రేవంత్ వేసిన గాలానికి చిక్కుకున్నాడు కిషన్రెడ్డి. కేసీఆర్తో అది సాధ్యం కాలేదు. తిట్టి ఊరుకున్నాడు. పంతం పట్టి పట్టించుకోలేదు. కానీ రేవంత్ అలా కాదు. తిడుతున్నాడు. సెగబెడుతున్నాడు. తను అనుకున్నది నెరవేరేలా పరిస్థితులను దారికి తెచ్చుకుంటున్నాడు. కిషన్రెడ్డి విషయంలో కూడా అదే పాలసీని అవలంభించాడు రేవంత్. అది ఫలప్రదమే అయ్యింది.
అంటే.. రేవంత్ వేసే అడుగు.. రాజకీయ వ్యూహం సరిగ్గానే ఉందన్నమాట. కేంద్రంతో ఎలా పనిచేయించుకోవాలి? ఆ కేంద్రం వినకపోతే.. ఇక్కడ ఏ స్విచ్ నొక్కితే అక్కడ బల్బు వెలుగుతుందో సరిగ్గా తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి. సక్సెస్ మంత్ర కనుక్కోగలిగాడు. అయితే కిషన్రెడ్డిని తిట్టినా రేవంతే హీరో అవుతున్నాడు. కిషన్రెడ్డితో పనిచేయించుకున్నా.. రేవంత్ రెడ్డే హీరో అవుతున్నాడు. మరి కిషన్రెడ్డికి ఎందుకు మైలేజీ రావడం లేదు. ఆ పార్టీకి ఎందుకు ప్రతిష్ట పెరగడం లేదు..?
కేంద్రం నుంచి సాయం అందడం లేదు.. దీనికి కిషన్రెడ్డి సహకరించకపోగా.. ఆటంకంగా మారాడని రేవంత్రెడ్డి వరుసగా తిడుతూ వస్తున్న నేపథ్యం.. తాజాగా ఢిల్లీలో కేంద్ర పెద్దలతో కలిసి మెట్రోపై సానుకూల చర్చల ఉదంతం ఎపిసోడ్ వరకు.. కిషన్రెడ్డి ఆటలో అరటిపండుగానే మారాడు. రేవంత్రెడ్డికి మాత్రం హీరో వర్షిప్ వచ్చి పడింది. కేసీఆర్తో కూడా కాని పని రేవంత్ చేసి చూపిస్తున్నాడు.. పర్వాలేదు..! ఇట్లనే ఉండాలె. కేంద్రంతో రాజకీయాలు చేసే సమయంలోచేయాలె..రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులు రాబట్టుకునే విషయంలో ఒకటికి పదిసార్లు వెంటపడి, వెంటాడి సాధించుకోవాలె..! అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే కిషన్రెడ్డికి ఈ విషయంలో దక్కాల్సిన మైలేజీ రాకపోవడానికి కారణం.. ఆయనకు రాజకీయ వ్యూహం లేకుండా పోవడం.. తనకు తెలంగాణ బీజేపీ నేతల నుంచి ఎలాంటి సహకారం అందకపోవడం.. ! ఈరెండు కారణాల వల్ల కిషన్రెడ్డి.. రేవంత్ వేసిన వ్యూహంలో పావుగా మారాడే తప్ప.. తెలంగాణకు కేంద్రం ఏదో చేసింది.. నా వల్లే అది సాధ్యమైందని చెప్పుకునే విషయంలో స్పష్టమైన అడుగులు వేయలేకపోయాడు.
అందుకే.. ఈ ఎపిసోడ్కు శుభంకార్డు పడగానే.. మీడియా ముందుకు వచ్చి.. ఢిల్లీలో జరిగిన భేటీ గురించి ప్రస్తావించాడు. మంత్రులను కలిపించాను. సానుకూలంగా చర్చలు జరిగాయని చెప్పుకొచ్చాడు. కిషన్రెడ్డి చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే.. చూశారా! రేవంత్రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలే..! నేనేం తెలంగాణకు శత్రువును కాదు… తెలంగాణ అభివృద్ధికి ఆటంకమూ కాదు. కావాలంటే.. ఇగో ఈ రోజు జరిగిన ఉదంతాలే ఉదాహరణ.. అన్నట్టుగా ఉన్నాయి.
కానీ వినేవాళ్లకు మాత్రం.. ఆయన తిడితేనే తప్ప.. నువ్వు కదల్లేదుగా. తిట్టీ తిట్టీ అట్ల బద్నాం చేసిండు.. ఇప్పుడు పని చేపించుకుని ఆయనకే మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. మధ్యలో నీ పాత్ర కేవలం మధ్యవర్తిత్వమే కదా..! అనే విధంగా అర్థమైంది. చాలా మందిలో కూడా ఇదే భావన ఉంది.
అంతిమంగా అతను అప్పీలు చేసుకునేది ఎట్లా ఉందంటే.. ఇకపై రేవంత్ నన్ను తిట్టొద్దు.. నేను కూడా తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉంటున్నా తెలుసా..? అని ఇక్కడి ప్రజలకు, రాజకీయ నాయకులకు, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులకు చెప్పకనే చెప్పినట్టు చెప్పినట్టనిపిస్తోంది.
ఇక ఇప్పుడు కిషన్రెడ్డిపై ఇంకా రెండు టాస్క్లు మిగిలి ఉన్నాయి. ఒకటి ప్రభుత్వానికి ప్రధానంగా గుది బండగా మారిన ధాన్యం కొనుగోళ్లు. దాదాపుగా కేంద్రం కొనగా సర్కార్ వద్దే ఇంకా 25 వేల టన్నుల ధాన్యం మిగిలి ఉంది. మహారాష్ట్ర సీఎంతో చర్చలు. వీటిపై కిషన్రెడ్డి పాత్ర ఎలా ఉండబోతుందో..?