ఉద్యమ దళపతి కేసీఆర్ సారథ్యంలో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఆ తరువాత పరిస్థితులు పూర్తిగా మారాయి. అప్పటి వరకు చూసిన కేసీఆర్ వేరు. తెలంగాణ సీఎంగా మారిన తరువాత కేసీఆర్ వేరు. ఇది ఎవరూ ఊహించలేదు. కొందరు బయటకు చెప్పుకున్నారు. మరికొందరు మౌనాన్నే ఆశ్రయించారు.
అయితే పదేండ్ల పాలన తరువాత బీఆరెస్ ఓటమి పాలు కావడం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భంగా కొన్ని మారిన పరిణామాలు, పరిస్థితులను బేరీజు వేసుకుంటున్నారు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటో పోల్చి చూసుకుంటున్నారు. స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన గళాలకు పదేండ్ల పాలనలో అవే దూరమైన చేదు అనుభవాన్ని మిగిల్చింది కేసీఆర్ పాలన.
ఇది నేనంటున్న ముచ్చట కాదు. సీనియర్ ఎడిటర్, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణే ఓ వేదికగా తన స్వీయానుభవాన్ని చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన జయశంకర్ జయంతి సభలో ఆయన తన స్వగతాన్ని పంచుకున్నారు. అప్పుడు అధికారంలో తామూ పదవుల్లో ఉన్నందున ఏమీ మాట్లాడలేపోయామనే పశ్చాత్తాపం కూడా మాటల్లో ధ్వనించింది.
పదేండ్ల పాలనలో స్వేచ్ఛ ఎలా బందీ అయిందో .. ధర్నాచౌక్ను ఎత్తేయడాన్ని ఓ మచ్చు తునకగా చెప్పుకోవచ్చన్నారాయన. ఈ నిర్ణయం సరైంది కాదని, చాలా మంది గొంతులు నొక్కే ప్రయత్నంగానే దీన్ని అభివర్ణించారు అల్లం. కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో తెలంగాణకు మేలు జరిగినా.. పాలన పరమైన నిర్ణయాలు, స్వేచ్చను నియంత్రించే అంశంలో తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, మేథావులు ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని ఆయన గొంతుకగా వెలువడటం చర్చనీయాంశమైంది.
ఇప్పుడు స్వేచ్చ దొరుకుతుందన్నారాయన. అంటే అప్పుడున్న నిర్బంధం ఇప్పుడు లేదనేది ఆయన అభిమతంగా చూడాలి. అంటే కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలపై నిర్బంధం కొనసాగిందని, ఎవరూ స్వేచ్ఛగా తమ భావాలు ప్రకటించే స్థితిలో అప్పుడు లేరనే విధంగా ఆయన కామెంట్స్ ఉన్నాయి.
ఇప్పుడా నిర్బంధం లేదని చెప్పడం ద్వారా రేవంత్ పాలన అందుకు భిన్నంగా ఉందనే అంశాన్ని పరోక్షంగా వెల్లడించినట్టయ్యింది. మేమే త్వరలో అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న బీఆరెస్.. ఈ అంశాలను ఇప్పటికైనా పరిగణలోకి తీసుకుంటుందా? తమ పాలన సెంట్ పర్సెంట్ కరెక్టుగానే ఉందనే భావవలోనే ఉందా? పరిస్థితులు చూస్తే వారు పరివర్తన చెందినట్టుగా ఏం కనిపించడం లేదు.
పదేండ్ల పాలనలో ప్రభుత్వంలో భాగస్వాములైన కేసీఆర్ ఉద్యమ సహచరులు ఇలా వేదికలపై ఇప్పుడు ఇలా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ లోపాలను, నిర్ణయాలను ఎత్తిచూపుతున్న సందర్భం చర్చనీయాంశమవుతోంది.