జెన్ జీ.. తెలుగు రాష్ట్రాల్లో తన ప్రభావం చూపుతున్నది. ప్రతాపమూ చూపుతున్నది. ఇప్పుడు ఏ రాష్ట్ర రాజకీయాల్లోనైనా కామన్గా వినిపిస్తున్న పిలుపు జెన్ జీ! ఈ కొత్తతరం యువత డిజిటల్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నది. పరిణతి కూడిన వ్యవహారశైలిని కనబరుస్తున్నది. ఏది మంచి..? ఏది చెడు? ఒక సంఘటన వెనుక ఉన్న ఉద్దేశ్యమేమిటీ? ఒక కామెంట్ వెనుక దాగున్న వ్యూహమేందీ? ఆ వ్యూహకర్త భవిష్యత్ తరాలకు చేసే మేలు ఏ మేర ఉంటుంది? ఇవన్నీ ఒక అంచనా వేయగల సత్తా కలిగి ఉంటున్నారు. అందుకే క్లారిటీతో కూడిన జస్టిఫికేషన్లు ఇచ్చే క్రమంలో తడబడటం లేదు. బళ్లు ఓడలు ఓడలు బళ్లు చేయగల ప్రభావ శీలమైన మేథో సంపత్తి వీరి సొంతంగా ఉంది. అందుకే వీరినిప్పుడు రాజకీయ సర్కిళ్లు ప్రత్యేకంగా చూస్తున్నాయి.
వారిని దృష్టిలో పెట్టుకునే వెనుకాముందు ఆలోచించి మరీ మాట్లాడుతున్నాయి. అడుగేస్తున్నాయి. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన తాజా సంఘటనలే ఉదాహరణగా తీసుకుంటే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే ఒకదానికొకటి సంబంధం లేదు. ఒక పార్టీకి మరో పార్టీకి లింకులు లేని సంఘటనలు. కానీ ఏది న్యాయం..? ఏది ఒప్పు..? అనే విషయంలో ఇక్కడ పార్టీలకతీతంగా సోషల్ మీడియాలో జెన్ జీ తన ప్రభాల్యం చాటుకుంది. సోషల్ మీడియా అనగానే .. ఇందులో ఎవరి పార్టీలకు వాళ్లు వారియర్స్ ఉన్నారు. వీరిని గురించి కాదు మనమిప్పుడు చర్చించుకుంటున్నది. ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా.. తమదైన ఓ పంథాను కంటిన్యూ చేస్తూ నిరంతరం సోషల్ ఇష్యూలను గమనిస్తూ నిక్కచ్చిగా, నిజాయితీగా తమ అభిప్రాయలను వెల్లడించే జెన్ జీ గురించి. అవును ఆ తరం ఇచ్చే సందేశాలు.. చెసే కామెంట్లలో పస ఉంటుంది.
అర్థం, పరమార్థం ఉంటుంది. అన్నింటికి మించి నిజాయితీ ఉంటుంది… దానికి బలమైన సపోర్టు ఉంటుంది. అందుకే రాజకీయా పార్టీలు వీరికి జంకుతున్నాయి. గజ్జుమంటున్నాయి. తమ విధానాల్లో తప్పులు దొర్లినప్పుడు వెంటనే నాలుక్కర్చుకుని తప్పు దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాయి. చెంపలేసుకుంటున్నాయి. పశ్చాత్తాపం ప్రకటించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. నాలుగు మెట్లు దిగి వస్తున్నాయి. ఈగో ప్రదర్శనను ఇష్టపడటం లేదు. పారదర్శకంగా ఉంటున్నామని సంజాయిషీ ఇచ్చుకుంటున్నాయి ఈ పౌర సమాజానికి. లేటెస్టుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాలు.. వాటి తాలుకు ప్రభావాలు.. పార్టీలతీతంగా వెనువెంటనే వచ్చిన ధర్మాగ్రహాలు.. ఆ పార్టీలు వెనక్కి తగ్గిన వైనాలు.. ఓసారి పరిశీలిద్దాం..
బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఫోక్సో కేసు విషయంలో.. బాధిత మైనర్ బాలిక పక్షాన నిలిచింది జెన్ జీ. వారి కుటుంబ సభ్యుల ఫోటోలను బయటపెట్టి.. పరువు తీసే పనిని చేసిన వారిని ఎండగట్టింది. అదే సమయంలో ఇక్కడ బీజేపీ చర్యలను, సర్కార్ ఆలస్యాన్నీ నిలదీసింది. బండి సంజయ్ తన కొడుకు వ్యవహారాన్ని వెనుకొచ్చే క్రమంలో తడబడుతూ, తప్పటడుగులు వేసిన వైనాన్ని ఎండగట్టింది. ఏ పార్టీని వదల్లేదు. బీఆరెస్ సోషల్ మీడియా అత్యుత్సాహంపై నిప్పులు చెరిగింది. ఇక పవన్.. అత్యుత్సాహంతో ప్రొఫెసర్ నాగేశ్వర్పై పెట్టిన కేసుల విషయంలోనూ టీడీపీ, జనసేన రెండు పార్టీలను తప్పుబట్టింది. ఓ విశ్లేషణలో భాగంగా జరిగిన దాన్ని రాద్దాంతం చేసి.. ఈగో ప్రదర్శన చేసిన జనసేనాని, దీనికి వంతపాడిన బాబును ఇద్దరినీ నిలదీసింది. దీంతో వెనక్కి తగ్గక తప్పలేదు కూటమి సర్కార్కు.
నాగేశ్వర్కు పార్టీలకతీతంగా వెల్లువలా మద్దతు లభించింది. ఈ ఇష్యూను తెలంగాణతో ముడిపెట్టడానికి చూసిన కొందరు అత్యుత్సాహాన్ని కూడా ఎండగట్టింది జెన్ జీ! ఇక ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ ఏకంగా మంత్రినే నిలదీశాడు. దీనికి హర్ట్ అయినట్టున్నాడు మంత్రి. వెంటనే ఉద్యోగంలోంచి అతగాడిని తీసేయించాడు. దీంతో ఆ డ్రైవర్కు సపోర్టుగా నిలవడమే కాదు.. సర్కార్ను కడిగిపారేశారంతా. దీంతో మరో మంత్రి పొన్నం రంగంలోకి దిగి తప్పైంది అని చెంపలేసుకునే పని చేశాడు. అతగాడు ప్రశ్నించింది సబబేనని కూడా కితాబిచ్చాడు పొన్నం. అంతలా వేడి రగిల్చారు మరి.
ఇక తాజాగా బాల్క సుమన్ మాటల మంటల ఉదంతం.. అదో నోటి దూల మాటలే తప్ప.. నిజంగా బాధితులకు మేలు చేసే చర్యైతే కాదు.. అందుకే దీన్ని బీఆరెస్ పార్టీ చర్యగానే చూశారంతా. ఆ పార్టీ దీన్ని తప్పుదిద్దుకునే పని చేయకపోగా.. సమర్థించింది. దీని వల్ల నష్టపోయింది కూడా. మాటలతో కాలక్షేపం చేసి.. అసలు సమస్యలు పక్కదారి పట్టేలా చేసిన బాల్క కేసు ఉదంతం జనాలకు ఏ మాత్రం ఉపయోగపడేది కాదు.. ఆపార్టీకి మరింత డ్యామేజీ తెచ్చిపెట్టే అంశమే. ఇదే అంశాన్ని వివరించగలిగారు. గతంలో మాదిరిగా కాలం లేదు.. వెనుకా ముందు చూసుకుని.. మాట్లాడాలనే సోయిని తెచ్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నదీ జెన్ జీ! ఒక్క చిన్న మాట.. మరో చిన్న పొరపాటు.. ఎవరిని ఎక్కడికైనా తెస్తుంది.? ఆకాశం నుంచి అధఃపాతాళానికి పడేస్తుంది. అంత కేర్గా అన్నీ గమనిస్తున్నది ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచం.. న్యూ జనరేషన్!