రేవంత్ రెడ్డి సర్కార్లో చెప్పుకోదగ్గ పథకాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకమొకటి. ప్రభుత్వానికి మైలేజీ ఇచ్చేదిగా, పేద జనానికి సొంతింటి కల నెరవేర్చేదిగా ఇందిరమ్మ ఇళ్ల పథకం మంచి మార్కులనే కొట్టేస్తోంది. అయితే గత సర్కార్ హౌసింగ్ స్కీం విషయంలో అట్టర్ ఫ్లాపయిందనే చెప్పాలి. కేసీఆర్ తొలిసారిగా డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం గురించి చెప్పినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఆయన చెప్పిన విధానం కూడా బాగా ఆకట్టుకున్నది జనాలను. ఇంటికి చుట్టమొస్తే ఎక్కడుంటాడు.. ఆడపిల్లలు బట్టలు మార్చుకోవాలంటే ఇంకో గది అవసరం లేదా… మేకపిల్లను ఎక్కడ కట్టేసుకుంటారు..? అని వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కట్టిన ఇళ్లన్నీ పిచ్చుక గూళ్లను తలపిస్తున్నాయని, పైగా కాంగ్రెస్ నాయకులు తీవ్ర అవినీతికి పాల్పడిన పథకంగా ఇది పేరుకెక్కిందని కేసీఆర్ చేసిన కామెంట్స్ బాగా కనెక్టయ్యాయి.
కేసీఆర్ను తొలిసారిగా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపింపించడంలో ఇదీ ఓ కీలక భూమిక పోషించింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా ఇచ్చే ఈ డబుల్ బెడ్ రూం ఇండ్ల పై జనాల్లో విపరీతంగా హైప్ పెరిగింది. భారీ ఆశలు పెట్టున్నారు. కానీ ఈ పథకం అమలు విషయంలో సర్కార్ బాలారిష్టాలు ఎదుర్కొన్నది. సర్కార్ అంచనా వ్యయానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. వచ్చినా నష్టాలు వస్తున్నాయనే కారణంతో వెనక్కి తగ్గారు. చేసిన పనులకు బిల్లులు కూడా సమయానికి ఇవ్వలేదనే అసంతృప్తీ తోడైంది.
ఇవన్నీ ఒకెత్తయితే.. అసలు వాటిని నిర్మించేందుకు అనువైన సర్కార్ స్థలాలు లేకపోవడం కూడా ఓ ప్రధాన సమస్యగా మారింది. ఒకవేళ అక్కడకక్కడ కట్టినా.. వాటిని పంపిణీ చేసే విషయంలో మాత్రం సర్కార్ భయపడింది. వేలల్లో దరఖాస్తులు వస్తే.. వందల్లో కూడా ఇళ్ల నిర్మాణాలు జరగలేదన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. దీంతో ఒకరికి ఇచ్చి మరొకరికి ఇస్తే జనాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుందని భావించారు. అందుకే వాటిని ఉత్సవ విగ్రహాలుగా పెట్టి.. త్వరలో పంపిణీ చేస్తామని, సర్వే పేరుతో కొన్ని రోజులు కాలయాపన చేశారు.
ఎంక్వైరీ పేరుతో మరిన్న రోజులు గడిపారు. లబ్దిదారుల చిట్టా రెడీ అయినా.. వారికి లాటరీ ద్వారా ఇస్తామని చెప్పి ఊరించి ఉసూరుమనించారే తప్ప.. వాటిని పంపిణీ మాత్రం చేయలేదు. ఎన్నికల సమయం వచ్చిన తరువాత వీటిని ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కూడా వాడుకున్నది బీఆరెస్ పార్టీ. రెండోసారీ ఆశపడ్డారు జనాలు. నమ్మారు. కానీ మళ్లీ అదే తీరు. ఈ సారి జాగా ఉంటే ఐదు లక్షలిస్తామన్నారు. మూడు లక్షలని మాట మార్చారు. ఆ తరువాత ఏదీ ఇవ్వలేదు. ఇదీ బీఆరెస్ డబుల్ బెడ్ రూం ఇండ్ల కహాని.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తాజాగా హనుమకొండ జిల్లా కమలాపూర్లో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్లకు, స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మేమే కట్టించాం.. కేసీఆర్ కే ఆ క్రెడిట్ దక్కాలనే విధంగా కౌషిక్ మాట్లాడాడు. కానీ, కట్టిన ఆ ఇండ్లను పడావు పెట్టి భూత్ బంగ్లాలుగా మార్చారు. వీటిని మరమ్మత్తులు చేసి కాంగ్రెస్ సర్కార్ పేదలకు ఇస్తోంది. వారు చేయలేని పని వీరు చేసి చూపుతున్నారంతే. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందన్నట్టు.. క్రెడిట్ కొట్టేయాలనే ఆలోచన బాగానే ఉంది. కానీ.. ఆ పథకం అమలులో కేసీఆర్ సర్కార్ ఫెయిల్యూర్ను కూడా మరోసారి మీకు మీరే గుర్తు చేసినట్టవుతుందనే లాజిక్ మరిచినట్టున్నాడు పాడి.