Karnataka Style Veg Pulao: సౌత్ ఇండియాలో కర్ణాటక స్టైల్ వంటకాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.ముఖ్యంగా అక్కడి ‘తరకారి పలావ్’ ఇతర ప్రాంతాల పలావ్ కంటే భిన్నంగా, ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పలావ్ యొక్క ప్రత్యేకత ఇందులో.. వాడే పచ్చి కొబ్బరి , పుదీనా మసాలా ముద్ద. ఇది పలావ్కు మంచి రంగును, తాజా సువాసనను ఇస్తుంది. ఆరోగ్యకరమైన కూరగాయలు, నాణ్యమైన బియ్యంతో చేసే ఈ వంటకం అటు బ్రేక్ఫాస్ట్గానూ, ఇటు లంచ్ లేదా డిన్నర్లోకి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు:
బియ్యం: 2 కప్పులు
కూరగాయలు: ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు
మసాలా ముద్ద కోసం: 1 కప్పు పుదీనా,
1/2 కప్పు కొత్తిమీర
4-5 పచ్చిమిర్చి
1 అంగుళం అల్లం
6 వెల్లుల్లి రెబ్బలు
2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, చిన్న దాల్చిన చెక్క
2 లవంగాలు
తాలింపు కోసం: 3 టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి, బిర్యానీ ఆకు, షాజీరా, మరాఠీ మొగ్గ, ఉల్లిపాయ ముక్కలు
ఉప్పు , నీరు (1:2 నిష్పత్తిలో)
తయారీ విధానం:
బియ్యం నానబెట్టడం: ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. దీని వల్ల పలావ్ పొడిపొడిగా, మెత్తగా వస్తుంది.
మసాలా పేస్ట్ తయారీ: జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, గరం మసాలా దినుసులు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రీన్ మసాలాయే ఈ పలావ్కు అసలైన రుచిని ఇస్తుంది.
తాలింపు వేయడం: కుక్కర్లో లేదా మందపాటి గిన్నెలో నూనె , నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, ఇలాచీ వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి దోరగా మారే వరకు వేయించాలి.
కూరగాయలు, మసాలా వేయించడం: ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, బఠానీలు వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మనం సిద్ధం చేసుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ను వేసి, పచ్చి వాసన పోయే వరకు నూనెలో బాగా వేయించాలి.
ఎసరు పోయడం: మసాలా వేగిన తర్వాత, ఎసరు పోయాలి (ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీరు). రుచికి సరిపడా ఉప్పు వేసి నీటిని బాగా మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని అందులో వేయాలి.
Also Read:కేరళ స్టైల్ మెదు వడలు.. ఇంట్లోనే క్రిస్పీగా తయారు చేయండిలా !
ఉడికించడం: అంతా ఒకసారి కలిపి.. మూత పెట్టి కుక్కర్ అయితే రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. సాధారణ గిన్నెలో అయితే మంటను సిమ్ లో పెట్టి నీరు మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించాలి. చివరగా కొద్దిగా నిమ్మరసం చల్లితే రుచి ఇంకా పెరుగుతుంది.
ఘుమఘుమలాడే కర్ణాటక స్టైల్ తరకారి వెజ్ పలావ్ సిద్ధం. దీనిని వేడివేడిగా ఉల్లిపాయ రైతాతో లేదా ఏదైనా మసాలా గ్రేవీతో తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో ఇచ్చినా వారు చాలా ఇష్టంగా తింటారు.