TMC Revolt: ఓడలు బండ్లు అవ్వడం.. బండ్లు ఓడలవ్వడం.. అనే సామెత ఇప్పుడు బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి పర్ఫెక్ట్గా సూటవుతుంది. ఇక్కడ దీదీని ఇప్పుడు తృణమూల్ అధినేత్రిగా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడా పదవి నుంచి ఆమెను తప్పించేశారు రెబల్స్. కోల్కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ హైడ్రామాకు వేదికైందనే చెప్పాలి. శాసనసభలో ప్రతిపక్ష నేత రితాబ్రతా బెనర్జీ నేతృత్వంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు, కీలక నేతలు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అసలైన తృణమూల్ కాంగ్రెస్ తమదేనని ప్రకటించిన రెబల్స్.. మమతను పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించారు.
ఇక్కడ మరో హైలేట్ ఏంటంటే.. దీదీ కావాలంటే పార్టీ అడ్వజర్గా ఉండొచ్చంటూ రెబెల్ లీడర్ రితాబ్రతా బెనర్జీ చేసిన కామెంట్లు ఇప్పుడు బెంగాల్ వ్యాప్తంగా దుమారం రేపాయనే చెప్పాలి. మమతను రాజకీయంగా పూర్తిగా పక్కన పెట్టే వ్యూహంలో భాగంగానే తిరుగుబాటు నేతలు వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మమతా బెనర్జీ మనస్తత్వం గురించి తెలిసినవారేవ్వరైనా ఆమె ఓటమిని అంత తొందరగా ఒప్పుకుంటుందంటే నమ్మరు. దీనికి తగ్గట్టుగానే దీదీ ఓ నిర్ణయం తీసుకుంది. తన అధ్యక్షతన కొత్త నేషనల్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసి.. ఆ వివరాలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించింది దీదీ. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్కు చైర్పర్స్న్గా తానే ఉన్నానని అందులో క్లియర్ కట్గా తెలిపింది.
ఈ నిర్ణయంతో పార్టీపై తనకు ఇంకా పట్టు ఉందని పార్టీ తనదే అని చెప్పకనే చెప్పింది మమతా బెనర్జీ. 1998లో కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకుని ఒంటిచేత్తో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు మమతా బెనర్జీ. ఎర్రకోట లాంటి బెంగాల్ను దశాబ్దాల పాటు ఏలిన కమ్యూనిస్టులను గద్దె దించి చరిత్ర సృష్టించారు. కానీ ఇదంతా గతం.
Also read: Iran Sanctions: వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. కానీ..!
ఇంతటి ఘన చరిత్ర ఉన్న దీదీకి ఇప్పుడు సొంత పార్టీలోనే అత్యంత ఘోరమైన పరాభవం ఎదురైంది. పార్టీ నుంచి ఆమెను తొలగించామంటూ రెబెల్స్ ప్రకటించడం ఆమె 28 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలోనే అతిపెద్ద మచ్చగా మిగిలిపోనుంది. మరో దారుణమైన విషయం ఏంటంటే. ఈ సెషన్కు సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్లతో కలిపి దాదాపు 500 మందికిపైగా తృణమూల్ ప్రతినిధులు హాజరయ్యారు. మమతా బెనర్జీకి అత్యంత ఆప్తులుగా, ఆమె నీడలా భావించే మాజీ కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిశ్వాస్, అరూప్ రాయ్ వంటి సీనియర్ నేతలు తిరుగుబాటు క్యాంప్లోకి వెళ్లడం పార్టీపై ఆమెకున్న పట్టు పూర్తిగా సడలిపోయిందనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ భేటీలోనే కొత్త పార్టీ ఛైర్మన్గా అరూప్ రాయ్ను వాయిస్ ఓట్ ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కాదు విషయం. కానీ పార్టీపై అధిపత్యం ఎవరిది అనేదే ముఖ్యం. అందుకే దీదీ ఇప్పుడు అస్థిత్వ పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం బెంగాల్లో దీదీ శకం ముగిసిందనే చర్చ జోరుగా కొనసాగుతోంది. కానీ ఈ పొలిటికల్ సునామీని తట్టుకొని మళ్లీ పుంజుకుంటారనే చర్చ కూడా ఉంది. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
Also read: Fake Doctor: సంతాన లేమితో బాధపడుతున్నారా.. మేడ్చల్లో నకిలీ వైద్యుడు కలకలం