ఏప్రిల్ 20…
ఈ ఒక్క రోజులో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు. వాడీ వేడి పరిణామాలు. చర్చకు తెరతీసిన పర్యటనలు. ప్రకటనలు. ఓవైపు చాలా రోజుల తరువాత కేసీఆర్ బయటకు రావడం.. బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనుండటం. ఆయనేం మాట్లాడుతాడోననే పార్టీలకతీతంగా ఉత్కంఠ నెలకొని ఉండటం.. దీనికి తోడు రేవంత్ రెడ్డి ఇదే రోజు మేడిగడ్డకు పోయి..అక్కడ ప్రాజెక్టు రిపేర్పై అధికారులతో రివ్యూ పెట్టడం.. ఇది చాలదంటూ ఓ ప్రెస్మీట్.. ఆపై బహిరంగ సభ. ఓ వైపు ఎండలు తీవ్ర రూపం దాల్చి భగ్గు భగ్గుమంటుంటే.. ఈ రాజకీయ పరిణామాలు అంతకు మించి అన్నట్టుగా తయారయ్యాయి. రేవంత్ ఏం మాట్లాడుతాడో.. కేసీఆర్ను ఎన్ని తిట్లు తిడతాడోనని సహజంగానే ఓ ఆసక్తి ఏర్పడింది జనాల్లో. బహిరంగ సభలు ఇంచుమించుగా రెండూ ఒకేసారి జరిగేలా ఉన్నాయి.
సాయంత్రం 6 గంటలకు అంటున్నారు. రేవంత్రెడ్డి అంతకు ముందే ప్రెస్మీట్ కూడా నిర్వహించనున్నారు.. దీంట్లో దాదాపుగా కేసీఆర్ సభ, కాళేశ్వరం మేడిగడ్డ ఇష్యూ, హరీశ్ రావు హడావుడి ఢిల్లీ పర్యటన.. ఇవన్నీ ప్రస్తావనకు వచ్చే వీలుంది. ఇక కేసీఆర్ నోటి వెంట రేవంత్ పేరు వస్తుందా? అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే.. ఆయన ఇప్పటి వరకు మాట్లాడిన, సర్కార్ను విమర్శించిన ఉదంతాల్లో ఎక్కడా రేవంత్ పేరు తీయలేదు. దీన్ని కూడా కాంగ్రెస్ అడ్వాంన్టేజీగా తీసుకున్నది. మా సీఎం పేరెత్తడానికే కేసీఆర్ జంకుతున్నాడు. రేవంత్ దెబ్బకు ఫామ్హౌజ్కే పరిమితమయ్యాడు. ఇక ఆయన పేరు తీసే ధైర్యమా? అంటు దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు గతంలో. దీనిపై బీఆరెస్ కూడా స్పందించింది. అసెంబ్లీకి రాకపోవడానికి, సీఎం రేవంత్ పేరు తీయకపోవడానికి.. అతనికి అంత సీన్ లేదు కాబట్టేనని సమర్థించుకున్నది. ఇవి పాత ముచ్చట్లు.
ఇక ఇప్పుడు కొత్త సభలు. మారిన రాజకీయ సమీకరణలు. వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎట్లుంటాయో చూడాలి. ఇదే కాదు.. ఇంకో ముచ్చట కూడా హాట్ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా.. మధ్యలోకి కచ్చితంగా కవిత వస్తున్నారు. అది కాంగ్రెస్ అయినా.. బీఆరెస్ అయినా. బీఆరెస్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అన్నట్టుగానే ఆమె రాజకీయంగా వేస్తున్న అడుగులు ఉంటున్నాయి. ఇవాళ రాజకీయంగా చోటు చేసుకున్న అధికార, ప్రధాన ప్రతిపక్ష సభ, పర్యటనలు ఓ వైపు రక్తికట్టి.. ఉత్కంఠకు దారి తీస్తుంటే.. మధ్యలో కవిత కూడా ఈ ఇష్యూలో తలదూర్చారు.
పరోక్షంగా బీఆరెస్ను దుయ్యబట్టారు. అదీ కాళేశ్వరం విషయంలో. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ రిపేర్లు, ఇంజినీర్లతో రివ్యూ జరుగుతున్న వేళ.. ఇదే ప్రధాన ఇష్యూగా తీసుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో రేవంత్.. కేసీఆర్ పాలనపై విరుచుకుపడనున్నాడనే ప్రచారం నేపథ్యంలో ఆమె కూడా ప్రాజెక్టుల అంశాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఓ పేపర్లో వచ్చిన వార్తే ఆమెకు ఆధారమైంది. రంగారెడ్డి జిల్లాలోని కుర్మిద్ద, నానక్ నగర్, మంతన్ గౌరెల్లి, నల్లవెల్లి తదితర గ్రామల ప్రజలు సాగునీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ట్యాంకర్ల ద్వారా మడులు తడుపుకోవాల్సి వస్తుందని ఆ వార్త సారాంశం. దీన్ని ఆధారంగా ఆమె తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
రెండు పార్టీల తీరును ఎండగట్టారు. పన్నెండేండ్ల పాటు 2.20 లక్షల కోట్లు ఖర్చు చేసినా.. సాగునీరందించలేక పోయిన పాలకులు.. అనేది ఆమె విమర్శనాస్త్రాల్లో ప్రధానమైది. అయితే దీన్ని లోతుగా చూస్తే.. ఆమె ఏం చెప్పాలనుకున్నారో అవగతం చేసుకుంటే… కచ్చితంగా ఆమె కేసీఆర్ పాలనను, కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూనే ప్రధానంగా తీసుకుని విమర్శించారని చెప్పవచ్చు. ఎందుకంటే సాగునీటి ప్రాజెక్టుల కోసం పెట్టిన ఖర్చుల్లో అత్యధికంగా.. కాంగ్రెస్ చెబుతున్నట్టు లక్ష కోట్ల వరకు ఖర్చు పెట్టింది ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే. మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోవడం.. ఈ ప్రాజెక్టుపై కమిషన్ వేయడం.. వినియోగించకపోవడం.. తాజాగా సీఎం అక్కడికే వెళ్లడంతో కవిత తనదైన శైలిలో ఇష్యూ బేస్డ్గా కాళేశ్వరంపై పరోక్ష విమర్శనాస్త్రాలు సంధించారని చెప్పవచ్చు.
ట్యాంకర్ల ద్వారా నీటి వినియోగానికి రూ. 1.50 లక్షలు ఖర్చు చేస్తున్నారని చెబుతూనే.. ఇదొక్క ఉదంతం చాలదా..! బీఆరెస్, కాంగ్రెస్ దుబారా పనులకు అద్దం పట్టేందుకు.. అని ఆ ప్రకటనలో విమర్శించారు. అంటే.. ఆమె రెండు పార్టీల పేర్లు తీసుకున్నా..పదేళ్ల పాలన గురించే అందులో నిరూపయోగంగా మారడం ద్వారా కాళేశ్వరం దుబారాగా ఖర్చు కిందకు వచ్చిందనే అర్థం వచ్చేలా ఆమె కామెంట్ చేయడం ప్రస్తుత రాజకీయాన్ని మరింత వేడెక్కించినట్టయ్యింది. ఇక ఇవాళ ఈ ఇద్దరి సభలు ముగిసిన తరువాత కూడా కవిత స్పందించే అవకాశాలున్నాయి. ఈమె ఏం మాట్లాడుతుందోననే ఆసక్తి, ఉత్కంఠ కూడా ఇప్పుడున్న దానికి అదనంగా యాడ్ అయింది. ఇవీ ఇవాళ్టి విశేషాలు.