రాజకీయం కోసం ఎమైనా చేస్తారు? ఒక్కోసారి దిగజారి. మరోసారి మితిమీరి. బండి భగీరథ్ విషయంలో బీఆరెస్ సోషల్ మీడియా టీమ్, కేటీఆర్ బ్యాచ్ చేసింది ఇలాగే ఉంది. ఆ కేసులో గోప్యంగా ఉండాల్సిన మైనర్ బాలిక విషయాలు బయటకు వస్తాయనే కనీస సోయి లేకుండా బండి సంజయ్ టార్గెట్గా .. పోస్టర్లు అతికించడం, మెట్రోలో ప్రచారం చేయడం ఇవన్నీ చేశారు. భగీరథ్ లొంగిపోవడంతో అంతా మా ఘన విజయమేనని చంకలు గుద్దుకున్నారు. ఆ అమ్మాయి కుటుంబాన్ని బజారు కీడ్చినా పర్వాలేదు కానీ.. పొలిటికల్ మైలేజీ కోసం చేసిన నిర్వాకం అనుకున్నట్లే అయ్యింది కదా అనేది ఆ పార్టీ సంబురం కావొచ్చు. తనదాకా వస్తే అన్నట్టు.. తాజాగా ఓ కేసు వెలుగులోకి వచ్చింది.
అందులో విలన్ బీఆరెస్ నాయకుడు. ఏం చేశాడు. ఓ 18 ఏళ్ల అమ్మాయిని .. ఆ తల్లిదండ్రుల అప్పులన్నీ తీరుస్తానని నమ్మబలికి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి పారిపోయి రాగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బీఆరెస్ గప్చుప్.. ఆ పార్టీ సోషల్ మీడియా సైలెంట్. కేటీఆర్, ఆర్ ఎస్ ప్రవీణ్కుమార్ చెప్పే సూక్తి ముక్తావళి మూగబోయింది. అయినా ఆ ఇంటి ఆడబిడ్డ కవితనే బయటకు వచ్చి తనను దారుణంగా అవమానించారని, అవమానకర రీతిలో పార్టీ నుంచి వెళ్లగొట్టారని, వారి వల్ల జైలు పాలైతే కనీసం పట్టించుకోలేదని పదే పదే వందల సార్లు చెబుతూనే ఉన్నారు. ఈ ఒక్క ఘటనతో ఆ పార్టీ తీరు.. కేసీఆర్, కేటీఆర్లు మహిళల పట్ల చూపే వైఖరి.. వారికి మహిళ పట్లున్న పట్టింపు, శ్రద్ద ఏపాటితో తెలంగాణ సమాజానికి అర్థమైపోయి ఉంటుంది. సరే, ఈ బీఆరెస్ లీడర్ను ఏం చేస్తారో…? చర్యలు ఏముంటాయో… ! వారికే వదిలేద్దాం..! విషయానికొద్దాం..
జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన ఓ 18ఏళ్ల అమ్మాయిని.. అదే ఊరికి చెందిన ఆవుల ప్రశాంత్ కుమార్ రెడ్డి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఆమె తండ్రి, ఓ ఎస్టీ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికిద్దరు సంతానం. తనకు 20 లక్షల దాకా బాకీ ఉన్నదని, ప్రశాంత్కుమార్తో చెప్పగా.. ఆ బాకీ అంతా నేను తీర్చేస్తాను.. నీ బిడ్డెనిచ్చి పెళ్లి చేసి ఇవ్వు.. అని కండిషన్ పెట్టాడు. ఆ తల్లిదండ్రులిద్దరు తాము చేసిన అప్పులకు ఆ అమ్మాయిని అప్పగించేశారు.
ఈనెల 8న అక్కడే ఓ గుడిలో బలవంతంగా పెళ్లి చేశారు. ఆ మరుసటి రోజే ఆమె తప్పించుకుని పారిపోయి మానవ హక్కుల కమిషనర్ను కలుసుకున్నది. అక్కడి నుంచి లోకల్ ఎస్పీకి సమాచారం వెళ్లింది. ఇప్పుడీ అమానవీయ ఘటన తాలుకు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంగట్లో పశువును కొన్నట్టు ఆమెకు 20 లక్షల వరకు అప్పగిస్తానని చెప్పి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఆ బీఆరెస్ నాయకుడు. దీనిపై ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన, ఖండన, చర్యలు రాలేదు. ఆ పార్టీ సోషల్ మీడియా రెస్టులో ఉంది. మొన్నటి దాకా అలసిపోయి ఉన్నందున .. మళ్లీ బాస్ ఆర్డర్ వేసే దాకా అది యాక్టివ్ కాదు. ఆరెస్ ప్రవీణ్కుమార్కు అసైన్మెంట్ ఇస్తే తప్ప.. కదలడన్నమాట. రోబోలాగ. దీనిపై బీఆరెస్ మౌనముద్ర వహించడాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.