కేసీఆర్ తరచూ వేదికల మీద ఓ పిట్టకథ చెబుతుండే! ఎగిర్తపు చుట్టం కథ అది! ఓ ముసలవ్వ ఇంటికి ఓ చుట్టమొచ్చిడంట ఒక రోజు. వచ్చీ రాంగనే ఆగమాగం చేస్తున్నడంట. ఇగ నేను పోతా.. పోతా! అని .. అటూ ఇటూ కాలుకాలిన పిల్లిలెక్క తిర్గుతున్నడంట. అయ్యో బిడ్డా..! పోతవా? మరి ఇంట్లో చలిబువ్వనే ఉంది..! ఎట్లా? అని అడిగిందంట! నువ్వు ఫికర్ జేయకు అవ్వ.. నేను చలిబువ్వ తింటా! ఉడుకుది అయ్యేదాకా ఉంటా! అన్నాడంట.
కేసీఆర్ చెప్పే ఈ ఎగిర్తపు చుట్టం కథ అచ్చంగా ఆయనకే ఇప్పుడు సరిగ్గా నప్పుతుంది. కేటీఆర్ చాలా క్లారిటీగా చెబుతున్నాడు.. వరుసగా జరిగే బీఆరెస్ మీటింగు వేదికల మీద. ఆయన చెప్పినా మీరు వినలే. ఓడగొట్టిర్రు. ఆయన ముందే అన్నడు.. గెలిపిస్తే మీతో ఉంటా.. పనులు చేసిపెడతానని. ఓడిపోతే నాకు బాధలేదని కూడా చెప్పిండు. ఇప్పుడు చూడు.. ఎవరు బాధపడుతున్నరు? అని జనాన్ని నిలదీసినంత పనిచేస్తున్నడు కేటీఆర్.
ఇంతటితో ఆగుత లేడు. మా తాతాలు నేతులు తాగారు.. మూతుల వాసన చూడండి! అన్నట్టుగా కేసీఆర్ చేపట్టిన పదవులను వేదికల మీద ఏకరువు పెడుతున్నాడు కేటీఆర్. పుట్టి పెరిగిన బుద్ది మేనమామలకు తెల్వదా? కేసీఆర్ గురించి జనానికి తెల్వదా? కానీ, కేటీఆర్ చెబుతున్న విధానమేదైతే ఏందో..! అది కేసీఆర్ను అమాంతం ఆకాశంలోకి ఎత్తి, ఆయన చేపట్టిన పదవులు ఏమిటీ? ఏయే పదవులు చేపట్టి.. వాటికి వన్నెతెచ్చాడో.. సావధానంగా వివరిస్తున్నాడు.
ఇదంతా ఎందుకు? అంటే.. ఆయన చేపట్టని పదవి లేదు..! అన్నీ చేశాడు.. మీరు ఓడగొడితే ఆయనకు బాధలేదు.. మీకే బాధ.. అన్నట్టుగా సాగుతోంది ఆయన ప్రసంగ పైత్యం తీరు. అవును.. ఆయన ఒక్క పీఎం తప్ప.. అన్నీ చేశాడు అని అన్నాడు కేటీఆర్. అంటే ఇప్పుడు అర్జెంటుగా జనాలకు కేసీఆర్ అవసరం.. కానీ కేసీఆర్కు జనం అవసరం లేదు.. అన్నట్టు!
గెలిపిస్తే వస్తడట.. లేదంటే రెస్ట్ తీసుకుంటడట..! కొడుకు తండ్రి గురించి ఎంత గొప్పగా చెబుతున్నాడో! పుత్రుడు ఎంత పెద్దవాడై తన గురించి ఎంతలా అర్థం చేసుకుని.. ఎంత మంచిగా వివరిస్తుండోనని ఆ తండ్రి ఫామ్హౌజ్లో ఉండి ఎంతగా పరవశించి పోయి ఉంటాడో! ఇట్లా కొడుకు తండ్రిని, తండ్రి కొడుకును.. ఒకర్నొకరు వెనుకేసుకొస్తూ… ఒకర్నొకరు పొగుడుకుంటూ.. పోతున్నారు!
అప్పుడు ఆ పీఎం పదవి కోసమూ ట్రై చేసిన వైనాన్ని గుర్తు చేయలేదు మంచిగైంది. కానీ కేటీఆర్ గుర్తు చేయకున్నా.. ఇక్కడి జనాలు మాత్రం మరిచిపోలేదు. తెలంగాణ పేరునే పార్టీ నుంచి తీసిపారేసి.. ఇక తెలంగాణను బంగారు తెలంగాణ చేసేసినమ్మన్నట్టు.. ఇక్కడి పైసలు పొరుగు రాష్ట్రాలకు తరలించిన వైనాన్ని ఇంకా జనం మరిచిపోలేదు.
తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అయ్యింది.. అందుకే ఇక నేను ప్రధాని అవుతా.. కొడుకు సీఎం అవుతాడు..! నేను ఏది చెబితే అదే జనానికి.. అన్నట్టుగా పోయారు. నేల విడిచి సాము చేశారు. దెబ్బతిన్నారు. అయినా బుద్దిరాలేదు. పైగా.. కేటీఆర్ ఇప్పుడు జనాన్ని ఏమంటున్నాడో తెలుసా.. సోయి వచ్చిందా.. ఇప్పటికైనా? అని అడుగుతున్నాడు. అంటే.. తప్పు చేశారు కదా! మా కేసీఆర్కు ఏమన్నా బాధైతుందా? మీరే బాధపడుతున్నారు.. ! అని పుండును గెలికినట్టుగా సాగే కేటీఆర్ మాటలను జనం ఎలా అర్థం చేసుకోవాలె? వీళ్లు మారారని ఎలా నమ్మాలె?