ఎన్టీఆర్ విగ్రహావిష్కరణేమో గానీ బీఆరెస్ చావుకొచ్చినట్టయ్యింది. మీరిచ్చిన హామీ.. విగ్రహం పెట్టుకుంటే మేమన్నాం.. మధ్యలో మా మీద వడ్డరు.. అని తిట్టుకోవడమే బీఆరెస్కు మిగిలింది. రేవంత్రెడ్డి తన ప్రసంగంలో ఎన్టీఆర్ విశ్వఖ్యాతిని వివరిస్తూనే.. కేసీఆర్, కేటీఆర్లను మధ్యలోకి లాగాడు. విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిసిన నాటి నుంచి దీనిపై రాజకీయంగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రజాసంఘాలు, సోషల్ మీడియా వారియర్స్ ప్రభుత్వ చర్యను తప్పుబట్టారు. వీటన్నింటికీ ఆన్సర్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఈ వేదికగా.
ఆయనకు ఓ కులానికి, ప్రాంతానికి, మాత్రమే పరిమితం చేయొద్దని, యావత్ దేశం గర్వించదగ్గ ముగ్గురు జాతిరత్నాలు.. బాబాసాహెబ్ అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్.. అని అభివర్ణించాడు. కేసీఆర్, కేటీఆర్ ఈ విగ్రహావిష్కరణను వ్యతిరేకించారని ఆయన గుర్తు చేస్తూ ఆ ఇద్దరిపై తన మాటలతో దాడి చేశాడు. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ అని గుర్తు చేశాడు. తెలంగాణకు ఎంతో మంది నేతలను ఎన్టీఆర్ అందించాడని పలువురు పేర్లను గుర్తుచేశాడు. మండవ వెంకటేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, దేవెందర్ గౌడ్, జానారెడ్డి లాంటి నేతలతో పాటు రాజకీయాల్లో రాణించిన కేసీఆర్ కూడా ఎన్టీఆర్ పుణ్యానే , ఆయన చొరవ వల్లే వచ్చాడన్నాడు రేవంత్.
ఇక కేటీఆర్ను పరోక్షంగా విమర్శించాడు సీఎం. ఎన్టీఆర్ పెట్టుకున్న ఫేకు నాయకుడన్నాడు. కొందరు నకిలీలుంటారని .. పేరు పెట్టుకున్నంత మాత్రాన వాళ్లు ఎన్టీఆర్లా నాయకుడు కాలేరని, తను ఆ విధంగా గొప్ప నాయకుడినని భ్రమిస్తున్నాడని కేటీఆర్ను పరోక్షంగా దుయ్యబట్టడం చర్చనీయాంశమైంది. ఇక తన పాలనను, ఇందిరా, ఎన్టీఆర్ పాలనలతో పోల్చుకున్నాడు రేవంత్రెడ్డి. ఎన్టీఆర్ పాలనా స్పూర్తితోనే తమ పాలన కొనసాగుతున్నదని, చాలా పథకాలు అప్పటి పథకాలతో పోలినవేనని గుర్తు చేసుకున్నారు. అందరికీ రెండు టర్ములు అధికారం ఇచ్చారని, తమకు కూడా మరోసారి అధికారం కచ్చితంగా ఇచ్చి తీరుతారని ధీమా వ్యక్తం చేశాడు రేవంత్. ఈ విగ్రహావిష్కరణపై వచ్చిన వివాదాన్ని ఆయన తెలివిగా తప్పించుకుంటూనే , ప్రతిపక్షాన్ని ఇందులో ఇరికించాడు.
ఇదే వేదికగా బీఆరెస్ పార్టీని అక్కడ దోషిగా నిలిబెట్టే ప్రయత్నం చేశాడు. తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి అందరి నోటా జయజయహే తెలంగాణ అని పాడించాడు. బీసీలకు రాజ్యాధికారం లభించింది అన్నగారి పాలనలోనేనన్న రేవంత్.. తాము అదే బాటన సాగుతామని ఈ వేదికగా ప్రతిన బూనారు. వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరుతూ.. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్నే గెలిపించాలని వారిని పరోక్షంగా అభ్యర్థించారు. ఏ ఎన్నిక వచ్చినా హైదరాబాద్ జనం తమతోనే ఉంటున్నారని, మున్ముందు కూడా ఇలాంటి ప్రోత్సాహమే ఇవ్వాలన్నారు. రేవంత్ బీఆరెస్ను దోషిలా నిలపడంతో .. ఆ పార్టీ పరిస్థితి తేలు కుట్టిన దొంగలా మారింది. ఖండించడానికి లేదు.. సమర్థించడానికి లేదు.. అన్నట్టు.. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్టుగా సైలెంట్గా ఉండిపోయిందా పార్టీ.