ప్రధాని మోడీని మాంత్రికుడితో పోల్చారు రాహుల్ గాంధీ. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్, డీ లిమిటేషన్ బిల్లులపై రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన చిన్ననాటి అనుభవాలను సభ ముందుంచుతూ.. వాటికీ, ప్రస్తుతం మోడీ విధానాలు, అనుసరిస్తున్న పద్దతులకు లింకు పెట్టి మాట్లాడటం వివాదమైంది. సభలో గందరగోళమేర్పడింది. మోడీని జాదూగర్ (మాంత్రికుడు)గా అభివర్ణించారు రాహుల్. తను ఏం చేసినా నవ్వుతారని, కానీ ఆ మాంత్రికుడి మాయాజాలానికి ఇక కాలం చెల్లిందన్నారు. కనికట్టు విద్యలు ఎంతో కాలం చేయలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అప్పుడా మాంత్రికుడికి ఆరోగ్యం బాగలేక.. మాయాజాలం చేయలేక అవస్థలు పడ్డాడని, అయినా పిల్లలు నవ్వుకున్నారని, ఇప్పుడు మోడీ టైమ్ కూడా అయిపోయిందని, బిల్లులు పాస్ అయ్యే అవకాశం లేదని తెలిసినా.. ఎందుకు ఇదంతా చేస్తున్నారని వారికి తెలుసునన్నారు. ఏదో రకమైన మాయాజాలం, కనికట్టును ప్రదర్శించి తన ప్రాబల్యం చాటుకునే ప్రయత్న చేస్తూ వస్తున్నారని విమర్శించారు రాహుల్. పుల్వామా దాడి నేపథ్యంలో జరిగిన ఆపరేషన్ను, పెద్ద నోట్ల రద్దు, సింధూర్ ఆపరేషన్.. తదితర సంఘటనలన్నీ తన పార్టీకి మేలు చేసేలా కనికట్టు మాటలతో లబ్ది పొందాలని చూశారనే కోణంలో రాహుల్ మాట్లాడిన తీరుపై అక్కడి బీజేపీ సభ్యులు మండిపడ్డారు.
క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రికార్డుల నుంచి ఆ మాటలను తొలగించాలని కోరారు. స్పీకర్ ఓం బిర్లా సైతం రాహుల్ మాట్లాడిన తీరును తీవ్రంగా ఆక్షేపించారు. జాదూగర్ అని మోడీనుద్దేశించి మాట్లాడిన ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. మహిళా బిల్లు ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీవ్ర అన్యాయం చేసేందుకు కేంద్రం డిసైడ్ అయ్యిందని, అంతా హిందువులే తనకు అవసరమున్నప్పుడు మాట్లాడే మోడీ.. ఇలాంటి రాజకీయంగా బలపడే చాన్సు వచ్చినప్పుడు బీసీలు, ఎస్సీ, ఎస్టీ మహిళలు కనిపించరా..? హిందువుల పేరుతో వారినే మోసం చేయడం మోడీకే చెల్లిందని విమర్శించారు.
డీ లిమిటేషన్ బిల్లు ద్వారా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు రాహుల్. రాహుల్ మాట్లాడింది కొద్ది సేపే అయినా.. మోడీని, మోడీ పాలనను ఆయన పరోక్షంగా తీవ్రస్థాయిలో విమర్శించడం సభలో గందరగోళానికి దారి తీసింది. జాదూగర్ అనే మాటను వద్దు వద్దని వారించినా.. రాహుల్ వినలేదు. పదుల సార్లు మోడీనుద్దేశించి జాదూగర్ అని ఆయన సంబోధించారు.
గురువారం ప్రియాంక చేసిన ప్రసంగం అద్భుతంగా ఉందని, తనకెంతో గర్వంగా అనిపించిందన్న రాహుల్.. చిన్నతనంలో నానమ్మ ఇందిరాగాంధీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. మోడీ మాటల్లో పస లేదని, పిరికితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని, బిల్లుల ఆమోదం విషయంలో ఆయన వైఖరి చూస్తూనే తెలిసిపోయిందని, ఇదంతా ఓ కుట్ర .. ఇది చెల్లుబాటు కాదని వారికి వారే తెలియజేసినట్టయ్యిందని విమర్శించారు రాహుల్.