కిషన్రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యాడు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు దాపురించిన పెద్ద శని అతడని అభివర్ణించాడు. ఉప్పల్లో జరిగిన బహిరంగ సభలో.. సీఎం మాట్లాడుతూ.. కిషన్రెడ్డి చేయాల్సిన బాధ్యతలను విస్మరించి, బీజేపీ పార్టీకే అన్యాయం చేసేలా.. బీఆరెస్తో అంటకాగుతున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. తప్పించుకు తిరుగువాడు కిషన్రెడ్డి సుమతీ! అన్నట్టుగా.. తనకేం పట్టనట్టుగా రాష్ట్ర ప్రాధామ్యాల విషయంలో, కేంద్రం అనుమతులిచ్చే అంశంలో సర్కార్ కాళ్లలో కట్టెలడ్డం పెడుతున్నాడని ధ్వజమెత్తారాయన.
ధాన్యం కొనుగోలు అంశంతో పాటు, మెట్రో విస్తరణ, రీజనల్ రింగు రోడ్డు, మూసీ ప్రక్షాళనకు నిధులు.. తుమ్మడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల బ్యారేజీ నిర్మాణంలో .. అన్నింట్లోనూ అడ్డం తగులుతున్నాడని సీఎం తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయంగా కలకలం రేపింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 80 శాతానికి పైగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, తెలంగాణవి మాత్రం 50 శాతం కూడా కొనడం లేదన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 75 లక్షల మె. టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, కానీ కేంద్రం మాత్రం 50 లక్షల మె. టన్నులే కొనుగోలు చేస్తానంటున్నదని, మరి మిగిలిన 25 లక్షల మె. టన్నుల ధాన్యం ఏం చేయాలని సీఎం .. కిషన్రెడ్డిని ప్రశ్నించారు. బీజేపీలోనే ఉంటూ.. ఇక్కడ పదవులు అనుభవిస్తూ..ఆ పార్టీ కార్యకర్తలకు ఏ ఒక్కరికీ మేలు చేయని లీడర్ కిషన్రెడ్డి అని.. బీజేపీలో ఉంటూ.. పక్క పార్టీలో తింటాడని, కేటీఆర్ మాట వింటాడని రేవంత్ ఘాటుగా విమర్శించారు.
అందుకే రాష్ట్ర అభివృద్ధి విషయంలో తన వంతు పాత్ర పోషించకపోగా.. తాను చేస్తున్న ప్రయత్నాలను కూడా అడ్డుకుంటున్నాడని ధ్వజమెత్తారాయన. దొంగది కాదు.. దొడ్లెకు రాదు.. అన్నచందంగానే కిషన్రెడ్డి వ్యవహరిస్తున్నాడని, అతనికి ఈనెల 15 వరకు గడువిస్తున్నట్టుగా చెప్పారు. ఆ తరువాత కిషన్రెడ్డిని అడుగడుగునా నిలదీసి ప్రజల ముందు అతని నిజస్వరూపాన్ని బయటపెడతామని వార్నింగ్ ఇచ్చారు సీఎం. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం మహారాష్ట్ర సీఎంతో అనుమతిని కూడా రద్దు చేయించిన ఘనుడు కిషన్రెడ్డి అని ఆరోపించారు.
ఇక్కడి ప్రభుత్వానికి సహకరించకపోతే.. అప్పుడు నీ సంగతి చెబుతామని ఆయన మరోసారి హెచ్చరించారు. కిషన్రెడ్డిపై విమర్శలు, ఆరోపణలతో సీఎం రేవంత్ తన మాటల దాడిని ముమ్మరం చేస్తూ వస్తున్నారు. సమస్య తీవ్రత నానాటికి పెరుగుతూ రావడంతో… దీనికి మూల కారణమైన కిషన్రెడ్డిని మెయిన్ విలన్గా జనం ముందు ప్రొజెక్ట్ చేసేందుకు సర్కార్ రెడీ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బీఆరెస్, బీజేపీ రెండూ ఒక్కటేనని, ఈ రెండు పార్టీలు కలిసి .. తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నాయనే విషయాన్ని కూడా ఆయన బలంగా జనంలోకి తీసుకెళ్లే క్రమంలో తన వాయిస్ను పెంచుతూ పోతున్నారు. ఇవాళ సీఎం మాట్లాడిన ఈ మాటలు… ఆ రెండు పార్టీల్లో కలకలం రేపాయి.దీనిపై ఎవరెలా స్పందిస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొన్నది.