Pawan Sabha: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ హైదరాబాద్ వేదికగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ సభ నిర్వహించబోతున్నారు. ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం తర్వాత పవన్.. తెలంగాణ గడ్డపై అడుగుపెడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సభపై జనసైనికుల్లో ఎంత జోష్ ఉందో… ప్రతిపక్ష బీఆర్ఎస్ లో అంతకంటే అలెర్ట్ నెస్ కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
జనసేన సభలో పవన్ కళ్యాణ్ నోట వచ్చే ప్రతి మాటను స్కాన్ చేసి దాన్ని తమకు అనుకూలంగా ‘తెలంగాణ సెంటిమెంట్’గా మార్చుకోవాలని గులాబీ దళం వ్యూహాలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను సమర్థవంతంగా వినియోగించుకొని రాష్ట్ర రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్.. గత కొద్దిరోజులుగా ఈ విషయంలో కాస్త ఢీలా పడిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీనికి తోడు ఇటీవల పార్టీ పెట్టిన కవిత.. తెలంగాణ సెంటిమెంట్ ను రగిలిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. దీంతో తనకు బాగా కలిసివచ్చిన తెలంగాణ సెంటిమెంట్ కు.. పవన్ సభ ద్వారా గట్టి బూస్టప్ ఇవ్వాలని గులాబీ బాస్ యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలోనే చంద్రబాబు విషయంలో తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి సక్సెస్ అయిన విధంగా.. ఈసారి పవన్ సభ ద్వారా దానిని రిపీట్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో ‘సెంటిమెంట్’ ఎంతటి బలమైన ఆయుధమో కేసీఆర్కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ అనేకసార్లు రాజకీయంగా మైలేజ్ సాధించింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు ‘మహాకూటమి’గా బరిలోకి దిగారు. అప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పక్కకు నెట్టేసి.. ‘మళ్లీ ఏపీ పాలకుల చేతుల్లోకి తెలంగాణను పెడతారా? ఆంధ్రా నేత చంద్రబాబు మనల్ని శాసిస్తారా?’ అంటూ కేసీఆర్ సెంటిమెంట్ను రగిల్చారు. ఆ ఒక్క దెబ్బతో తెలంగాణ సమాజం ఆలోచన మారి బీఆర్ఎస్కు ఏకపక్షంగా భారీ విజయాన్ని కట్టబెట్టింది. దీంతో అప్పటివరకూ తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన చంద్రబాబు.. ఆ తర్వాత నుంచి సైలెంట్ అయిపోయారు. ఏపీ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడంతో.. ఒక్కప్పటిలా బీఆర్ఎస్ కు రాజకీయ అస్త్రాలు కరవు ఏర్పడింది.
ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ కష్టకాలంలో ఉంది. అధికారం కోల్పోవడం, ఉపఎన్నికల్లో వరుస పరాజయాలు వంటి పరిస్థితుల్లో పార్టీని మళ్లీ రేసులోకి తేవడానికి ఒక బలమైన ‘పొలిటికల్ ఇష్యూ’ లేదా ‘సెంటిమెంట్’ అవసరం ఆ పార్టీకి ఏర్పడింది. దీంతో పవన్ కళ్యాణ్ సభ రూపంలో సదావకాశం దొరికినట్లు గులాబీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం పవన్ ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. జనసేన సభలో పవన్ కళ్యాణ్ తెలంగాణ అభివృద్ధి గురించో, ఇక్కడి పాలన గురించో లేదా గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురించో ఏ చిన్న వ్యాఖ్య చేసినా.. దాన్ని గట్టిగా అందిపుచ్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఏపీ డిప్యూటీ సీఎం ఇక్కడికి వచ్చి మనల్ని విమర్శిస్తారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని తక్కువ చేస్తారా?’ అనే కోణంలో సోషల్ మీడియా, మీడియా వేదికగా దాడి చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: డీఎస్సీపై వైసీపీ విమర్శలు.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్, చామవరంలో ‘పేదల సేవలో’ కార్యక్రమం
ఇటీవల కోనసీమ దిష్టి అంశం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివాదం, చెరువు భూమి కబ్జా ఆరోపణలతో గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో పవన్ తెలంగాణ గడ్డపై అడుగుపెట్టి భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండటం.. ఆయనకు పెద్ద సవాలే అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ గడ్డపై జనసేన క్యాడర్ను ఉత్సాహపరుస్తూనే.. ఏపీ-తెలంగాణ ప్రాంతీయ విభేదాలు రాకుండా ఏపీ అధికార ప్రతినిధిగా హుందాగా మాట్లాడాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. బీఆర్ఎస్, టీఆర్ఎస్ (కవిత పార్టీ) వేసే ‘సెంటిమెంట్ ట్రాప్’ లో పడకుండా తెలంగాణ సంస్కృతిని, ఇక్కడి అమరవీరులను గౌరవిస్తూనే.. తన పార్టీ భవిష్యత్తు ప్రణాళికులకు ఈ సభను గట్టి పునాదిగా మార్చుకోవాల్సిన అవసరం పవన్ కు ఉంది. మెుత్తంగా రేపు తెలంగాణ గడ్డపై ‘జనసేనాని’ ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు? దానికి ‘గులాబీ దళం’ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతోంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Also Read: అమెరికాలోకి 3.2 కోట్ల దోమలను వదిలిపెట్టనున్న గూగుల్.. ఇదెక్కడి ప్లాన్ మామ?