ఐదు వేల పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల నోటిఫికేషన్.. పెద్ద దుమారాన్నే రేపనుంది. ఇప్పటి దాకా ఏ సమస్యలపై సర్కార్ మాట్లాడినా సైలెంట్గానే ఉన్నారు జనం. ఆర్థిక స్తోమత లేదన్నా సర్దుకున్నారు. హామీలు అమలు చేయకున్నా ఓపిక పట్టారు. ఉన్న హామీలు అటకెక్కించినా.. పళ్ల బిగువునే ఆ కోపాన్ని అణుచుకున్నారు. రెండున్నరేండ్లయ్యింది. ఇంకా ముచ్చట్లు చెబితే ఎలా? అనే దోరణి పెరిగిపోతున్న సందర్బంలో.. నోటిఫికేషన్ల అంశం కీలకంగా మారింది.
రైతుల్లో ఎంతలా వ్యతిరేకత పెరుగుతూ వస్తోందో.. నిరుద్యోగుల్లో కూడా అంతకు మించి వ్యతిరేకత పెరుగుతున్నది సర్కార్పై. ఇది కప్పి పెట్టినా దాగని సత్యం. ఫీల్డు లెవల్లో తిరిగిన వారికి దీని గురించి బాగా తెలుస్తుంది. ఇప్పుడు చెప్పుకునే అంశం ఏంటంటే.. పోలీస్ కానిస్టేబళ్లు, ఎస్సై ఉద్యోగాలు మొత్తం కలిపి ఓ ఐదు వేలు మాత్రమే.. నోటిఫికేషన్ వేసేందుకు సన్నద్దమైంది సర్కార్. ఇక్కడ మొదలైంది రగడ.
నిరుద్యోగులు ధర్నాకు దిగారు. దాదాపుగా 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ సర్కార్ వేస్తోంది అందులో ముప్పావు. ఇన్నేండ్లు ఆపి.. నిన్ను తెచ్చుకుని నెత్తిన పెట్టుకున్నది ఇందుకేనా..? అని నిరుద్యోగులు నిలదీసేందుకు ఇది వేదికైంది. దీని కోసమే ప్రతిపక్షం ఎదురు చూస్తోంది. ఓవైపు బీఆరెస్, టీఆరెస్.. రెండూ ఈ నోటిఫికేషన్పై పెదవి విరిచాయి. నిరసన తెలిపాయి. 20వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
చాలా మంది ఈ పోస్టులపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఏండ్ల తరబడి కోచింగులకు డబ్బులు అప్పులు చేసి వెచ్చిస్తున్నారు. ఆ ఉద్యోగార్థుల ఆవేదన వర్ణనాతీతం. వారి కోపం కట్టలు తెంచుకున్నది. రోడ్డెక్కారు. ఇక సర్కార్కు కౌంట్డౌన్ మొదలైనట్టేనని వార్నింగ్ ఇస్తున్నారు. దీనిపై ఇంకా సర్కార్ సైలెంట్గా ఉంటే.. మెడపై వేలాడుతున్న కత్తి కసుక్కున కోసేందుకు రంగం రెడీ అవుతుంది. అంతలా వ్యతిరేకత ఉంది సర్కార్పై నిరుద్యోగులకు.
ఇచ్చిన హామీలు ఏవి ఎటు పోయినా.. ఉద్యోగాల విషయంలో మాత్రం క్షమించేలా లేరు.మినహాయింపు ఇచ్చేలా లేరు. వదిలేలా కూడా లేరు. ఇది తీవ్ర రూపం దాల్చకముందే సర్కార్ మేల్కొంటే మేలు. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? అనే ప్రధానమైన ప్రశ్న.. కేసీఆర్ను తాకింది. పదేండ్లు పాలించి మాకేం చేశావనే నిలదీతలు వీళ్ల నుంచే ఎక్కువ మొదలయ్యాయి. పదేండ్లు పాలిస్తే మాకేందీ? మాకేం చేశావు..? ఉద్యోగాల కోసమే కదా మేము అన్ని త్యాగాలు చేసింది. ఉద్యమాల్లో పాల్గొన్నది. ఇప్పుడు ఇవే ప్రశ్నలు రేవంత్ సర్కార్ను తాకనున్నాయి. మామూలుగా కాదు. ప్రతిపక్షాలు తోడు రాగా.. ఆందోళనలకు ఆజ్యం తోడు కానుంది.