ఏదో పాత సినిమాలో.. నూతన్ ప్రసాద్కు ఓ ఊతపదం లాంటి డైలాగుంటుంది. పోలీసాఫీసర్ పాత్రలో ఉన్న ఆ నూతన్ ప్రసాద్ మాటి మాటికి చెప్పే డైలాగ్.. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది…అని. ఇది బాగా ఫేమస్ అయ్యింది. ఆ డైలాగ్ ఆ పాత్రలోని కామెడీని వెలికి తీసి కడుపుబ్బా నవ్విపించేదిగా ఉంటుంది. అందుకే అదంత ఫేమస్ అయ్యింది. ఇప్పుడు మోడీ ఇలా హైదరాబాద్కు వచ్చి ఏవో రెండు పొదుపు సూత్రాలు చెప్పి.. ఖర్చులు తగ్గించుకోండని సూచనలు ఇవ్వగానే.. మనవాళ్లు.. పోలోమని.. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందనే డైలాగును అందుకున్నారు.
మోడీ చెప్పాడంటే.. దాన్ని వందకు వెయ్యి రెట్లు అమలు చేసి చూపాలనే అత్యుత్సాహమే కనిపిస్తుంది అందరిలో. పొదుపుగా ఉండమని చెప్పాడు.. దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. కానీ ఇదిగో చూశారా… నేను ఇన్ని కార్లు తగ్గించేశాను… బైక్పై అసెంబ్లీకి పోతున్నా! చూశారా! దేశం కోసం.. మోడీ కోసం..! వర్క ఫ్రమ్ హోం.. వారానికొక నో వెహికిల్ డే.. ! చూశారా మోడీ సాబ్ … ఎట్ల ఫాలో అవుతున్నాం.. అని పోటీలు పడి మరీ చెప్పుకున్నట్టుగా.. ప్రచారం చేసుకోవడం.. చాలా వెగటుగా అనిపించే వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఇది స్వామి భక్తా? దేశభక్తా? అని తరచి చూసుకుంటే.. కచ్చితంగా ఇందులో స్వామిభక్తే కనిపిస్తుంది.
వర్క్ ఫ్రం హోం ఎందుకు..? ఉన్న ఉద్యోగాలు ఊడబీకితే.. అదింకా పొదుపు కాదా? అని ఆలోచన వస్తే! ఇది ఎవరి కొంపలు ముంచుతుంది మోడీసాబ్? కార్లు తగ్గించుకుంటున్నారు బాగానే ఉంది. ఆ డ్రైవర్లు.. వారికి ఏదైనా పని కల్పిస్తారా? ఇంటికి సాగనంపుతారా? అసలు ఇది మోడీ నజర్లో పడేందుకు కొన్ని రోజుల పాటు సాగే డ్రామా తంతా? ఈ చర్చంతా జరుగుతుంది ఇప్పుడు.
ఒక్కటి మాత్రం పక్కా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే..! దేశం మొత్తం మోడీ జపం చేస్తుందని. అదిప్పట్నుంచి కాదు.. కరోనా సమయం నుంచే. జనాల చెవిలో పూలు పెట్టే విధంగా కరోనా సమయంలో మోడీ ఏది చెబితే అది చేశారు.. అదిప్పుడు ఆలోచిస్తే ఆ సంఘటనలు నవ్వు తెప్పిస్తాయి. ఆయన మాటలను గుడ్డిగా ఫాలో అయిన మన మూర్ఖత్వానికి సిగ్గుపడతాం కూడా. పెద్ద నోట్ల రద్దు చేస్తే.. దీని వెనుక పేదల జీవితాలను బాగు పరిచే బృహత్తర ప్రణాళిక ఏదో ఉంటుందనుకుంటాం. జీఎస్టీ అన్నా.. పెట్రోల్ ధరలు పెంచినా.. మోడీ ఏం చేసినా ఓ రీజన్ ఉంటుంది. అది దేశం కోసం ధర్మం కోసమే అయి ఉంటుంది .. అని మనకు మనం సర్దిచెప్పుకునే దుస్థితికి చేరుకున్నాం.
ఇప్పుడు కూడా అంతే. బంగారం కొనొద్దన్నాడు. ఎందుకు? రేట్లు అమాంతం ఢమాల్మని పడిపోతాయా ఏందీ? అయితే ఉన్న బంగారం రేటు ఉన్నప్పుడే అమ్ముకుంటే.. అనే ఆలోచనకు కూడా బీజం వేశాడు మోడీ! పొదుపు చర్యలో భాగంగా తిండిని కూడా తగ్గించండి అని మాత్రం చెప్పలేదింకా నయం..! యుద్ధ ప్రభావమో.. ఇంకేదో.. మొత్తానికి ఆర్థిక మాంద్యం రాబోతుందని హెచ్చరిక చేశాడు మోడీ. ఇలా బహిరంగ వేదికల మీద ప్రధాని నోటి వెంట జనాన్ని భయపెట్టేలా ఎందుకీ కామెంట్లు! కూలీనాలీ చేసుకునేవారు, పట్ణణాలకు వలసొచ్చిన వారికి కూడా ఏదో అనుమానం వచ్చేలా ఆయన మాట్లాడిన తీరు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు నేతల అతి.. ఆజ్యం పోసినట్టుగానే ఉంది.
మోడీ మాటలను మేము ముందు ఫాలో అయ్యామంటే మేం ముందు ఫాలో అయ్యాం.. అని పోటీలు పడి.. మోడీ నజర్లో పడి.. ఆయన మెచ్చుకోలు కోసం వెంపర్లాడి… అధికారపీఠం కోసం ఆశీస్సులు పొందేందుకు ఆరాటపడి.. జనం ఏమనుకుంటున్నారోననే ధ్యాసే మరిచారు. ఇక రేపట్నుంచి వీరు కూడ వేదికలెక్కి.. పొదుపు మంత్రాలు వల్లెవేస్తారు కావొచ్చు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. అనేది ప్రసంగానికి ముందు ఇకపై తప్పనిసరి అవుతుందేమో!