమాండ్లు, సమసస్యలు విన్నవించి సాధించుకోవచ్చనే అభిప్రాయం ఇంకా ఆయా వర్గాల్లో ఉంది. కానీ ఇక్కడ బయట అనుకుంటన్నది వేరు.. అక్కడ జరుగుతున్నది వేరు..అనే స్పష్టతకు వచ్చేశారు టీజేఎస్లోని కీలక నేతలు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గానీ, సర్కార్ గానీ.. ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చేక్రమంలో చాలా ఉదాసీనంగా ఉన్నారని వీరంతా ఫిక్సయిపోయినట్టు తెలుస్తోంది. ఇది వరకు పలు మార్లు చర్చించినా ఫలితం లేకపోవడమే దీనికి నిదర్శనమని చెప్పుకుంటున్నారు. పదేళ్ల బీఆరెస్ పాలనకు భిన్నంగా కాంగ్రెస్ పాలన ఉండాలని టీజేఎస్ భావించింది. కేసీఆర్ చేసిన పాలనా లోపాలను ఒక్క శాతం కూడా ఈ పాలనలో రిపీట్ కాకుంకడా చూసుకునే బాధ్యతను భుజానేసుకుంది.
కానీ రెండేండ్లలో పరిస్థితి వీరి అదుపులో లేదు. చెబితే వినేంత పరిస్థితీ అక్కడ లేదు. హామీల అమలు జరిగే సూచనలూ కనిపంచలేదు. దీంతో సుతిమెత్తగానైనా.. సూత్రప్రాయంగానైనా.. సర్కార్కు పలు సూచనలు చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. దీనికి ఈ నాలుగో ప్లీనరీని వేదిక చేసుకోవాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ ప్లీనరీలో పలు కీలక తీర్మానాల ద్వారా తాము ఇకపై నడవబోయే పద్దతులు, విధానాలను సర్కార్కు విడమర్చి చెప్పాలనేది వీరి ఉద్దేశ్యంగా కనిపిస్తున్నది.
అందుకే పోస్టర్లో కూడా ఈ నిర్ణయాన్ని ప్రతిబింబిస్తున్నట్టుగానే నినాదాలను కూడా జోడించి విడుదల చేసినట్టు ప్రచారం జరుగుతుంది. కేంద్రం విధానాలను కొన్ని వ్యతిరేకించడంతో పాటు. రాష్ట్ర సర్కార్ చేయాల్సిన కర్తవ్యాన్ని కూడా గుర్తు చేయడం.. లోపాలను ఎత్తి చూపడం కూడా ఇకపై తమ పార్టీ చేయబోయే కార్యక్రమాల్లో ఉండబోతున్నాయని చెప్పడంలో భాగంగానే ఈ పోస్టర్ను రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ వేదిక ద్వారా దీనిపై మరింత క్లారిటీని ఇవ్వనున్నారు. అప్పటి వరకు కోదండరామ్ ఏం చెప్పబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది.