తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ మీద ఉద్యోగులకు నమ్మకం పోయింది. లేస్తే మనుషులం కాదు.. అనేలా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారు. ఆ వెంటనే వెనక్కి తగ్గుతారు. ఈ కాంగ్రెస్ సర్కార్ హయంలో మూడేండ్ల కాలంలో ఇలా ఎన్నిసార్లు చేశారో వారికే తెలియదు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ జేఏసీ మీద పూర్తిగా నమ్మకం సడలింది.
ఈ మాట నేను చెబుతున్నది కాదు.. వారే వేదిక మీద చెప్పుకున్నారు. కానీ ఈసారి అలా చేయబోమని కూడా ఉద్యోగుల్లో నమ్మకం ప్రోదీ చేసేలా గట్టి మాటలు చెబుతున్నారు. ఏం చేస్తారో తెలియదు కానీ, మొత్తానికి తాజాగా మరో ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఇక ప్రభుత్వంతో చర్చలుండవని కూడా కుండబద్దలు కొట్టింది జేఏసీ.
తాడో పేడో తేల్చుకునేందుకు నిరసన రూపాలను ఎంచుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ పిలుపునిచ్చారు. వేదికల మీదకెక్కి ఆహో.. ఓహో అని సీఎంను కీర్తించడం.. ఆ తరువాత ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం.. ఆ వెంటనే వెనక్కి తగ్గడం ఈ మూడేండ్ల కాలంగా చేస్తూ వస్తున్నారు జేఏసీ నేతలు. అందుకే ఉద్యోగులు తమను నమ్మడం లేదని తెలుసుకుని, ఇక ఇలా రంగంలోకి దిగారు.
ఇప్పుడు చేపట్టేబోయే నిరసన ఉత్తుత్తి కాదు నిజంగా.. నమ్మండి ప్లీజ్ అని వారే బతిమాలుకునే వరకు వచ్చింది పరిస్థితి. నిన్న ప్రెస్మీట్ పెట్టిన జేఏసీ నేతలు ఏమన్నారంటే..
జేఏసీ కార్యాచరణ ప్రకటించి రద్దు చేసుకుంటుందనే అపోహ క్షేత్రస్థాయిలో ఉంది. ఈసారి అలా కాకుండా కొట్లాడుతాం. సీపీఎస్ రద్దు… ఓపీఎస్ అమలు, పీఆర్సీ ఫిట్మెంట్, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్, డీఏ బకాయిల చెల్లింపులు తదితరాలన్నీ అమలు చేయాలి. అందుకోసం ఈనెల 27న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు మహాధర్నా నిర్వహిస్తాం. అదేవిధంగా పీఆర్సీ అమలయ్యే వరకు ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరువుతారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలుంటాయి. సెప్టెంబర్ 10న ఉద్యోగులతో ఛలో హైదరాబాద్ నిర్వహించి హైదరాబాద్లో మహా ధర్నా నిర్వహిస్తాం.’ అని తెలిపారు.
మరి దీనిపై సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి. నన్ను కోసినా నిధులు లేవనే మాట మళ్లీ రిపీటయితే కాదనే అనుకుంటున్నాయి ఉద్యోగ సంఘాలు. ఎందుకంటే ఎన్నికల సమయం ఆసన్నమైంది. అక్కడ బీఆరెస్ ప్రతిపక్షంగా బలమైన పాత్ర పోషిస్తున్నది. ఈ సమయంలో ఉద్యోగులతో ప్రభుత్వం గ్యాప్ పెంచుకోవాలనైతే చూడదు.
కానీ జేఏసీ డిమాండ్లన్నీ పరిష్కారమైతే కావు. ఆ విషయం వారికీ తెలుసు. మధ్యేమార్గంగా ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టినా చాలు అనే భావనతో కూడా ఉద్యోగులున్నట్టు తెలుస్తోంది.