Priti Reddy: స్వేచ్ఛ బ్యూరో: కాషాయ పార్టీలో చేరాలని ఆసక్తిగా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డికి బీజేపీ నుంచి తన భవిష్యత్ పై ఎలాంటి హామీ దక్కలేదా? ఈనేపథ్యంలోనే ఆమె చేరికలో జాప్యం నెలకొందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. భవిష్యత్ ఎన్నికల గురించి ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని తేల్చిచెప్పినట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. దీంతో ఆమె చేరికపై సందిగ్ధత ఏర్పడినట్లు సమాచారం. కాగా ఎన్నికలకు సమయం ఉండటంతో ఇప్పటి నుంచే గ్రౌండ్ లో పనిచేయాలని కాషాయ పార్టీ ప్రీతిరెడ్డిక సూచించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలనే బలమైన ఆకాంక్షతో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈటల ఆ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో పార్టీ కూడా సందిగ్ధంలో పడినట్లు సమాచారం.
మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి ప్రస్తుతం ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఈటలను కాదని మరొకరికి హామీ ఇవ్వడం పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీస్తుందని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ ప్రీతిరెడ్డిని చేర్చుకుంటే సమీకరణాలు ఎలా మారుతాయనే అంశంపై బీజేపీ నాయకత్వం లోతుగా ఆలోచిస్తోంది. అందుకే ప్రీతిరెడ్డి బీజేపీ అగ్రనేతలను కలిసినప్పటికీ, భవిష్యత్తులో టికెట్ కేటాయింపుపై పార్టీ క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. ఈ ముందస్తు హామీ లభించకపోవడంతోనే ఆమె జాయినింగ్లో జాప్యం జరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పని చేయాలని, టికెట్ అంశాన్ని సరైన సమయంలో నిర్ణయిస్తామని అధిష్టానం స్పష్టం చేసినట్లు వినికిడి. ఈటల లాంటి కీలక నేత ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కొత్తవారికి అవకాశం ఇవ్వడం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఈ అంశంపై బీజేపీ తర్జనభర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది.
Also Read: రెండు కూటముల మధ్యే పోరు.. కేసీఆర్, బీజేపీ ఒక్కటే.. సీఎం రేవంత్ సంచలనం
నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) అంశం కూడా ఈ సందిగ్ధతకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. డీలిమిటేషన్ జరిగితే మల్కాజిగిరి స్థానంలో భౌగోళిక మార్పులు వచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్లు మారే ఛాన్స్ ఉండటంతో, ఇప్పుడే ఎవరికీ హామీ ఇచ్చి ఇరుక్కుపోవద్దని బీజేపీ యోచిస్తోంది. ఈ కారణాల దృష్ట్యా ఇప్పుడే ఎవరికీ ఎలాంటి హామీలు ఇవ్వలేమని బీజేపీ స్పష్టం చేస్తోంది. స్పష్టమైన హామీ లభించకపోవడంతో ప్రీతిరెడ్డి చేరికలో జాప్యం నెలకొంది. అయితే.. ఆమె ఎప్పుడైనా సరే చివరకు చేరేది కాషాయ పార్టీలోనే అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. హిందుత్వ భావజాలంతో ఉన్న ఆమె ఎప్పటినుంచో ధార్మిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. బీజేపీ నేతలు చేపట్టే పలు కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వస్తున్నారు. ఈనేపథ్యంలోనే అన్నీ సెట్ అయ్యాక పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని పార్టీ సైతం భావిస్తున్నట్లు టాక్. మొత్తానికి ఈ జాయినింగ్ ఇష్యూకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.
Also Read: లోక్సభలో బీఆర్ఎస్ లేని లోటు కనిపిస్తోంది: కేసీఆర్