తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ ఇవాళ తమ పదేళ్ల పాలన గురించి చెప్పే క్రమంలో అతిశయోక్తి రంగరించారు. అప్పట్లో చంద్రబాబుపై ఓ విమర్శ ఉండేది. తెలంగాణ ప్రజలకు అన్నం తినడం మేమే నేర్పినం.. తెల్లారు జామున లేవడమూ మేమే నేర్పినం.. అని బాబు అన్నాడని దీనిపై ఇప్పటికీ ఆయన్ను విమర్శిస్తుంటారు తెలంగాణ జనం. ఇప్పుడు కేటీఆర్ కూడా దాదాపుగా ఇదే అన్నాడు. ఏమని? తెలంగాణ రాక ముందు ఇక్కడి ప్రజలు అన్నమో రామచంద్రా అనే వారంట.. కేసీఆర్ తెలంగాణ తెచ్చి అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దినాడట. ఇది మరీ ఓవర్గా లేదు. తినడానికి అసలు అన్నమే లేదట ఇక్కడి ప్రజలకు అప్పటి వరకు.
ఇక మేము ఓడిపోయేటోళ్లమే కాదు.. దాదాపుగా మూడోసారి కూడా మాదే గెలుపు కానీ.. 1.8 శాతం ఓట్లతో ఓడిపోయాం.. కారణం ప్రజల మైండ్లలో అబద్దపు ప్రచారాలతో కాంగ్రెస్ ఊదరగొట్టడమేనట. కేవలం 4 లక్షల ఓట్లు మాత్రమే తమకు తక్కువ పడ్డాయట. అమాయకపు ప్రజలు వాళ్ల మాటలు విని.. కాంగ్రెస్ దరిద్రాన్ని నెత్తినపెట్టుకున్నారట. ఓడిపోతే కుంగిపోయేది లేదు.. గెలిస్తే పొంగిపోయేది లేదు.. అని కేటీఆర్ అన్నాడు చివరగా. ఇవన్నీ విన్నతరువాత అందరికీ అనిపించే ఇంకో ముచ్చటేందంటే.. వీరు పరివర్తన చెందేదీ కూడా ఇక లేదని. అవును.. తమ లోపాలను ఏనాడూ వారు గుర్తించలేదు కదా.. అబద్దపు ప్రచారాలుంటున్నారు.
హామీలకు ప్రజలు ఆశ పడ్డారనే .. అయితే కాంగ్రెస్ను, లేదా ప్రజలను దోషులుగా చేసే ప్రయత్నమే తప్ప.. తమ లోపమే లేదని చెబుతున్నాడు కేటీఆర్. తమ నిర్లిప్తత కూడా కొంచెం కారణమన్నాడు. ఆ నిర్లిప్తత ఏందో మరి..! ఇప్పట్లా అప్పుడు యూట్యూబ్లు పెట్టుకునే ఉండేదేమో. ఇప్పటిలా అప్పుడు కూడా నిత్యం సోషల్ మీడియాలో జీవించి ఉండి.. ప్రజాక్షేత్రం వదలి.. సోషల్ రాజకీయం చేసేదుండెనేమో..! గెలిస్తే గెలుస్తాం.. లేకపోతే లేదు.. అధికారం కోసం కాదు.. ఈ కాంగ్రెస్ను పారదోలేందుకు మనమంతా శపథం తిందామని కూడా అన్నాడు కేటీఆర్. అంటే తమకు ఆధిక్యత రాకున్నా.. చివరకు బీజేపీని పట్టుకోనైనా సరే.. కాంగ్రెస్ సర్కర్ను గద్దె దించి అధికారంలోకి వద్దామనే ఆలోచన కావొచ్చు.
కేసీఆర్ను బద్నాం చేస్తున్నారని, ఆనవాళ్లు తుడిపేస్తున్నారని, ఫామ్హౌజ్ లీడర్గా ప్రజల మెదళ్లలో విషం నింపారనే విధంగా చేశారని కేటీఆర్ అన్నాడు. అంటే… జనానికి ఆమాత్రం చైతన్యం లేదా? సోయి లేదా? చెప్పుడు మాటలు వినే అజ్ఞానులు ఇక్కడ ఓటర్లా? మరి రెండు సార్లు మీకు అధికారం ఇచ్చారు కదా.. అప్పుడు చైతన్యవంతులుగా ఉండి ఉన్నారా? లేక మీరు చెప్పే మాటలు విని వేశారా? మిమ్మల్ని గుడ్డిగా నమ్మారా? మరైతే ఇప్పుడు ఎందుకు గుడ్డిగా నమ్మడం లేదు..! కేటీఆర్ ఇకపై గెలుపు ఓటములు, పోయిన అధికారం గురించి మదనపడటం మానకపోతే .. పరివర్తన రాలేదు.. అహంకారం వీడలేదనే జనం అనుకుంటారు. అందులో డౌట్ లేదు.
సర్కార్ ఏం చేయడం లేదు..? ఎందుకు చేయడం లేదు? జనం పడుతున్న బాధలు చెప్పి.. పోరాటలకు సిద్దమైతే సరి! అంతకు మించి మీరు పెద్దగా చేయాల్సిందేమీ లేదు. నోరు విప్పితే మీ అజ్ఞానం, అహంకారం ఇలా పొంగిపొర్లి, జనంపై ఇంకా కోపాన్ని ప్రదర్శించే మీ వ్యవహారం మీరే బయటపెట్టుకుని .. ఇక మీరు మారర్రా..! అని జనం విసిగెత్తిపోయే ప్రమాదాన్ని మీరే కొనితెచ్చుకుంటున్నారనే విషయాన్ని గుర్తిస్తే ఇకనైనా మంచిదని హితవు పలుకుతున్నారు గులాబీ శ్రేయోభిలాషులు!