ఎన్నికల్లో మిత్రపక్షంగా కలిసి పనిచేసిన సందర్భంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ విషయంలో తెలంగాణ జన సమితి సర్కార్పై ఒత్తిడి పెంచుతోంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్.. పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్కు ఇప్పటికే విన్నించినట్టు తెలిసింది. త్వరలో ఆయన సీఎంతో ప్రత్యేకంగా ఈ విషయంలో భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది.
సర్కార్ ఏర్పడి సగం టర్ము పూర్తయినా తెలంగాణ జన సమితి ముఖ్య నేతలకు ఎలాంటి పదవులు ఇవ్వకపోవడం తీవ్ర అసంతృప్తి ఉంది. చాలా సందర్బాల్లో దీనిపై పార్టీలో అంతర్గతంగా పోరు నడుస్తోంది. అధ్యక్షుడు కోదండరాంపై నేతలు కూడా ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. మిత్రపక్షంగా ఉండి.. కాంగ్రెస్ గెలుపులో క్రియాశీలకంగా పనిచేసిన పార్టీని పక్కకు పెట్టేశారని, ఇచ్చిన హామీలు మరిచారనే పెదవివిరుపు చాలా రోజులుగా ఉంది.
కాంగ్రెస్ తమ పార్టీ నేతలకే పదవులు ఇచ్చే విషయంలో తర్జన భర్జన పడుతూ వస్తోంది. ఇది వారికి తలనొప్పిగా కూడా మారింది. కాగా ఇటువైపు నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో పాటు.. కోదండరాం సైతం తన వైపు నుంచి ఒత్తిడి పెంచుతూ రావడంతో .. తాజాగా ఇచ్చే నామినేటెడ్ పదవుల్లో పలువురికి అవకాశం ఇచ్చే విషయంలో అధిష్టానం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
నామినేటెడ్ పదవుల కోసం తన పార్టీలోని ఆశావహుల జాబితాను సీఎం రేవంత్ రెడ్డికి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లకు ఇప్పటికే అందజేశారు. వీరికి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ల కోసం పట్టుబడుతున్నారు. ధర్మార్జున్, అంబటి శ్రీనివాస్, సలీమ్ పాషా, బైరి రమేష్, ఆశప్ప, నిజ్జన రమేష్ ముదిరాజ్, మాసంపల్లి అరుణ్ కుమార్.. ఈ పేర్లతో కూడిన జాబితాను కోదండరాం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇంకా సగం టర్మే మిగిలి ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడు కూడా పదవులు లేకపోతే.. ఇంకెప్పుడు అనే విధంగా.. ఒత్తిడి తీవ్రం కావడంతో ఇక ఈసారి విడుదల చేసే లిస్టులో కచ్చితంగా టీజేఎస్ నేతల పేర్లు ఉంటాయనే ధీమా వారిలో కనిపిస్తున్నది.ఈ విషయంలో మరోమారు సీఎం రేవంత్తో కోదండరాం కలిసి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.