ఎర్రజెండ ఎర్రజెండెన్నియలో ఎర్రెర్రనిదీ జెండెనియలో.. అన్నలు అన్నాలెన్నియలో.. మరి వెన్నలకోనాలెన్నీయలో..! చీమలదండు సినిమాలో పాట. ఈ పాట అప్పట్లో ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఈ అన్నల గోలేందీ? అది ఒడిసిపోయిన ముచ్చటని అనుకుంటున్నారా? నిజమే. అన్నల కథ ఒడిసిన ముచ్చటనే. అడవిలో అన్నలు లేరు. ఉన్నోళ్లు ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఇంకా మిగిలి ఉన్నోళ్లు వనం నుంచి జనంలోకి వచ్చేశారు. అక్కడ బతకడం ఇక కష్టమేనని తేలిపోయింది. సిద్దాంతాలు మాత్రం చావలేదు. పరిస్థితులే మారాయి. ఆ పరిస్థితులకు తగ్గట్టు వాళ్ల వ్యూహాలు మార్చుకుంటున్నారు.
రాజకీయ పంథాలో రాజ్యంగబద్దంగా పోరాటాలే శరణ్యమని కూడా అనుకుంటున్నారు. అడివిలో అన్నలు తుడిచిపెట్టుకపోయినా.. ఆ ప్రస్తావన ఇంకా బతికే ఉంది. దాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్రెడ్డి కూడా అడవిలో అన్నల గురించి ప్రస్తావించాడు. అన్నలుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది.. ఇలాంటి నేతలను, అధికారులను చూసినప్పుడు అనే విధంగా అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. తాజాగా టీఆరెస్ చీఫ్ కవిత కూడా ఇవాళ అడవిలో అన్నల గురించి ప్రస్తావించారు. బాయిబాట ప్రోగ్రాంలో ఉన్న ఆమె అక్కడి సింగరేణి మేనేజ్మెంట్ను ఉద్దేశించి ఈ మాటన్నారు.
అడవిలో అన్నలున్నప్పుడు మేనేజ్మెంట్ భయపడి కార్మికులను బాగా చూసుకునేవారని, ఇప్పుడు వారు లేరని, కార్మికులను వేధిస్తున్నారని అన్నారామె. అంతే కాదు.. అడవిలో అన్నలంతా మా పార్టీలోనే చేరారు.. అని కూడా అన్నారు. కవిత మాటలు చర్చనీయాంశమయ్యాయి. మా పార్టీలో అన్నలున్నారని చెప్పడం వెనుక.. ఉద్దేశ్యం అన్యాయాలు ఎక్కడ జరిగినా ఎదురించేందుకు మా పార్టీ సిద్దంగా ఉందని చెప్పడం అయి ఉంటుంది. అన్ని పార్టీల మాదిరిగా కాకుండా.. తమ టీఆరెస్ పార్టీలో అన్నల సిద్దాంతాలను కూడా అమలు పరుస్తున్నామనే సంకేతమూ కావొచ్చు.
తుపాకీ పట్టుకుని అహింసకు దిగడం ఒక్కటి మినహాయించి.. నక్సల్స్ సిద్దాంతాలన్నీ మేము పాటిస్తున్నామని చెప్పడం అయి వుంటుంది. ఇప్పటికే ఆమె.. అందరిలా కాకుండా తమ పార్టీ అధికారంలోకి వస్తే అమ్మలా ఆత్మీయతతో కూడిన పాలన అందిస్తామని కూడా చెప్పి ఉన్నారు. నక్సల్స్ ప్రస్తావన రావడం వెనుక.. విచ్చలవిడిగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ఇలాంటివి ఎక్కడ జరిగినా.. అప్పుడు అడవిలో అన్నలు స్పందించినట్టే స్పందిస్తామని వార్నింగ్ ఇవ్వడం.. ఆ అన్నలంతా మా పార్టీలోనే ఉన్నారని .. తీరు మార్చకుని జర జాగ్రత్తగా ఉండాలని ఆమె ఈ విధంగా వార్నింగ్ ఇచ్చారన్న మాట!
జెన్-జీ యాక్టివ్ రాజకీయల్లోకి వస్తున్న సందర్బంగా .. అడవిలో అన్నలు అప్పుడు గజ్జున భయపెట్టించినట్టే.. ఇప్పుడు కేంద్రం మెడలు వంచేందుకు కాక్రోచులుగా చేరి నేటి రాజకీయాలపై దండయాత్ర చేస్తున్న అంశం కూడా ఇప్పుడు మారిన పరిస్థితులకు అద్దం పడుతోంది.ఇది అన్నల కాలం కాదు.. ఆధునిక కాలం. కానీ అడవిలో అన్నల్లా కాకుండా అర్బన్లో అన్నల మాదిరిగా రాజకీయ వేదికల మీద రాజ్యాంగ బద్దంగా ఎన్కౌంటర్ చేసేందుకు రెడీ ఉన్నారు.