టీఆరెస్ చీఫ్ కవిత భూ పంపిణీపై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భూ లక్ష్మీ పేరుతో ప్రతీ పేద కుటుంబానికి ఎకరం భూమి ఇస్తామని తన పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. ఇదెలా సాధ్యమని అడిగిన వారికి ఆమె నుంచి ధీమాతో కూడిన సమాధానమొస్తుంది. తాము ప్రాక్టికల్ ఆలోచించి, అధ్యయనం చేసిన తరువాతనే , సాధ్యాసాధ్యాలపై నిపుణులు, మేధావులతో చర్చించిన పిమ్మటే ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపారామె.
ఆమె ఇది వరకే ప్రకటించిన పాంచజన్యంలోని ఉచిత ప్రైవేటు విద్య, ఉచిత ప్రైవేటు వైద్యం.. అనే స్కీంలు కూడా చర్చల్లోకి వచ్చాయి. వీటి సాధ్యాసాధ్యాలపై ప్రతిపక్షలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలోనే ఆమె ఈ భూ లక్ష్మీ పథక రచనను బహిర్గతం చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇదే క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చిన తరువాత తన పార్టీ మ్యానిఫెస్టోలో దళితులకు మూడెకరాలు ఇస్తామని హామీనిచ్చిన గెలిచిన అంశాన్ని కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నాయి ప్రతిపక్షాలు.
కేసీఆర్ ఈ మూడెకరాల పథకాన్ని కొనసాగించలేకపోయారు. కావాల్సినంత ప్రభుత్వ భూమి దొరకలేదు. కొనుగోలు చేద్దామన్నా.. విపరీతమైన ధరలు పెట్టి ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసి దళితులకు ఇవ్వాలని అనుకోలేదు. అందుకే ఈ స్కీమ్ను ఆదిలోనే ఆపేశారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఓ రెండు వేల ఎకరాల వరకు పంపిణీ చేశారంతే. దీనిపై ప్రతిపక్షాలు అడగలేదు. ప్రభుత్వమూ పట్టించుకోలేదు. రెండో టర్ము అధికారంలోకి వచ్చిన తరువాత బీఆరెస్ పార్టీగా తన పార్టీ పేరును మార్చుకుని జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. దళితుల అంశాన్ని దేశవ్యాప్త చర్చ చేయాలని భావించారు.
అందుకే తాను ఫెయిలైన స్కీమ్ తాలూకు మచ్చ ఉండకూడదని, దళితబందు స్కీమ్ను తెరపైకి తెచ్చారు. లబ్దిదారుల ఆర్థిక స్థితి ఎలాగైనా ఉండని, చివరకు వారు ప్రభుత్వ ఉద్యోగులై ఉన్నాసరే, ప్రతీ కుటుంబానికి పది లక్షల వంద శాతం సబ్సిడీ రుణాన్ని ఇచ్చే దళితబంధు స్కీమ్ను ప్రవేశపెట్టారు. కేవలం ఇది తన జాతీయ రాజకీయల ఎంట్రీ కోసమేననే విషయాన్నిప్రజలు తొందర్లోనే గమనించారు. కానీ ఈ పథకం వల్ల బీసీ వర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి కేసీఆర్ ఆలోచనపై. మరోవైపు ఈ స్కీమ్ బీఆరెస్ ఎమ్మెల్యేలకు, నాయకులకు కమీషన్లు అందించే పథకంగా పక్కదారి పట్టి బద్నాం చేసింది బీఆరెస్ను. అయితే ఇప్పుడు కవిత కూడా భూముల అంశాన్ని లేవనెత్తుతున్నారు.
గతంలో కేసీఆర్ మూడెకరాల అంశాన్నీ ఆమె గుర్తు చేసి.. భూముల సేకరణ.. పంపిణీ పెద్ద సమస్య కాబోదంటున్నారు. సోషల్ జస్టిస్ జరగాలంటే…మళ్లీ ల్యాండ్ రీ డిస్ట్రిబ్యూషన్ జరగాల్సిందేనంటున్న కవిత.. తాముఅధికారంలోకి వచ్చాక ఎకరం భూమి పంచుతామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే ఆ పనిచేయాలని డిమాండ్ చేయడం మూలంగా రేవంత్ సర్కార్పై ఒత్తిడి పెంచుతున్నారు. పేదల భూములను లాక్కుంటామంటే మాత్రం ఊరుకునేది లేదన్న ఆమె.. కుటుంబానికి ఎకరం భూమి పంచే అవకాశం ఉందన్న లెక్కలు చూసుకున్న తర్వాతే భూ లక్ష్మి పథకం గురించి మాట్లాడుతున్నానని క్లారిటీ ఇచ్చారు.
ప్రభుత్వం వద్ద 60 లక్షల ఎకరాలు ఉందని, భూదాన్ భూములు కూడా ఉన్నాయని, భూదాన్ భూముల్లో దాదాపు లక్ష ఎకరాలు ఎక్కడకు పోయాయో లెక్క లేకుండా చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కుటుంబానికి ఎకరం భూమి పంచేందుకు ఉందని, కానీ ప్రభుత్వాలకు మనసు లేదని ఆమె కేసీఆర్, రేవంత్ సర్కార్లను విమర్శించారు. సీడ్ కంపెనీలకు బినామీ పేర్లతో వేలాది ఎకరాలు ఉన్నాయని, ప్రభుత్వం సిన్సియర్ గా ఆలోచిస్తే భూమి ఇవ్వవచ్చునని, తాను ఇదే తరహాలో ఆలోచించి ఎకరా చొప్పున భూమి ఇచ్చేందుకు ప్రణాళికలు వేశామని చెప్పడం ద్వారా అది మాతో సాధ్యమవుతుందనేలా ఆమె ప్రకటించుకున్నారు.