గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడమని దీన్నే అంటారు. నీట్ పేపర్ లీకు అయినప్పుడు .. జెన్-జీ నుంచి వస్తున్న నిరసన సెగ ఆదిలోనే అర్థం చేసుకోవాల్సింది. కానీ ఇక్కడ కేంద్రం మాత్రం అర్థమయినా కూడా కానట్టుగా నటించింది. నిద్రపోయేవాడని లేపొచ్చు గానీ, నటించే వాడిని కాదు..అన్నట్టుగా.. ఇక్కడ కేంద్రం తీరు ఇలాగే ఉంది.
అయితే కేంద్రానికి ఒకటే డౌటు మొదటి నుంచి. జెన్-జీ , కాక్రోచ్ పార్టీ నేతలు చెప్పగానే మనం వినాలా? విని ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలా? చేస్తే ఈ క్రెడిట్ ఎవరికి పోతుంది…? అంతిమంగా ఇది ఇండి కూటమి విజయంగా మారుతుంది..! ఇదీ కేంద్రం మదిలో మొదటి నుంచి నానుతూ వస్తున్న ఆలోచన.
అందుకే దీన్ని పెద్ద కేర్ లేనట్టుగా, లైట్ తీసుకున్నట్టుగా ఉంది. కానీ ఇది ఇంత తీవ్రంగా మారుతుందని ఊహించలేదు. ఈ బొద్దింకలేమి చేస్తాయిలే.. అనుకున్నారు. కానీ బలవంతమైన సర్పము చలి చీమల చేతజిక్కి చావదే సుమతీ! అన్నట్టుగా … బలవంతమైన సర్పము బొద్దింకల చేతజిక్కి.. గా మారింది. పోలీసుల ఓవరాక్షన్, కేంద్రం సపోర్టుతో ఢిల్లీ వీధులు రణరంగంగా మారాయి.
లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగాలు.. విద్యార్థులపై యుద్దాన్ని ప్రకటించినట్టుగానే చేసింది కేంద్రం. దీన్ని చూసి దేశం నివ్వెరపోయింది. మొన్నటిదాకా ఈ ఉద్యమాలకు తన సపోర్టు చేస్తూ వచ్చాడు రాహుల్. మధ్య మధ్యలో కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో తన వంతుగా ఒత్తిడి పెంచుతూ ఉన్నాడు. కానీ ఈ లాఠీచార్జి, దమనకాండ తరువాత రాహుల్ డైరెక్టుగా ఎంట్రీ కావడంతో అక్కడ సీన్ మారింది.
ఇదింకా వేడెక్కింది. ప్రధాని ఇంటి ముట్టడికి యత్నం, ప్రధాన్తో పాటు.. అమిత్ షా కూడా రాజీనామా చేయాలనే ఒత్తిడి పెరగడంతో రాజకీయంగా కేంద్రం తీవ్రంగా ఇబ్బంది పడింది. ఓ మంత్రిని బచాయించే క్రమంలో,ఇది ఎక్కడ ఇండి కూటమికి మేలు చేసి పెడుతుందోనే భయపడి ఇంత దాకా తెచ్చుకున్న కేంద్రానికి.. భయపడినట్టే అయ్యింది చివరకు.
రాహుల్ ఎంట్రీతో వార్ వన్సైడ్ అయ్యింది. దీన్ని అందిపుచ్చుకున్న రాహుల్ అక్కడ పరిస్థితిని మొత్తం తన చేతుల్లోకి తీసుకున్నాడు. మీడియా సమావేశం పెట్టి పేపర్ లీకుల వ్యవహారంపై మరింత బండారం బయటపెట్టాడు. పదేండ్ల పేపర్ లీకుల వ్యవహారంలో కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని మరోసారి దేశానికి గుర్తు చేశాడు.
ఇప్పుడు ధర్మేంద్రను తప్పించినా.. తప్పించకపోయినా.. ఉదాసీనంగా ఉన్నా.. బీజేపీకి నష్టమే. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో! చెప్పంగ వినకపోతే చెడంగ చూడాలంటారు.. అదే జరుగుతోంది కేంద్ర ప్రభుత్వ వైఖరి విషయంలో.