ఉచిత పథకాలపై కోర్టు మొట్టికాయలు వేసినా .. పరిస్థితులు మారేలా లేవు. పథకాలు పక్కదారి పట్టినా.. ఓట్ల వేటలో వీటిని చూసీ చూడనట్టుగా పోవడమే పాలకులు చేస్తూ వస్తున్న తంతు. పథకాలు మంచివే. ఉద్దేశ్యమూ మంచిదే. కానీ అది అర్హులకు దక్కినప్పుడు మాత్రమే. అనర్హులకూ దక్కితే ..? అక్కడే ప్రజాధనం వృథా అయ్యేది.
ఇప్పుడు కోర్టులు తప్పుబడుతున్నదీ దీన్నే. తెలంగాణలో మొత్తం కుటుంబాలు 1.17 కోట్లుగా ఉంటే.. రేషన్కార్డులు కూడా 1.05 కోట్లున్నాయి. అంటే ఎన్ని కుటుంబాలుంటే అన్ని రేషన్కార్డులు. మరి తెలంగాణలో పేదోడే లేడా? రేషన్ కార్డు ప్రమాణికంగానే పథకాలు అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వాలు.. అవి ప్రవేశపెట్టే ప్రతీ పథకాన్ని ఇలా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు అందిస్తున్నారన్న మాట.
ఈ లెక్కన పేదోడికి చారణా.. పెద్దోడికి బారాణా మేర అందుతున్నాయి పథకాలు. పేదలకు ఈ సంక్షేమ పథకాలు ఆసరాగా నిలుస్తాయి. కానీ అవే పథకాలు.. అనర్హులకూ చేరితే.. ప్రభుత్వంపై ఆర్థిక భారం. అప్పుల ఊబిలో రాష్ట్రం. ప్రస్తుత ముఖ చిత్రమిదే. పాలకులకు తెలుసు.. అనర్హులకూ పథకాలు వెళ్తున్నాయని, కానీ వాటిని సంస్కరించేందుకు భయపడుతున్నారు. కారణం.. ఓటు బ్యాంకు రాజకీయాలు.
అందరికీ ఇస్తే.. అందరూ ఓట్లేస్తారు. మెజారిటీగా పథకాలు అందితే అంతే మెజారిటీగా గెలవొచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. తరువాత సంగతి తరువాత. ముందు అధికారంలోకి రావాలి. ఆ తరువాత ముక్కుతూ మూలుగుతూ పథకాలు అమలు చేయొచ్చు. అప్పుల కోసం చిప్పలు పట్టుకుని తిరుగుతూ ముప్పుతిప్పలు పడొచ్చు. పనిలో పని పాత సర్కార్ పాపమే ఇదని కూడా దుమ్మెత్తి పోయొచ్చు.
ఇదే కదా ఇక్కడ నడుస్తున్నది. రైతు బంధు అందరికీ అమలు చేసి.. భారీ ఆర్థిక భారాన్ని మోపాడు కేసీఆర్. దీన్ని సవరించి.. సంస్కరిస్తానన్న రేవంత్.. పడావు భూములు తొలగించేశాడు తప్ప..దీనికి ఓ స్లాబ్ పెట్టలేదు. మూడు, ఐదు ఎకరాలకు పరిమితం చేయడం ద్వారా నిజమైన పేదలకు మాత్రమే ఈ రైతు భరోసా దక్కుతుండే. కానీ అలా చేయలేదు. ఇద్దరికీ ఈ పథకం ఓట్లు రాల్చే పథకంగా మారింది మరి.
ఇక ఒకేసారి రుణమాఫీ అని దాదాపుగా 21వేల కోట్ల భారం మోసింది రేవంత్ సర్కార్. ఇప్పుడు కోర్టు నిలిపివేసిన కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కూడా చాలా మంది అనర్హులకు దక్కుతున్నది. అసలు రేషన్ కార్డులు అందరికీ ఇచ్చేసిన తరువాత.. ఇక అర్హులెవరు? అనర్హులెవరు? ఎలా తెలిసేది…? గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరిసినట్టుగానే ఉంటుంది.
ముందు రేషన్కార్డులను తొలగించాలి. అది సాధ్యం కాదు పాలకులకు. మరి పథకాలకు అనర్హులకు చేరకుండా బ్రేకులు ఎలా వేస్తుంది. అందరూ తినండి.. మాకే ఓటేయండి.. అనేదే కదా పాలకుల నినాదం. అందుకే ఫ్రీ పథకాలు వస్తూనే ఉంటాయి. మనం తీసుకుంటూనే ఉంటాం. అప్పులు పెరుగుతూనే ఉంటాయి. పాలకులు మారుతూనే ఉంటారు. మనం ఇంకా కొత్తగా ఏ పథకాలు వస్తాయా అని ఎదురుచూస్తూనే ఉంటాం.
కోర్టులు మొట్టికాయలు వేస్తూనే ఉంటాయి. ఇది నిరంతర ప్రక్రియగా సాగుతూనే ఉంటుంది.