ఇప్పుడు వరి సాగు రైతుకు ఉరిలా మారనుంది. రానున్నది ఎల్నినో కరువు. ఈ వానాకాలం సీజన్లో రైతులు భారీగా ఆశలు పెట్టుకుని వేసుకునే సాగు వరే. అందుకే ఈ సీజన్లో విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది. కానీ సర్కార్ అప్రమత్తమైంది. ఇప్పటికే మొన్నటి రబీ సీజన్ ధాన్యం కొనుగోలు విషయంలో ముప్పుతిప్పలు పడింది. ఇంకా 25 వేల టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనడం లేదు. ఇదేం చేయాలో పాలుపోని స్థితి సర్కార్ది.
ఇక ఈ వానాకాలం సీజన్ పేరిట మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. అది అంతిమంగా రైతును ముంచేలా ఉంది. సర్కార్ను బద్నాం చేసేలా ఉంది. దీనిపై బీఆరెస్ మాత్రం చలిమంటలు కాచుకోవాలనే చూస్తున్నది. అసలు విషయం చెప్పుకుందాం సూటిగా. ఇవాళ జీవన్రెడ్డి ప్రెస్మీట్ పెట్టాడు. ఇది ఆపార్టీ విధానంగానే మనం చూడాలి. కేసీఆర్తో డిస్కషన్ చేసిన తరువాతే .. ముఖ్యమైన వ్యవసాయ సాగుపై మాట్లాడుతాడు. అందులో డౌట్ లేదు.
అందులో ఏం చెప్పాడు..? ఎల్నినో పేరు చెప్పి .. రైతులను సర్కార్ వరి వేసుకోకుండా చేస్తున్నది.. కేవలం 7 రకాల వరిసాగుకే బోనస్ ఇస్తానంటున్నది..33 రకాలు వేసుకోండని జీవన్రెడ్డి చెబుతున్నాడు. దిగుబడి అంశాన్ని ఇక్కడ సాకుగా చూపుతున్నాడు. సర్కార్ భయపడి ఎకరాకు 10 క్వింటాల్ల దిగుబడిని తగ్గించేందుకు కుట్రపూరితంగా 7 రకాల వరికి రైతును సిద్దం చేస్తోందని. సర్కార్ చెబుతున్నదేమిటీ? అసలు ఈసారి వరి పూర్తిగా తగ్గించేయండి.. తగిన వర్షపాతం లేకపోతే.. తీవ్ర నష్టం వాటిల్లుతుందని.
అయినా రైతులు వినరు కాబట్టి.. సర్కార్ బోనస్గా ఇచ్చే వరి విత్తనాల్లో ఏడు రకాలను సూచించింది. ఇది మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న రకాలుగా చెబుతోంది. దీంట్లో తప్పేం లేదు. మరి ఎందుకు అనవసరంగా రైతులను రెచ్చగొట్టడం..! ఒకవేళ రైతులు ఏ రకం పడితే ఆ రకం.. విచ్చలవిడిగా వరి వేశారనుకో.. అది మధ్యలోనే ఎండిపోతే.. బోర్ల ఆధారిత పంటలుగా సాగయ్యేవాటికి ప్రమాదం తక్కువ. కానీ వర్షాధారిత ఏరియాను మొత్తం వరితో నింపేస్తే..! కరువు పరిస్థితులు తాండవిస్తే.. ఎవరు నష్టపోయేది? రైతే.
అప్పుడు సర్కారూ రాదు. ఫామ్హౌజ్లో ఉన్న కేసీఆర్ రాడు. కానీ రైతులు తీవ్రంగా నష్టపోయారు చూశావా? కనీసం వారిని అవగాహన పర్చలేదు.. ఇదేం గవర్నమెంట్.. వారి ఉసురు మీకు తగులుతుందని మాత్రం దుమ్మెత్తిపోయడానికి రెడీగా ఉన్నది బీఆరెస్ టీం. ఇదే జరిగేలా కూడా ఉన్నది. ఎందుకంటే.. రైతులు ఇప్పుడు ఎవరు చెప్పినా వినరు. వరికే ఎక్కువ పోతారు. సర్కార్ కూడా వీరిని ప్రత్యామ్నాయ పంటల వైపు తీసుకెళ్లే విషయంలో విఫలమైంది.
దీనిపై ముందే ప్రణాళిక ఉండాలి. కచ్చితమైన విధానం.. విత్తనాలు… నేలను బట్టి గిట్టుబాటు సాగు.. దీన్ని ఎవరు వివరించాలి? ఆ యంత్రాంగమే సర్కార్ వద్ద లేదు. సీఎం బహిరంగ సభలో మాత్రం.. పండ్లు, కూరగాయలు పండించండి.. అని ఏదో గాలివాటం మాటలు చెప్పారు. ఇది కాదు ప్రణాళిక. మొత్తానికి రైతు కొంప ముంచేందుకు అందరూ తయారయ్యారని మాత్రం అర్థమవుతోంది. అప్పుడు కేసీఆర్ వరి వద్దు.. అన్నందుకే.. రేవంతు నానాయాగీ చేసి.. నీ ఫామ్హౌజ్లో ఎందుకు పండించావని, ఫోటోలు బయటపెట్టి.. రాజకీయం కోసం వాడుకున్నారు. ఇప్పుడు అదును కోసం ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నది బీఆరెస్.
వీరి రాజకీయాలకు మధ్యలో బలయ్యేది మాత్రం రైతే. అదే రిపీటవుతూ వస్తోంది. ఎవరున్నా!